Saturday, October 5, 2024

మళ్ళీ మొదలైన బిజెపి దాడి

- Advertisement -
- Advertisement -

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల తీర్పు ప్రత్యేకంగా చెప్పుకోదగింది. తాము ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ఎంత విలువ ఇస్తామో ఈ తీర్పు ద్వారా ప్రజలు చాటి చెప్పారు. 2014లోనూ, 2019లోనూ పరిపూర్ణ ఆధిక్యత తెచ్చుకున్న బిజెపికి ఈసారి ప్రజలు ఆ అవకాశం నిరాకరించారు. 303 స్థానాలున్న బిజెపి సీట్ల సంఖ్య ఈసారి 240కి పడిపోయింది. అంటే 21% తగ్గింది. ఎన్‌డిఎకు 292, ‘ఇండియా’ వేదికకు 234 స్థానాలు వచ్చాయి. మోడీ పదేళ్ల పాలన నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ పాలన మొత్తం లక్షణం నియంతృత్వ పోకడలతో హిందూత్వ, మతతత్వ ఎజెండాను అమలు జరిగింది. రాజ్యాంగ వ్యవస్థలో ప్రతి అంగమూ దిగ్బంధానికి గురైంది.

రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట పెట్టుకోవడానికి దారితీసింది.ఎన్నికల సన్నాహక దశలోనే ఇది ప్రతిబింబించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా పెట్టుకుని దాడి చేశాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు జైళ్ల పాలయ్యారు. కాంగ్రెస్, సిపిఐ(ఎం)వంటి రాజకీయ పక్షాలపై కక్ష సాధింపు సాగింది. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షానికి సమాన అవకాశం లేకుండా పోయింది. ఈ విషయంలోఎన్నికల కమిషన్ శోచనీయమైన పాత్ర పోషించింది. వెన్నెముకలేని కమిషనర్లతో నియమించబడిన ఎన్నికల కమిషన్ ఎన్నికల నియమావళి ఘోర ఉల్లంఘనలను శిక్షించడంలో గట్టిగా నిలబడలేక విఫలమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాలలో ముస్లింలపై విషం కక్కుతున్నా హద్దు అదుపూ లేకపోయింది.
పోలింగ్ శాతానికి సంబంధించిన లెక్కలను క్రోడీకరించడంలో పారదర్శకత చూపించలేక అనవసర సందేహాలకూ తావిచ్చింది.ఈ కీలక రాజ్యాంగ వ్యవస్థ విశ్వసనీయతకు విఘాతమేర్పడింది.

కార్పొరేట్ మీడియావరణాన్ని పూర్తిగా బిజెపి గుత్తాధిపత్యంలోకి తెచ్చుకుంది. సోషల్ మీడియాలోనూ భారీ వనరులు గుమ్మరించింది. ప్రచారంలోనూ ఓటర్లకు పంచిపెట్టడం కోసమూ వేల కోట్లు వెచ్చించింది.ఈ మొత్తం ప్రచారంలో మోడీ, ఆయన హంగుదార్లు ‘ఇండియా’ వేదికలోని పార్టీల పట్ల బెదిరింపులు, మోసగింపు ఎత్తుగడలకు పాల్పడ్డారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులలోనే ‘ఇండియా’ వేదిక పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించవలసి వచ్చింది. మోడీ పచ్చిమతోన్మాద పల్లవికి వ్యతిరేకంగా ప్రతిపక్షం నిరుద్యోగం, ఉద్యోగాలు, ధరల పెరుగుదల, వ్యవసాయ సంక్షోభం వంటి అంశాలను ముందుకు తెచ్చింది. హిందూత్వ శక్తుల నుంచి ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ఎదురవుతున్న ప్రమాదాలపై దృష్టి సారించేలా చేసింది. మొట్టమొదటిసారిగా రాజ్యాంగ రక్షణ అంశం విశాల ప్రజారాశులను మరీ ముఖ్యంగా దళితులను ఆకట్టుకుంది. బిజెపి మెజారిటీ కోల్పోవడంలో ఉత్తరప్రదేశ్‌లో దానికి తగిలిన ఎదురు దెబ్బ కీలకమైంది.

