Tuesday, April 15, 2025

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై ‘కమలం’ గురి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఇటీవల జరిగిన టీచర్, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ త్వరలో జరిగే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపైనా గురిపెట్టింది. గెలుపు ఎంత వరకు సాధ్యమనేది పక్కన పెట్టి బరిలో దిగి ఎంఐఎంకు గట్టి పోటీ ఇచ్చే దిశగా కమల నాధులు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ఈ ఎన్నికలో పోటీ నుంచి తప్పుకోవడంతో ఇక ఎంఐఎంతో ఒంటరిగా తలపడాలని బిజెపి భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో కాషాయ దళం ఓ పథకం ప్రకారం మజ్లిజ్‌తో తలపడాలనుకుంటోందని స్పష్టమవుతోంది. ఇది ఏ మేరకు సాధ్యపడుతుందనేది ఎన్నికల నాటికి తేలాల్సి ఉంది.

ఎంఐఎం, బీజేపీ మాత్రమే బరిలో ఉన్నా స్థానిక సంస్థల సీటును దక్కించుకోవాలని బిజెపి విశ్వప్రయత్నం చేస్తోంది. ఈ ఎన్నికలో పోటీకి దూరంగా ఉండడంతో పరోక్షంగా కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లు ఎంఐఎంకు మద్దతుగా నిలుస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 112 ఓట్లు ఉన్నాయి. మెజార్టీ ఓటర్లు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లే. ఇందులో బీజేపీ తరపున గెలిచిన వారు 23 మంది ఉండగా, వాళ్ళలో నలుగురు పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫిషియో రూపంలో బీజేపీకి ఆరుగురు సభ్యుల బలం ఉంది. అలా మొత్తంగా చూసుకుంటే బీజేపీ బలం 29గా కనిపిస్తున్నా, దానిలో నుంచి పార్టీ మారిన వారిని తీసేస్తే కాషాయ దళానికి నికరంగా 25 ఓట్లు ఉన్నాయి. అదే సమయంలో అటు ఎంఐఎంకు 50 మంది సభ్యుల బలం ఉంది.

దీనిని బట్టి చూస్తే బీజేపీకి సరిపడా సంఖ్యా బలం లేకున్నా అభ్యర్థిని పోటీకి పెట్టింది. గెలవకపోయినా తమకు ఉన్న బలం కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఎంఐఎంతో పోటీపడి అందరి దృష్టిని ఆకర్షిండం ద్వారా బిజెపి మరింత ప్రజాదరణ పెంచుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా ఎంఐఎంకు వ్యతిరేకంగా ఇతర పార్టీల కార్పొరేటర్లను వీలైనంత వరకు తమ అభ్యర్థికి ఓటేయాలని కోరే అవకాశం లేకపోలేదు. హైదరాబాద్‌పై ఎక్కువ దృష్టిసారించిన బిజెపి తాజాగా హైదరాబాద్‌ను మజ్లిస్ చేతిలో పెట్టవద్దనే నినాదాన్ని చేసింది. కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డిలు ఇదే విషయాన్ని నగరంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో మాట్లాడుతూ ఎక్కువ ప్రచారం చేస్తున్నారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్‌కు బిజెపి చెక్ పెట్టేనా?

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ ముందుకెళుతున్న తీరు రోజు రోజుకీ చర్చనీయాంశంగా మారుతోంది. సరిపడా బలం లేకపోయినా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో అభ్యర్థిని బరిలోకి దిగడం అందరిలో ఉత్కంఠ రేపుతోంది. గెలిచినా ఓడినా ఎంఐఎంతో పోటీకి బరిలో దిగడం ద్వారా తమ సత్తా చాటాలని భావించడం వెనుక ఏదైనా ప్రత్యేక ప్రణాళిక ఉందా అనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎం తమ అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీని బరిలోకి దింపితే, ఆయనకు పోటీగా బీజేపీ గౌతమ్ రావును అభ్యర్థిగా నిలబెట్టి రంగంలో దింపింది. గెలిచినా గెలవకపోయినా ఈ ఎన్నికలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఎంఐంఎంకు దగ్గరయ్యాయనే విషయాన్ని వెల్లడించే వ్యూహంతో బిజెపి ముందుకెళుతోంది. ఈ ఎన్నికతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నిజస్వరూం ఏంటో ప్రజలు తెలిసిపోతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సైతం చెప్పారు. మరో వైపు ఈ ఎన్నికను హిందుత్వం, ఎంఐఎంగా చూడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా బిజేపీ వ్యూహం ఏమిటనేది వెల్లడిస్తున్నాయి.

హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ విషయంలో బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించగానే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రగా వ్యతిరేకించారు. పార్టీ రాష్ట్ర నేతలపైనా విమర్శలు చేశారు. రాజాసింగ్‌లో ఉన్న అసంతృప్తిని చల్లార్చి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం పని చేయాలని బండి సంజయ్ కలిసి చర్చించడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీ తర్వాత తమకు పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని బండి సంజయ్ తనకు పెద్దన్నలాంటి వారు అని రాజాసింగ్ వ్యాఖ్యానించడంతో అసంతృప్తిని చల్లార్చినట్లు అయ్యిందని పార్టీ వర్గాల సమాచారం. రాజాసింగ్, బండి సంజయ్‌లు హిందుత్వం పేరుతో ముందుండి నడిపించేందుకు అవగాహన చేసుకున్నారని, ఈ దిశగా ఇద్దరు కలిసి పని చేసేలా ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం ఎలా ఉన్నా ఇక్కడ వచ్చే రాజకీయ ప్రయోజనం త్వరలో జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి కలిసి వస్తుందనే అంచనాలు సైతం కమలం పార్టీలో వినిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News