శంకర్ – బ్లింకెన్ సంభాషణ
వాషింగ్టన్ : భారతదేశంతో అమెరికా భాగస్వామ్య బంధం ప్రాధాన్యతాయుతంగా ఉంటుందని అమెరికా కొత్త విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్ చెప్పారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో శనివారం బ్లింకెన్ ఫోన్లో మాట్లాడారు. ఇండో పసిఫిక్లో భారత్కే అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రాంతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా అందివచ్చే అవకాశాలను వినియోగించుకుందామని జైశంకర్తో సంభాషణ క్రమంలో బ్లింకెన్ తెలిపారు. అవకాశాలను వాడుకోవడం, ఉమ్మడి సవాళ్లను తిప్పికొట్టడంలో పరస్పర సహకారం అవసరం అన్నారు. కొవిడ్ నియంత్రణ చర్యలు, ఇటీవలి వ్యాక్సినేషన్ ప్రక్రియ వంటివి ప్రధానంగా ఇరువురు నేతలు చర్చించుకున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాల విస్తృతి దిశలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని బ్లింకెన్ తెలిపారు. ఆ తరువాత బ్లింకెన్ ట్వీటు వెలువరించారు. ఇందులో తాను మంచి స్నేహితుడు జైశంకర్తో మాట్లాడటం ఆనందం కల్గించిందని తెలిపారు. ఇరు దేశాల ప్రాధాన్యతను మరోసారి నిర్థారించుకున్నామని తెలిపారు. భారత్ అమెరికా మధ్య బహుముఖ కోణాలలో సత్సంబంధాల విషయంలో చిత్తశుద్ధితో సాగుతామని ఇరువురు మంత్రులు ఈ సందర్భంగా సంకల్పించారు.