బిసి అభ్యర్థులకు మద్దతుగా కరీంనగర్ నుండి బిసిల టూర్
బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎంఎల్సి ఎన్నికలలో బిసి అభ్యర్థులను గెలుపించు కోవాడానికి ‘ బిసిల ఓటు బిసిల కే‘ అనే నినాదం తో ఈనెల 17 నుండి 26 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు ఏర్పాటు చేసినట్లు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజులా శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాద్యాయ నియోజకవర్గం నుండి పూల రవీందర్, కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ ఉపాద్యాయ ఎంఎల్సి ఎన్నికలలో మాల్క కొమురయ్య, ఇదే నియోజకవర్గం పట్టభద్రుల నుండి ప్రసన్న హరికృష్ణ లకు బిసి సంక్షేమ సంఘం నుండి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ ఎంఎల్సి ఎన్నికల్లో అగ్రకులాల ఆధిపత్యాన్ని ఓడించి బడుగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి రాజకీయాలకు అతీతంగా బిసిలు ఏకం కావాలని, చట్టసభలో బిసిల ప్రాతినిధ్యం పెరిగి బిసిల వాణి చట్టసభలలో వినిపించడానికి ఎంఎల్సి ఎన్నికలలను వేదిక చేసుకోవాలని అయన విజ్ఞప్తి చేశారు. ఈ ఎంఎల్సి ఎన్నికల్లో ముగ్గురు బిసిలను గెలిపిస్తే వచ్చే 2028 ఎన్నికల్లో రాష్ట్రంలో బిసిలకు వంధ శాతం రాజకీయాధికారం సిద్ధిస్తుందని, బిసి సిఎం అవడం ఖాయమని జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.