Friday, October 18, 2024

హార్దిక్‌కు షాక్.. టి20 కెప్టెన్‌గా సూర్యకుమార్

- Advertisement -
- Advertisement -

ముంబై: శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమిండియాను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ప్రకటించింది. గురువారం జట్ల జాబితాను సెలెక్టర్లు ప్రకటించారు. భారత టి20 జట్టు సారథిగా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేశారు. వన్డే సిరీస్‌లో రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మనే సారథ్యం వహిస్తాడు. సీనియర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను టి20 జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని భావించినా సెలెక్టర్లు మాత్రం సూర్యకుమార్ యాదవ్‌వైపే మొగ్గు చూపారు. రెండు ఫార్మాట్‌లలో కూడా స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. కాగా, శ్రీలంక పర్యటనలో భాగంగా భారత్ మూడు టి20లు, మరో 3 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.

జులై 27, 28, 30 తేదీల్లో టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. మూడు మ్యాచ్‌లో పల్లెకెలెలోనే జరుగుతాయి. ఇక వన్డే సిరీస్ ఆగస్టు తొలి వారంలో జరుగుతుంది. తొలి వన్డే ఆగస్టు 2న, రెండో వన్డే 4న, మూడో చివరి వన్డే ఆగస్టు ఏడున నిర్వహిస్తారు. మూడు మ్యాచ్‌లు కూడా కొలంబో వేదికగానే జరుగుతాయి. ఇదిలావుండగా ఇటీవల జింబాబ్వేతో జరిగిన టి20 సిరీస్‌లో మెరుగైన ప్రదర్శనతో అలరించిన యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్‌లకు నిరాశే మిగిలింది. వీరికి లంక సిరీస్‌లో చోటు దక్కలేదు. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్‌లు టి20 జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరికి వన్డేల్లో స్థానం లభించలుదు.

కాగా, వన్డేల్లో శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్‌కు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. శివమ్ దూబె, అక్షర్ పటేల్, సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్‌లు రెండు ఫార్మాట్‌లలోనూ జట్టుకు ఎంపికయ్యారు. కాగా, యువ ఆటగాళ్లు రియాన్ పరాగ్, హర్షిత్ రాణాలు తొలిసారి వన్డే జట్టుకు ఎంపిక కావడం విశేషం. రిషబ్ పంత్ రెండు సిరీస్‌లలో కూడా వికెట్ కీపర్ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. టి20లలో రింకు సింగ్, జైస్వాల్, హార్దిక్‌లకు స్థానం లభించింది. వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరంగా ఉండనున్నాడు. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కుల్‌దీప్ యాదవ్‌లకు వన్డే సిరీస్‌లో చోటు లభించింది. కాగా, శ్రీలంక సిరీస్ కోసం రెండు వేర్వేరు జట్లను సెలెక్టర్లు ఎంపిక చేశారు.

జట్ల వివరాలు:

టి20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, మహ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్.

వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబె, సిరాజ్, ఖలీల్, అక్షర్ పటేల్, రియాన్ పరాగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్, కుల్‌దీప్ యాదవ్.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News