Tuesday, September 17, 2024

బంగ్లాదేశ్‌లో హిందువుల భారీ ర్యాలీ

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్ ప్రధాని షేఖ్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు పారిపోయినా దేశంలో పరిస్థితులు సద్దుమణగడం లేదు. మైనారిటీలమైన తమపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ లక్షలాది మంది శనివారం రోడ్లపైకి వచ్చి భారీ ర్యాలీలు నిర్వహించారు. రాజధాని ఢాకా, రెండవ ప్రధాన నగరమైన చిట్టగాంగ్‌లో వారు భారీ నిరసనలు చేపట్టారు. ర్యాలీల్లో ఏడు లక్షల మంది హిందువులు పాల్గొన్నారని కథనాలు వెలువడుతున్నాయి. మైనారిటీలను వేధించిన వారిపై దర్యాప్తును వేగవంతం చేయాలని హిందువులు కోరారు. మైనారిటీలకు పది శాతం పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని, మైనారిటీ రక్షణ చట్టాన్ని అమలు చేయాలని వారు నినాదాలు చేశారు. మైనారిటీల ఆందోళనకు సంఘీభావం వ్యక్తంచేస్తూ నిరసనలోని విద్యార్థులతో సహా వేలాది మంది ముస్లిం నిరసనకారులు కూడా ర్యాలీల్లో పాల్గొన్నారు.

ఈ భారీ ర్యాలీతో ఢాకా నగరంలో మూడు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. కాగా, అమెరికా, యుకెలలో కూడా ఇటువంటి నిరసనలు జరిగాయి. కాగా, షేఖ్ హసీనా రాజీనామా చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా హింసాత్మక ఆందోళనలు జరిగిన విషయం విదితమే. ఈ హింసాకాండలో మైనారిటీ వర్గాలపై 205 పైగా దాడులు జరిగాయి. ఎక్కువగా హిందువులపైనే దాడులు జరిగాయి. వందలాది మంది హిందువులపైన, వారి ఇళ్లు, వ్యాపారాలపైన కూడా దాడులు జరిగాయి. అనేక మంది గాయపడ్డారు. ఇద్దరు హిందు నాయకులు హింసకు బలి అయ్యారు. అంతే కాదు. పలు హిందు దేవాలయాలు కూడా ధ్వంసమయ్యాయని కథనాలు వెలువడుతున్నాయి. దీనితో వేలాది మంది బంగ్లాదేశ్ హిందువులు పొరుగున ఉన్న భారత్‌కు పారిపోయినట్లు సమాచారం.

స్పందించిన మధ్యంతర ప్రభుత్వ సారథి
దేశంలో మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడులను బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ సారథి ముహమ్మద్ యూనస్ ఖండించారు. ఈ దాడులను హేయనీయమైనవిగా ఆయన అభివర్ణించారు. హిందు, క్రిస్టియన్, బౌద్ధ కుటుంబాలను దాడుల నుంచి రక్షించాలని ఆయన నిరసనలు చేపడుతున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాలకు పిలుపు ఇచ్చారు. ‘వారు కూడా దేశ ప్రజలే కదా! మీరు దేశాన్ని రక్షించగలిగారు. మరికొన్ని కుటుంబాలను రక్షించలేరా? వారు నా సోదరులు. ఎవరూ వారికి హాని చేయవద్దు. మనం అంతా కలసి పోరాడాం. కలసి జీవిద్దాం’ అని యూనస్ పిలుపు ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News