Tuesday, September 17, 2024

వైసిపికి షాక్..మరో ఇద్దరు ఎమ్మెల్సీల రాజీనామా?

- Advertisement -
- Advertisement -

వైసీపీ కి మరో ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ్ చక్రవర్తి ఎమ్మెల్సీ పదవుల నుంచి వైదొలగనున్నారని సమాచారం. దీంతో పాటు వైసీపీ కి కూడా వారు రాజీనామా చేసే అవకాశం ఉంది. ఇటీవల ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. గురువారం వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్న విషయం తెలిసిందే. మరో ఆరుగురు వైసీపీ ఎంపీలు కూడా తమ పదవులతో పాటు, ఆ పార్టీకి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ ఎనిమిది మందిలో నలుగురు తెదేపా వైపు, మరో నలుగురు బీజేపీ వైపు చూస్తున్నారని అంటున్నారు. తొలినుంచి రాజకీయాల్లో ఉన్నవారు తెదేపా, వ్యాపార వర్గాలనుంచి వచ్చినవారు బీజేపీ వైపు వెళ్లవచ్చని అంటున్నారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది.

వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్ : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత మరుసటి రోజు నుంచే వైసీపీ షాక్‌లు మొదలయ్యాయి. నాడు మొదలైన బిగ్ షాక్‌లు నేటికి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. రోజుకో నేత, రెండ్రోజులకో ఇద్దరు ఎంపీలు రాజీనామాతో దెబ్బ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గురువారం ఇద్దరు రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రవిల రాజీనామాతో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లయ్యింది. ఈ షాక్ నుంచి తేరుకోక మునుపే మరో ఇద్దరు రాజీనామా చేయడంతో వైసీపీలో వికెట్లు రాలిపోతున్నాయి. అధినేత జగన్‌కు సొంత పార్టీ నేతలు ఇస్తున్న షాకులతో కోలుకోలేకపోతున్నారు. మోపిదేవి, బీద మస్తాన్ రాజీనామా నుంచి తేరుకోక మునుపే మరో ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేసినట్లు సమాచారం. శుక్రవారం ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖలను శాసన మండలి చైర్మన్‌కు రాజీనామా లేఖలు అందచేయనున్నారు. వెంటనే రాజీనామాకు ఆమోదం తెలపాలని ఇద్దరు ఎమ్మెల్సీలు చైర్మన్‌ను కోరనున్నారు.

జాతీయ మత్య్సకార మహిళా అధ్యక్షురాలుగా, రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సమితి మహిళా అధ్యక్షురాలిగా పని చేసిన పద్మశ్రీ గతంలో వైసీపీలో చేరారు. మార్చి 2023లో జరిగిన ఎన్నికలకు గవర్నర్ కోటా నుంచి వైసీపీ ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. తిరుపతి లోక్‌సభ నుంచి 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తి. 2020 సెప్టెంబర్‌లో కరోనాతో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చిన కళ్యాణ్‌ను 2021లో ఎమ్మెల్యేల కోటాలో అధిష్టానం ఎమ్మెల్సీని చేయడం జరిగింది. ఈ ఇద్దరూ ఎమ్మెల్సీలు అయ్యి తక్కువ కాలమే అయ్యింది. అయితే ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది.? పార్టీపై అసంతృప్తితో గుడ్ బై చెబుతున్నారా..? లేకుంటే వ్యక్తిగత కారణాలున్నాయా..? అనేదానిపై ఎలాంటి స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే త్వరలోనే మరికొందరు ఎమ్మెల్సీలు, నాలుగు నుంచి ఐదుగురు రాజ్యసభ ఎంపీలు కూడా రాజీనామాకు రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ ఒకటి, రెండు తేదీల్లో రాజీనామాలు ఉంటాయని సమాచారం. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారని వైసీపీలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందని తెలిసింది. దీన్ని బట్టి చూస్తే రాజీనామాలు ఇప్పట్లో ఆగే పరిస్థితి అయితే కనిపించట్లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News