Saturday, March 29, 2025

దమ్ముంటే బిఆర్‌ఎస్ స్కామ్‌లన్నీ సిబిఐకి అప్పగించండి

- Advertisement -
- Advertisement -

అప్పుడు దోషులందరినీ లోపల వేస్తాం
రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తూ..కేంద్రాన్ని అరెస్ట్ చేయమంటారా?
మీరు చీకటి ఒప్పందాలు చేసుకుని మాపై బురద చల్లుతారేంటి
: సిఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తుండగా, కేంద్రం కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలనడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, గొర్రెల స్కాంలపై సిఎం వ్యాఖ్యలు చూస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారా? లేక మేము ఉన్నామా? అనే అనుమానం వస్తోందని అన్నారు. శాంతిభద్రతలు రాష్ట్రం పరిధిలోనివని గుర్తు చేశారు. బండి సంజయ్ సోమవారం సాయంత్రం ఒక ప్రకటన జారీ చేశారు.

బిఆర్‌ఎస్ హాయాంలో జరిగిన కుంభకోణాలు, వాటిపై దర్యాప్తు జరిగిన తీరును ఆ లేఖలో ప్రస్తావించారు. కేసీఆర్ కుటుంబం, బీఆర్‌ఎస్ నేతలు స్కాంలు చేసింది రాష్ట్రంలోనేనని, విచారణ చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వమేనని తెలిపారు. ఇప్పటికే కొంత మంది నిందితులను కూడా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. శాంతిభద్రతలు మీ చేతిలో పెట్టుకుని మీరేందుకు అరెస్ట్ చేయలేదని కేంద్రాన్ని సిఎం నిందించడం చూస్తుంటే నవ్వొస్తుందని సంజయ్ తెలిపారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ విదేశాలకు పోతే, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా ఆయా స్కామ్‌ల సూత్రధారులు తెలంగాణలోనే ఉన్నారు కదా? మరి వాళ్లను ఇన్నాళ్లుగా ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు.

పైకి తిడుతున్నట్లుగా నటిస్తూ కేసీఆర్ కుటుంబంతో చీకటి ఒప్పందాలు చేసుకుంటూ అరెస్ట్ కాకుండా కాపాడుతూ ఆయా కేసులను నీరుగారుస్తున్నది మీరు కాదా? అని రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. మీకు నిజంగా నిజాయితీ ఉంటే ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, గొర్రెల స్కాం, కాళేశ్వరం, కేటీఆర్ బామ్మర్థి డ్రగ్స్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఆయా కేసుల్లో దోషులెవరైనా అరెస్ట్ చేసి లోపల వేయించే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కోరకుండా న్యాయ స్థానాల ఆదేశాలు లేకుండా సీబీఐ తనంతట తాను విచారణ జరిపే అధికారం లేదని తెలిసి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కేంద్రంపై బురద చల్లడం ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమని ఆ లేఖలో వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డి ప్రసంగం పచ్చి అబద్దాలు, అర్ధ సత్యాలు

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగమంతా పచ్చి అబద్దాలు, అర్ధ సత్యాలతో నిండిపోయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటమి ఖాయమనే భయం ఆయనలో స్పష్టంగా కన్పిస్తోంది. ఇంటెలిజెన్స్ సహా అన్ని సర్వే సంస్థలన్నీ బీజేపీ గెలుపు తథ్యమని తేల్చేశాయని, కాంగ్రెస్ మూడవ స్థానానికి పడిపోతుందని నివేదిక ఇవ్వడంతో దిక్కుతోచని ముఖ్యమంత్రి హడావుడిగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వచ్చి ఒకే రోజు 3 జిల్లాల్లో 3 సమావేశాల్లో పాల్గొంటూ అబద్దాలాడుతూ, ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసేలా మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఓటమి భయం పట్టుకుంది కాబట్టే ఎన్నికల్లో పాల్గొంటూ డబ్బు, అధికార బలంతో ఎలాగైనా గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. దీనికితోడు ఓడిపోతే మీ సమస్యలను పరిష్కరించబోనంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ ముఖ్యమంత్రి అర్ధ సత్యాలు, అబద్దాలతోనే ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 51 శాతం ఉందని, ఆ సంఖ్యను 46 శాతానికి ఎట్లా తగ్గిస్తారని అసెంబ్లీ సాక్షిగా నాటి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కేటీఆర్, హరీష్ రావులే చెప్పారని గుర్తు చేశారు. మరి ఆనాడెందుకు ముస్లిం జనాభా గురించి సీఎం నిలదీయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న ముస్లింల్లో 80 శాతం మందిని బీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు అమలు చేసి నిజమైన బీసీ బిడ్డల పొట్టకొడుతుంటే చూస్తూ ఊరుకోవాలా అన్నారు. మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తామని, బీసీ జాబితా నుండి ముస్లింలను తొలగించి బీసీ బిల్లు పంపితే కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత తాము తీసుకుంటామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News