Sunday, September 8, 2024

మాలివాల్ వివాదంపై కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలి: నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపి స్వాతి మాలివాల్‌పై దౌర్జన్యం అంశంపై మాట్లాడనందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తూర్పారబట్టారు. ఆయన నిందితుడు బిభవ్ కుమార్‌ను వెంట పెట్టుకుని ‘నిస్సిగ్గు’గా తిరుగుతున్నారని నిర్మల విమర్శించారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యాలయంలో నిర్మలా సీతారామన్ విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ, ఆప్ కన్వీనర్ ఈ వివాదంపై మాట్లాడాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆప్ మహిళల వ్యతిరేక పార్టీ అని ఆరోపించేందుకు ఆప్ న్యూఢిల్లీ లోక్‌సభ అభ్యర్థి సోమనాథ్ భారతితో సహా పలువురు ఆప్ నేతలపై గల మహిళలపై దాడి ఆరోపణలను ఆమె ఉటంకించారు.

నిర్మల కాంగ్రెస్ తీరునూ ఆక్షేపిస్తూ, గర్భవతి అయిన తన భార్యపై డాడి చేసినట్లు ఆరోపణ ఎదుర్కొంటున్న భారతికి గాంధీ కుటుంబ సభ్యులు వోటు చేయనున్నారని ఆరోపించారు. తమ పార్టీ మహిళా ఎంపిపై జరిగిన దాడిపై కేజ్రీవాల్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నమ్మశక్యం కాకుండా ఉన్నదని, ఆమోద్యయోగ్యం కాదని నిర్మల అన్నారు. ముఖ్యమంత్రి అధికార నివాసంలో తనపై కేజ్రీవాల్ వ్యక్తిగత సిబ్బందిలో ఒకరు ‘దౌర్జన్యం చేశారు’ అని మాలివాల్ ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు ఈ వ్యవహారంలో ఒక ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కుమార్‌ను కేసులో నిందితునిగా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News