అమరావతి: తల్లికి వందనం పథకం కింద ఎంత మంది పిల్లలు ఉంటే.. అంతమందికి డబ్బులు ఇస్తామని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో శనివారం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. 30 ఏళ్ల క్రితమే మహిళల కోసం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశామని.. రాష్ట్రాభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నామని చెప్పారు.
సెకండ్ జనరేషన్ సంస్కరణలకు శ్రీకారం చుట్టామని బాబు తెలిపారు. ఒకప్పుడు జన్మభూమి కార్యక్రమం చేపడితే అందరూ సహకరించారని.. ఇప్పుడు పీ4 అనే వినూత్న కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నామన్నారు. “అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేయాలి. సూపర్-6 హామీలు అమలు చేయాలి. దేశంలో ఇంత ఎక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం.. ఆంధ్రప్రదేశ్ తప్ప మరొకటి లేదు” అని సీఎం చంద్రబాబు అన్నారు.