అక్కడున్న 80 స్థానాలలోనూ గతంలో 62 వస్తే ప్రస్తుతం 33 మాత్రమే పొందగలిగింది. హిందూత్వ రాజకీయాలకు ఉత్తరప్రదేశ్ గుండెకాయ లాంటిది. అయోధ్యలో రామ మందిరం, హిందూ దురభిమాన ఎజెండాకు ప్రతీక లాంటిది. ఇవన్నీ ఉన్నా బిజెపి ఓట్లు 9% తగ్గిపోయాయి. నిరుద్యోగ సమస్య మూకుమ్మడి ప్రభావం, ధరల పెరుగుదల, రైతుల అసంతృప్తి, అగ్నివీర్ పథకంపై యువత అసంతృప్తి, పరీక్షా పత్రాల లీకేజీ వంటి అంశాలే మతతత్వ సమీకరణను మించిన ప్రభావం చూపించాయి.

సమాజ్ వాది పార్టీ చాకచక్యంగా నడిపిన కుల సమీకరణ రాజకీయాలు ఇందుకు తోడైనాయి. అయోధ్యకు నెలవుగా వున్న ఫైజాబాద్ లోక్‌సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించే బిజెపి సభ్యుడు ఓడిపోవడం ఓటరు ఎంత దూరమైనారో కళ్లకుకట్టే కఠోర వాస్తవంగా నిలిచింది. ఎగ్జిట్ ప్రహసనం ఏడవ చివరి దశ పోలింగ్ ముగిశాక వెల్లువగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఎన్‌డిఎ గొప్ప విజయం సాధించబోతున్నదన్న చిత్రణ ఇచ్చాయి. సగటున చూస్తే బిజెపికి కనీసంగా 367 వస్తాయని చెప్పాయి. ప్రతిపక్షాలను డీలా పడేసి పాలక పార్టీ ఆధిపత్యానికి కొమ్ముకాయడానికి ప్రయోగించిన ఆయధాలే ఇవి. మరింత లోతైన ఉద్దేశం మీడియా కార్పొరేట్ కూటమితో స్టాక్ మార్కెట్లో లాభాలు కొల్లగొట్టడం. దీనంతటి వల్ల ముంబాయి స్టాక్ ఎక్స్చేంజ్‌లో మదుపరుల పెట్టుబడి రూ. 14 లక్షల కోట్లు పెరిగింది. ఎపి, ఒడిశా పాఠాలు పార్లమెంటుతో పాటు శాసనసభ ఎన్నికలు జరిగిన ఒడిశాలో బిజూ జనతాదళ్, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సిపి ఈ ఎన్నికల్లో అధికారం కోల్పోయాయి.

అవి లోక్‌సభ ఎన్నికలలో దెబ్బతినడమేగాక రాష్ట్ర ప్రభుత్వాలను పోగొట్టుకున్నాయి. ఒడిశాలోని 21 లోక్‌సభ స్థానాలలో బిజెపి 20 స్థానాలు తెచ్చుకోవడమే గాక శాసనసభలోనూ మెజార్టీ తెచ్చుకుంది. మోడీ ప్రభుత్వంతో జతకట్టే లేదా వత్తాసునిచ్చే ప్రాంతీయ పార్టీలకు ఈ రెండు రాష్ట్రా లూ ఒక గుణపాఠం నేర్పుతున్నాయి. బిజెపిని గట్టిగా వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలు డిఎంకె, సమాజ్ వాదీ పార్టీ, ఆర్‌జెడి వంటివే నిలదొక్కుకుని మరింత బలోపేతమైనాయి. బిజెపి ఇంత గట్టి దెబ్బ తిందంటే దానికి పూర్తి కారకుడు మోడీనే. దీని వెనక అసలు కుట్రదారి బిజెపినే. ఆ పార్టీ ఎన్నికల ప్రణాళిక కూడా మోడీకే గ్యారంటీ అని నామకరణమైంది. మోడీ చుట్టూ సృష్టించబడిన అత్వం కథలు కకావికలైపోయాయి. ఎన్‌డిఎ మిశ్రమ ప్రభుత్వ ఏర్పాటుతోనైనా మోడీ, అమిత్ షాల బరితెగింపు పోకడలకు కళ్లెంపడుతుందని ఆశించాలి. ఎన్‌డిఎకు మూడింట రెండు వంతుల బలమేమీ వుండబోదు. ఒకే దేశం, ఒకే ఎన్నిక వంటి అనేక పథకాలను తీసుకొచ్చే ఆలోచనలు దీంతో ఛిన్నాభిన్నమైనట్టే. మూడో దఫా అధికారంలోకి రాగానే ఏకకాలంలో ఎన్నికల వ్యవస్థ తీసుకొస్తామని అమిత్ షా వాగ్దానం చేశారు. దాని కోసం అవసరమైన అనేక రాజ్యాంగ సవరణలు తీసుకొస్తామన్న ఆయన మాట ఇక అమలు జరిగేది కాదు.

