Saturday, April 12, 2025

ప్రజా పండగగా రజతోత్సవం

- Advertisement -
- Advertisement -

పార్టీ రజతోత్సవాల సందర్భంగా వరంగల్‌లో లక్షలాది
మందితో బహిరంగ సభ ప్రజల ఆకాంక్షలను
ప్రతిఫలించేలా బిఆర్‌ఎస్ రజతోత్సవం ప్రజల
ప్రయోజనాలను కాపాడేందుకు కంకణబద్దులమై
పోరాడుదాం పార్లమెంట్‌లో పార్టీ ప్రాతినిధ్యం
లేకపోవడంతో రాష్ట్ర హక్కులకు భంగం రాష్ట్రానికి
రక్షణ కవచం బిఆర్‌ఎస్సే తెలంగాణ సమాజం
గర్వించేలా వేడుకలు రాష్ట్ర ప్రజలంతా భాగస్వాములే
పార్టీ ముఖ్య నేతలతో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్
ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశం

మన తెలంగాణ/మర్కుక్ : తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటినుండి కాపాడుకుంటూ వస్తున్న బిఆర్‌ఎస్ పార్టీయే ఈ సమాజానికి రాజకీయ రక్షణ, పాల నా పరిరక్షణను అందించగలదని ఆ పార్టీ అధినేత కెసిఆర్ పునరుద్ఘాటించారు. సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలంలోని ఎర్రవెల్లిలోని తన వ్యయసాయ క్షేత్రంలో పార్టీ ముఖ్య నేతలతో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ సమాజంలో 14నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి మరోసారి స్పష్టమైందని అన్నారు. గులాబీ పార్టీ ఆవిర్భవించి 27 ఏప్రిల్ తేదీకి 25 ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో నిర్వహించే రజతోత్సవ వేడుకల్లో భాగంగా.. వరంగల్ జిల్లాలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అధినేత నిర్ణయించారు. ఈమేరకు వరంగల్ సమీపంలో విశాలమైన అనువైన ప్రదేశాలను పరిశీలించి త్వరలో సభా వేదిక స్థలాన్ని నిర్ణయించనున్నట్టు తెలిపారు. పార్టీ నేతలతో నిర్వహించిన కీలక సమావేశంలో ఇందుకు

సంబంధించి సుదీర్ఘ చర్చ జరిగింది. దశాబ్దాల పాటు పోరాటాలు నడిపి ఎన్నో త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామని, అనంతరం పదేండ్ల పాటు ఎంతో అప్రమత్తతో స్వరాష్ట్రంలో పాలనను దేశానికే ఆదర్శంగా నిలుపుకున్నామని అన్నారు. అంతటి గొప్ప ప్రగతిని సాధించిన తెలంగాణ సమాజం నేడు మోసపోయి గోస పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సందర్భంలో నిర్వహించుకుంటున్న రజతోత్సవ వేడుకలు, కేవలం బిఆర్‌ఎస్ పార్టీకే పరిమితం కాదని, యావత్ తెలంగాణ సమాజానికి అందులో భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు. ‘బిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్థిత్వ పార్టీ. ఇది తెలంగాణ ప్రజల పార్టీ… ప్రజలు తమ సొంత ఇంటి పార్టీగా భావిస్తారు. ప్రజలు ఇవాళ అనేక కష్టాల్లో ఉన్నారు. వారి రక్షణ బిఆర్‌ఎస్ పార్టీనే అని నమ్ముతున్నారు’ అని అన్నారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆశపెట్టిన గ్యారెంటీలను వాగ్ధానాలను నమ్మిన ప్రజలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ నిజస్వరూపాన్ని తెలుసుకున్నారని, ఇక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కారు పార్టీకి బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా వరంగల్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారని సమావేశంలో ఆశాభావం వ్యక్తమైంది. కాగా, బహిరంగ సభ సన్నాహక సమావేశాలను నియోజక వర్గాల వారీగా నిర్వహించాలని, అందుకు త్వరలో కమిటీలను వేయనున్నట్టు కెసిఆర్ తెలిపారు. వరంగల్ బహిరంగ సభ అనంతరం పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పటిష్టపరిచి, ఆ దిశగా కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆ తర్వాత నూతన కమిటీల బాధ్యులతో ప్రతినిధుల సభను ఏర్పాటు చేయనున్నట్టు అధినేత తెలిపారు. కాగా పార్టీలో యువత, మహిళా భాగస్వామ్యం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంతో పాటు, దేశంలో నడుస్తున్న వర్తమాన రాజకీయ పరిస్థితులపై సమావేశంలో సుధీర్ఘ చర్చ జరిగింది. అందుకనుగుణంగా పార్టీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలు అమలు చేయాల్సిన రాజకీయ ఎత్తుగడలపై లోతైన చర్చ జరిగింది. గత ఒడిదొడుకులను అనుభవాలను పరిగణలోకి తీసుకుని వాటిని విశ్లేషిస్తూ, వర్తమానానికి అన్వయించుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకునే విధంగా కార్యాచరణను అమలు పరచాలని సమావేశంలో నిర్ణయించారు. కేంద్రంలో ఏ పార్టీ, ప్రభుత్వమున్నా తెలంగాణ సమాజానికి మొదటినుంచి అవి వ్యతిరేకంగానే పనిచేస్తున్నాయని సమావేశంలో ఆవేదన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసుకొని దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల పట్ల నిత్యం అప్రమత్తతతో ఉండాలని సమావేశం భావించింది.

పార్టీ ప్రాతినిధ్యం పార్లమెంటులో లేకపోవడం వలన తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లుతోందనే అంశంపై చర్చ జరిగింది. ఇదే విషయాన్ని ప్రజలకు మరింతగా అర్ధం చేయించి పార్లమెంటులో బిఆర్‌ఎస్ ఎంపిలు ప్రాతినిధ్యం ఉండి రాష్ట్ర హక్కులను కాపాడుకునే దిశగా ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. కాగా,. పలు అంశాలపై చర్చ సందర్భంగా అధినేత అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పాల్గొన్న నేతలు వారి వారి అభిప్రాయాలను అధినేత ముందుంచారు. దాదాపు ఎనిమిది గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చలో..ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఖరులను తిప్పికొడుతూ తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా భారీ బహిరంగ సభను నిర్వహించాలని కెసిఆర్ అధ్యక్షతన సాగిన సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, సిద్దిపేట ఎంఎల్‌ఎలు హరీశ్ రావు, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితాఇంద్రారెడ్డి, పద్మారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, ఎంఎల్‌సి కవిత, మాజీ ఎంపి వినోద్ కుమార్, మాజీ ఎంఎల్‌ఎ ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News