ఏప్రిల్ 2న ఢిల్లీలో బిసిల పోరుగర్జన మహ ధర్నా
అఖిలపక్ష పార్టీలకు జాజుల శ్రీనివాస్ గౌడ్ బృందం ఆహ్వానం
మన తెలంగాణ / హైదరాబాద్ : బిసిలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్లో ఆమోదించి బిసి రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇందు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏప్రిల్ రెండవ తేదీన ఢిల్లీలో బిసిల పోరు గర్జన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోరు గర్జన సభకు అఖిలపక్ష పార్టీల నేతలు హాజరై బీసీలకు అండగా నిలబడాలని ఆయన ఆయా రాజకీయ పార్టీల నేతలను కలిసి కోరారు. కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, టిఆర్ఎస్ పార్టీ ఎంఎల్సి మధుసూదనా చారి, టిజెఎస్ అధ్యక్షులు కోదండరాం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ లను ఆయన ఆదివారం వారి పార్టీ కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
ఏప్రిల్ 2న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద బిసిల పోరు గర్జన మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ ధర్నాకు హాజరై బిసిలకు అండగా నిలబడాలని ఆయా రాజకీయ పార్టీల అధ్యక్షులు కోరినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బిసి రిజర్వేషన్స్ బిల్లులకు అసెంబ్లీలో ప్రాతినీద్యం ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బెషరతుగా మద్దతు తెలిపాయని ఆయన తెలిపారు. ఇందుకు రాజకీయ పార్టీల నేతలను కలిసి స్వయంగా ధన్యవాదాలు తెలిపామని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు ఏ విధంగా బిసి బిల్లుకు మద్దతు తెలిపారో పార్లమెంట్లో కూడా ఆమోదించే వరకు బిసిల పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
బిసి ఓట్లతో గెలిచి చట్టసభల్లోకి వెళుతున్న రాజకీయ పార్టీల నేతలు బిసి బిల్లు ఆమోదించడం ద్వారా బిసిల రుణం తీర్చుకోవాలని జాజుల కోరారు. ఈ ప్రతినిది బృందంలో బిసి కుల సంఘాల జెఎసి చైర్మన్ కుందారం గణేష్ చారి, కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బిసి విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రం గౌడ్, వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు వేముల వెంకటేష్ సగర ఉప్పర సంఘం అధ్యక్షులు శేఖర్ సగర, నాయకులు, ఎస్ దుర్గయ్య గౌడ్,జాజుల లింగం గౌడ్, ఐలి వెంకన్న, తదితరులు ఉన్నారు.