ఢాకా : బంగ్లాదేశ్లో మరోసారి హింసాత్మక సంఘటనలు చెలరేగాయి. బంగబంధుగా పేరొందిన షేక్ ముజిబుర్ రెహమాన్ చారిత్రక నివాసంపై దాడి జరిగింది. కొందరు నిరసనకారులు ఆయన నివాసంపై దాడి చేసి నిప్పంటించారు. అనూహ్యంగా పదవి కోల్పోయి భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా సామాజిక మాధ్యమం వేదికగా ప్రసంగిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఆమె ప్రసంగంలో మహమ్మద్ యూనస్ నేతృత్వం లోని మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని అవామీ లీగ్ పార్టీకి ఆమె పిలుపునిచ్చారు. ఈ నేపథ్యం లోనే ఢాకాలో సంఘటనలు చెలరేగినట్టు తెలుస్తోంది. ఇంటికి నిప్పు పెట్టడంపై సైతం ఆమె స్పందించారు.
“ వారు ఓ భవనాన్ని కూల్చివేయగలరు. కానీ చరిత్రను కాదు. దీన్ని వారు గుర్తించుకోవాలి ’ అని పేర్కొన్నారు. ఈ ఇల్లు అధికారవాదం, ఫాసిజానికి చిహ్నమని నిరసనకారులు పేర్కొన్నారు. అంతేకాక, 1972 నాటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్కు బంగబంధుగా పేరుంది. బంగ్లాదేశ్ విముక్తి పోరాటాన్ని భారత్ సాయంతో పూర్తి చేశారు. అనంతరం 1975 లో ఆయన అధికార నివాసంలో ఉండగా సైన్యం దాడి చేసి ఆయనతోసహా ఇంట్లో వారిని చంపేసింది. రెహమాన్తో సహా ఆ కుటుంబంలో మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో హసీనా, ఆమె సోదరి రెహనా జర్మనీలో ఉండటంతో బతికిపోయారు. బంగ్లా చరిత్రలో ముజిబుర్ నివాసం ఒక ఐకానిక్ చిహ్నంగా గుర్తింపు పొందింది. అవామీ లీగ్ పాలనలో దీన్ని మ్యూజియంగా మార్చారు.