‘ఇండియా’ అనుభవాలు ఏమైనా నిరంతరం అప్రమత్తంగా వుండటం ఇప్పటికీ అవసరమే. ఎందుకంటే నిరంకుశ హిందూత్వ లక్షణాలు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కూటమి జన్యుధాతువుల్లోనే వున్నాయి. తమ ఎజెండాను ముందుకు నెట్టడానికి ప్రత్యక్షంగా కాకపోతే రహస్యంగా మార్గాలు నిరంతరం వారు అన్వేషిస్తూనే వుంటారు. ఈ కారణంగానే పార్లమెంటులో, అంతకంటే ముఖ్యంగా సభ వెలుపలా సమైక్య ప్రతిపక్షం పాత్ర కీలకమవుతుంది. ‘ఇండియా’ వేదిక పార్టీలు ఒక ఉమ్మడి వేదిక ద్వారా సమన్వయాన్ని మెరుగుపర్చుకుని పని చేయాల్సి ఉంటుంది. ‘ఇండియా’ కలయిక పార్టీల కొద్ది మాసాల అనుభవాన్ని గమనిస్తే ఒక ఖచ్చితమైన కూటమిగా గాక విశాల వేదికగా వ్యవహరించడం ఉపయుక్తమని తేలింది. రానున్న రోజుల్లో ‘ఇండియా’ కూటమికి కలసిరాగలిగిన ఒక పరిణామం, ఈ ఏడాది జరిగే నాలుగు అసెంబ్లీల ఎన్నికలు, ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికలు. ఈ ఎన్నికలలో మంచి ఫలితాలను చూపించగలిగితే, కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. బిజెపిలోనూ, ఎన్‌డిఎ కూటమిలోనూ అంతర్గతంగా భిన్నస్వరాలు వినిపిస్తాయి.

కానీ ఇప్పుడే తాము గెలిచామని తబ్బిబ్బైపోతున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, అసెంబ్లీ ఎన్నికలను తేలికగా తీసుకుంటే, పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. ‘ఇండియా’ కూటమికి ఉన్న మరో సానుకూల అంశం ఏమిటంటే భాగస్వామ్యపక్షాల్లో ఏ ఒక్కటీ ఎన్‌డిఎ కూటమిలోకి మళ్లే అవకాశం బాగా తక్కువ. ఉద్ధవ్ ఠాక్రే అటువైపు చూడరా, అవసరమైతే స్టాలిన్ కూడా రాజీపడడా, శాంతి కోసం మమత చేయి కలపదా అని సాంకేతికంగా వాదిస్తే చెప్పలేము కానీ, కూటమిలోని ప్రతీ పార్టీ బిజెపి వల్ల ఏదో రకంగా బాధిత పక్షమే కాబట్టి, అట్లా జరగడం కష్టం. పైగా ఈ పక్షాలు అన్నీ తమ తమ రాష్ట్రాలలో బిజెపి నుంచి సవాళ్లను ఎదుర్కొంటున్నవే.

వైవిధ్యాలనూ, పరస్పరం పోలి వుండే రాజకీయ కార్యక్రమాలు, విధానాలను వేదిక ఇముడ్చుకునే వీలు కలిగింది. ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సమాఖ్యతత్వానికి కట్టుబాట్లు సూత్రాలుగా పని చేయాలి. నిరంకుశ మతతత్వ ప్రమాదంపై పోరాటం ఎంత మాత్రం ముగియలేదు. హిందూత్వ కార్పొరేట్ శక్తుల కూటమిపై సమరం మరింత ఉధృతం కావడంఅనివార్యం. సంఘ్ పరివార్, హిందుత్వ శక్తులు చెలరేగిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఒడిశాలోని బాలాసోర్‌లో బిజెపి, సంఘ్ పరివార్ శక్తులు ఒక వ్యూహం ప్రకారం మతఘర్షణలను రెచ్చగొట్టాయి. ఉత్తరప్రదేశ్‌లో గో గూండాలు దాడులకు దిగుతున్నారు. అరుంధతీ రాయ్‌పై ఉపాను ప్రయోగించడం ప్రజల పక్షాన నిలబడి, గొంతు విప్పి, పోరాడే ప్రతి ఒక్కరికీ ఒక హెచ్చరిక వంటిది. ప్రజాతంత్ర శక్తులు ఐక్యంగా కదిలి ఈ దాడిని తిప్పికొట్టడంతో పాటు రానున్న రోజుల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పరచాలి. రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటనా స్వేచ్ఛను కాపాడుకునేందుకు ప్రజలు, ప్రజాతంత్ర శక్తులు సదా జాగరూకులై వుండాలి.

నాదెండ్ల శ్రీనివాస్
9676407140

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News