ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో
అమలు జూన్ 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా
అందుబాటులోకి ఒకేసారి పోర్టల్ను
సందర్శించవద్దు.. ఆగిపోయే ప్రమాదం
ఉంది నేడు అంబేద్కర్ జయంతి
సందర్భంగా పోర్టల్ను సిఎం జాతికి
అంకితం చేస్తారు ధరణి పేరిట
కొల్లగొట్టిన భూములపై ఫోరెన్సిక్
ఆడిట్ వచ్చే నెల మొదటివారంలో
గ్రామ పరిపాలనా అధికారుల వ్యవస్థ
మీడియాతో రెవెన్యూ మంత్రి
పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇష్టాగోష్ఠి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అందరి భూములకు భద్రత కల్పించడమే ప్రధాన ధ్యేయంగా భూ భారతి చట్టాన్ని, భూ భారతి పోర్టల్ను అందుబాటులోకి తెస్తున్నామని రెవెన్యూ, హౌ సింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. భూ భారతి పోర్టల్ను రాష్ట్రమంతటా ఒకేసారి ప్రారంభిస్తే తప్పులు సరిచేయడం ఇబ్బంది అవుతుందని, అందుకే తొలుత ప్రయోగాత్మకంగా మూడు జిల్లాలలోని మూడు మండలాలలో ఈ చట్టాన్ని అమలు చేయబోతున్నామని తెలిపా రు. ఈ మూడు మండలాలలో వచ్చిన సమస్యలను పరిష్కరించి, ఆ ఫలితాలను దృష్టిలో పెట్టుకొని జూన్ 2వ తేదీ నాటికి భూ భారతిని పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకువస్తామని చెప్పారు. భూ భారతి పోర్టల్ను సోమవారం(ఏప్రిల్ 14) ప్రారంభించనున్న నేపథ్యంలో సచివాలయంలోని ఆయన ఛాంబర్లో ఆదివారం రెవి న్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ఈ భూభారతి చట్టాన్ని,
పోర్టల్ను ప్రజలకు అంకితం చేస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో రైతుల భూముల పరిరక్షణ బాధ్యత ఈ ప్రభుత్వానిదే అని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని తాము ఇచ్చిన హామీని విశ్వసించి ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ధరణిని బంగాళాఖాతంలో వేసి అందరికీ ఆమోదయోగ్యమైన భూ భారతి చట్టాన్ని తీసుకురావడం, అందులో రెవెన్యూశాఖ మంత్రిగా తనకు భాగస్వామ్యం అయ్యే అవకాశం వచ్చినందుకు తన జన్మ ధన్యమైందని వ్యాఖ్యానించారు.
ధరణి ముసుగులో జరిగిన భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్
భూ భారతి చట్టం 2029 శాసనసభ ఎన్నికలకు తమకు రిఫరెండం అని గతంలో శాసనసభలోనే ప్రకటించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు కూడా మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నానని తెలిపారు. భూములపై రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి ఒక భరోసా, భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ చట్టం రూపొందించామని తెలిపారు. గతంలో మాదిరిగా రాత్రికి రాత్రే ఇద్దరు వ్యక్తులు కలిసి చట్టాన్ని రూపొందిస్తే తమ ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రైతులు, మేధావులు నిపుణులతో చర్చించి చట్టాన్ని రూపొందించామని చెప్పారు. గతంలో చెప్పినట్లుగానే భూ భారతి చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ధరణి ముసుగులో జరిగిన భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తామని పేర్కొన్నారు.
ఒకే సారి పోర్టల్లో ప్రవేశించవద్దు
రాష్ట్రంలో సోమవారం భూ భారతి పోర్టల్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో భూ యజమానులు తమ భూమి వివరాలు తెలుసుకునేందుకు ఒకేసారి పోర్టల్ను సందర్శించవద్దని మంత్రి పొంగులేటి విజ్ఞప్తి చేశారు. దీనివలన మొత్తం పోర్టల్ ఆగిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. కాబట్టి ఒకేసారి కాకుండా మరుసటి రోజు, ఆ తర్వాత ఎప్పుడైనా భూ యజమానులు పోర్టల్లో తమ భూముల వివరాలు తెలుసుకోవచ్చని అన్నారు. అంతేగాక కొంతమంది ఉద్దేశ పూర్వకంగా పోర్టల్ను స్టక్ చేయాలని భావిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్ఐసి ఆధ్యర్యంలో నిర్వహించే భూ భారతి పోర్టల్లో ఆధునిక అంశాలను జోడిస్తూ అత్యాధునిక వెర్షన్ను ప్రజలకు అందించే ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు. రిజిస్ట్రేషన్లకు ఆటంకం లేకుండా పోర్టల్ అభివృద్ది చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా జిల్లాల్లో ట్రిబ్యునల్స్ ఏర్పాటు
వచ్చేనెల మొదటివారంలో గ్రామ రెవెన్యూ పాలనా అధికారులను అమలులోకి తెస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. గతంలో ధరణిని తీసుకువచ్చిన సమయంలో దాదాపు 4 నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని, ఇప్పుడు ఆ పరిస్ధితి లేకుండా క్రమక్రమంగా పోర్టల్ను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా భూభారతి చట్టం, పోర్టల్ అమలుకు సంబంధించి ఎంపిక చేసిన ప్రయోగాత్మక మండలాలు, గ్రామాలలో స్వయంగా తాను పర్యటిస్తానని మంత్రి పొంగులేటి వెల్లడించారు. అదేవిధంగా సంబంధిత మంత్రులు కూడా పర్యటిస్తారని తెలిపారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహనా సదస్సులు నిర్వహించేందుకు నిర్ణయించామని తెలిపారు. భూభారతిలో ఎంఆర్ఒ స్ధాయి నుంచి సిసిఎల్ఎ వరకు సుమారు ఐదు స్ధాయిలలో భూ సమస్యల పరిష్కారానికి వీలుగా అధికారాలు వికేంద్రీకరించామని వివరించారు. అంతేగాక ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా జిల్లాల వారీగా, లేదా కొన్ని జిల్లాలకు ఒకటి చొప్పున ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తర్వాత కాలంలో సమస్యలు తగ్గితే ట్రిబ్యునళ్లను కుదిస్తామని చెప్పారు. ధరణిలో గతంలో ఉండే 33 మాడ్యూల్ను ఆరు మాడ్యూల్స్కు తగ్గించామని, దీనివలస అందరికీ ఈ పోర్టల్ సులభతరంగా ఉంటుందని తెలిపారు.