మహాకుంభ్ నగర్: భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్చుక్ మంగళవారం త్రివేణి సంగం వద్ద పుణ్య స్నానం ఆచరించారు. ఆయన సూర్యుడికి ‘అర్ఘ’ను ఇచ్చేప్పుడు ఆయన వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. భూటాన్ సాంప్రదాయిక దుస్తుల్లో వాంగ్చుక్ విమానాశ్రయంలో దిగారు. సంగంలో పుణ్యస్నానం ఆచరించేప్పుడు ఆయన వెంట యూపి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, కేబినెట్ మంత్రులు స్వతంత్ర దేవ్ సింగ్, నంద్గోపాల్ గుప్తా , సత్వ బాబాగా ప్రసిద్ధి చెందిన విష్ణుస్వామి సెక్ట్ నాయకుడు జగద్గురు సంతోష్ దాస్ మహారాజ ఉన్నారు. త్రివేణి సంగంలో ఆచారాలు పాటిస్తున్నప్పుడు భూటాన్ రాజుకు ఆదిత్యనాథ్ మార్గనిర్దేశన చేశారు.
నదిలో మునక వేసాక భూటాన్ రాజు అక్షయ్వట్, బడే హనుమాన్ మందిరం సందర్శించారు. వారు డిజిటల్ మహా కుంభ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను కూడా చూశారు. భూటాన్ రాజు లక్నోలో దిగిన తర్వాత గవర్నర్ ఆనందిబేన్ పటేల్ను కూడా కలిశారు. అంతేకాక ఆయన మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్ఫాంజలి ఘటించారు. భారతభూటాన్ సంబంధాలపై భూటాన్ రాజుతో ఉత్తర్ప్రదేశ్ గవర్నర్, ముఖ్యమంత్రి చర్చించారు. ఇదిలావుండగా మంగళవారం మధ్యాహ్నం 12.00 గంటల వరకు మహాకుంభ్మేళాలో 54 లక్షలకు పైగా భక్తులు పవిత్ర స్నానం ఆచరించారు. జనవరి 13 మొదలైన ఈ ఆధ్యాత్మిక మెగా ఫెయిర్లో ఇప్పటి వరకు మొత్తంగా 37.50 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానం ఆచరించారు. ఇక మహాకుంభ్మేళా ఫిబ్రవరి 26న ముగియబోతున్నది.