సర్వేలో బీసీ జనాభాను తగ్గించి చూపించారు
: బిజెపి శాసనసభ పక్ష ఉపనేత పాయల్ శంకర్
మన తెలంగాణ/హైదరాబాద్: గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని బిజెపి శాసనసభ పక్ష ఉపనేత పాయల్ శంకర్ హెచ్చరించారు. పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భ్రస్టుపట్టించిన బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందే, ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, మోసపూరిత పాలనకు కూడా అదే గతి పడుతుందని అన్నారు.
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 75 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి బడ్జెట్ రాలేదని ప్రజలు సంతోషిస్తున్నారని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్కు దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలు మొదట తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు సంగతి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీల అమలుపై రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వాటిని ఎప్పుడు అమలు చేస్తారో దాని గురించి మాట్లాడాలని వ్యాఖ్యానించారు. కులగణన సర్వేలో బీసీల జనాభాను తగ్గించి చూపించారని పాయల్ శంకర్ ఆరోపించారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.