Tuesday, September 24, 2024

పెరిక కులస్థులకు సముచిత రాజకీయ అవకాశాలు

- Advertisement -
- Advertisement -

పెరిక ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు
విదేశాల్లో చదువుకునేందుకు ఓవర్సీస్ స్కాలర్షిప్
పెరిక కులస్థులకు బిసి బంధు
గంప గోవర్ధన్ కు త్వరలో ఉన్నత పదవి
ఆత్మగౌరవ భవన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు

మన తెలంగాణ / హైదరాబాద్ : పెరిక కులస్థులపై మంత్రులు హామీల జల్లు కురిపించారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో ఆదివారం జరిగిన పెరిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణ పనుల శంకుస్థాపన, ఆత్మగౌరవ సభలో మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎంఎల్‌ఎ గంప గోవర్ధన్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, మాజీ చీఫ్ బోడపుంటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెరిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణ కమిటీ చైర్మన్ గటిక విజయ్ కుమార్ మాట్లాడుతూ పెరిక కులస్థులకు సంబంధించిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రులకు అందజేశారు.

పెరికలతో పాటు అన్ని కులాలకు బిసి బంధు అమలు చేయాలని, కుల సంఘాల ఆధ్వర్యంలో నడిచే హాస్టళ్లకు ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలని, పెరిక కులస్తులకు మూడు ఎంఎల్‌ఎ ఒక ఎంఎల్‌సి సీటు కేటాయించాలని, పెరిక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, బిసి ఓవర్సీస్ స్కాలర్షిప్ లో కులాలవారీగా రిజర్వేషన్లు ఉండాలని, పెరిక కులస్తులను ఎంబిసి జాబితాలో చేర్చాలని, ఆత్మగౌరవ భవనానికి రూ. ఐదు కోట్లు కేటాయించాలని సభ తీర్మానించింది. ముఖ్యమంత్రి కెసిఆర్ కోసం సీటు త్యాగం చేసిన గంప గోవర్ధన్ కు మంత్రి పదవి ఇవ్వాలని పెరిక కులస్తులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కోకాపేటలో నిర్మిస్తున్న పెరిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

పెరిక కులస్థులకు బిసి బంధు అమలు అయ్యేందుకు, పెరిక విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు ఓవర్సీస్ స్కాలర్షిప్ అందించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ తో మాట్లాడి, కృషి చేస్తామని హామీనిచ్చారు. పెరిక కులస్థులకు సముచిత రాజకీయ అవకాశాలు ముఖ్యమంత్రి కెసిఆర్ కల్పిస్తారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కి తన కామారెడ్డి నియోజకవర్గాన్ని వదులుకున్న గంప గోవర్ధన్ కు భవిష్యత్తులో ఉన్నత పదవి అందుతుందని మంత్రులు తెలిపారు. వెనక్కు నెట్టేయబడ్డ బిసిలను కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రగతి పథంలోకి తీసుకొచ్చిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్రంలో కేవలం 19 బిసి గురుకులాలు ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాటిని 327కు పెంచిందని, బిసి గురుకులాల్లో 1.80 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని అన్నారు. బిసి బిడ్డల విదేశీ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షలు అందిస్తోందని, ఆడబిడ్డల పెళ్ళిళ్ళలకు రూ. లక్షా 16 ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దాలింగయ్య, భవన నిర్మాణ కమిటీ చైర్మన్ గటిక విజయ్ కుమార్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ బోడ కుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యేలు శ్రీరామ్ భద్రయ్య బండి పుల్లయ్య,వర్కింగ్ ప్రెసిడెంట్ వలిశెట్టి సత్యనారాయణ, అస్సోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూసాని శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి బందు శ్రీధర్ బాబు, భవన నిర్మాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కుంచాల శ్రీనివాస్,గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు బత్తిని పరమేష్,ఎల్ బి నగర్ అధ్యక్షులు సుందరి వీర భాస్కర్,బోడపుంటి ప్రకాష్, అచ్చా రఘు, దాచేపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News