Wednesday, February 26, 2025

రెడ్డి నేతలతో నాకు ఎలాంటి విబేధాలు లేవు : మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రెడ్డి నేతలతో తనకు ఎలాంటి విబేధాలు లేవని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ వేదికగా జరిగిన యాదవ కుల సంఘం సమావేశంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఒక సామాజికవర్గ నేతలు యాదవులను రాజకీయంగా ఎదగనీయంగా అడ్డుకుంటున్నారని, ఇక నుంచి తమ సామాజికవర్గాన్ని తక్కువ చేసి చూసినా, పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఊరుకునే ప్రసక్తే లేదని ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వ్యాఖ్యలపై అంజన్ కుమార్ యాదవ్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తన మాటలు వక్రీకరించారని, రెడ్డి నేతలతో ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు. రాహుల్ ప్రధాని కావడమే అందరి లక్ష్యం అని, కులగణనకు మద్దతుగా మాట్లాడిన మాటలను వక్రీకరించి తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి బలహీన వర్గాల వాస్తవ స్థితిగతులు, జనాభా లెక్కలను కాంగ్రెస్ ప్రభుత్వం సేకరించిందని, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగానే తెలంగాణలో కులగణన జరిగిందన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తూ యాదవ కుల బాంధవుల మీటింగ్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన కొనియాడారని, అయితే ఈ సమావేశంలో తాను అనని మాటలను కూడా కొంతమంది బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులు, వారి మీడియా వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రెడ్లను దూషించినట్టు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు.  ఇలాంటి తప్పుడు వార్తలను తెలంగాణ ప్రజానీకం నమ్మొద్దని, ఇలాంటి అసత్య కథనాలను ప్రచారం చేసే వారిని సామాజిక బహిష్కరణ చేయాలన్నారు. తన స్నేహితులు అనేక మంది రెడ్లు ఉన్నారని, వారంందరితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఒక సామాజిక వర్గాన్ని దూషించే వ్యక్తిత్వం తనది కాదని అంజన్ కుమార్ యాదవ్ ప్రకటనలో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News