Friday, February 7, 2025

కెటిఆర్‌కు మరో అరుదైన గౌరవం

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని ఇల్లినాయ్ రాష్ట్రం, ఇవాన్ స్టన్‌లో ఉన్న ప్రతిష్ఠాత్మక నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీలో ఏప్రిల్ 19న జరిగే కెల్లాగ్ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్- 2025లో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించాలని కెఐబిసి వైస్ ప్రెసిడెంట్ చెనాక్షా గోరెంట్ల లేఖలో ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా కెటిఆర్ పదేళ్లలో రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా ప్రశంసించారు. టి హబ్, టి వర్క్, వీ హబ్ వంటి వినూత్న ఆలోచనల వల్ల తెలంగాణలో సరికొత్త స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందిందని, ఇది దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచిందని గుర్తుచేశారు.

ప్రపంచ ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సాధించడంలో కెటిఆర్ కీలక పాత్ర పోషించారని, తెలంగాణ వేదికగా భారత్ లో పెరిగిన ఈ స్టార్టప్ ఎకో సిస్టమ్ గురించి, సాంకేతిక రంగంలో వస్తున్న ఈ విప్లవాత్మక మార్పుల గురించి మరింత తెలుసుకోవాలని అమెరికాలోని బిజినెస్ స్కూల్ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలు తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టేలా వారిని కెటిఆర్ మెప్పించి ఒప్పించిన తీరు అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఈ డిజిటల్ యుగంలో యువతకు హైదరాబాద్‌ను ఉపాధి అవకాశాల గనిగా తీర్చిదిద్దడం అద్భుతమన్నారు. అలాగే ఔత్సాహికులైన యువతీ యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు కెటిఆర్ వేసిన ప్రణాళికలు కూడా తెలంగాణలో గొప్ప ఫలితాలు సాధించాయన్నారు. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడం ద్వారా కెటిఆర్ గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కూడా బంగారు బాటలు వేశారని అభినందించారు.

స్వల్ప కాలంలోనే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి సాధించడానికి కెటిఆర్ తీసుకున్న అనేక నిర్ణయాలు ఎంతో కీలకపాత్ర పోషించాయని గుర్తుచేశారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా దశాబ్దకాలంలో రూపొందించిన ప్రణాళికలు, సాధించిన విజయాల తాలూకూ అనుభవాలను విద్యార్థులకు వివరించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. సుస్థిర అభివృద్ధికి ఎలా, పునాదులు వేయాలో, పరిపాలనలో సాంకేతికతను జోడించి, మెరుపు వేగంతో ఎలా మెరుగైన ఫలితాలు సాధించాలో సూచనలు చేయాలని కోరారు. కేవలం తమ విద్యార్థులకే కాకుండా, సదస్సుకు హాజరయ్యే యువ పారిశ్రామికవేత్తల్లో కూడా కెటిఆర్ ప్రసంగం స్ఫూర్తి నింపడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News