Thursday, September 19, 2024

నేడు బిఆర్‌ఎస్ నిరసనలు: చేవెళ్లలో కెటిఆర్…ఆలేరులో హరీశ్‌

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం(ఆగస్టు 22) అన్ని మండల కేంద్రాలు/నియోజకవర్గ కేంద్రాల్లో బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మహేశ్వరం ఎంఎల్‌ఎ పి. సబితా ఇంద్రారెడ్డి, పలువురు పార్టీ నేతలతో కలిసి చేవెళ్ల మండల కేంద్రంలో రైతుల ధర్నా కార్యక్రమంలో పాల్గొంటారు.

సిఎం, మంత్రివర్గం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా గురువారం బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా ధర్నాలు చేపడతామని కెటిఆర్ ప్రకటించారు. రైతులకు సంపూర్ణ రుణమాఫీ జరిగేంత వరకు బిఆర్‌ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా నియోజకవర్గాలు, మండల కేంద్రాలో బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎంఎల్‌ఎలు, మాజీ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, మాజీ ఎంఎల్‌సిలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.

నేడు యాదాద్రిలో హరీశ్‌రావు ప్రత్యేక పూజలు
ప్రభుత్వం రుణమాఫీ చేయడంలో విఫలమవడాన్ని నిరసిస్తూ బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆలేరులో నిర్వహించే రైతు ధర్నాలో మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు పాల్గొననున్నారు. సిఎం రేవంత్ రెడ్డి ఒట్టు వేసి మాట తప్పిన నేపథ్యంలో రాష్ట్రానికి కీడు జరగకూడదని హరీశ్‌రావు యాదాద్రి లక్ష్మి నరసింహా స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. కార్యక్రమంలో ఎంఎల్‌ఎలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, వివేక్ గౌడ్, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, కాలేరు వేంకటేష్, ముఠా గోపాల్, ఎంఎల్‌సి దేశపతి శ్రీనివాస్, నవీన్ రావు, మాజీ ఎంఎల్‌ఎలు శేఖర్ రెడ్డి, భిక్షమయ్య గౌడ్, సునీతా మహేందర్ రెడ్డి, మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవి ప్రసాద్, పల్లె రవి, రాజీవ్ సాగర్ ఇతర సీనియర్ నాయకులు పాల్గొంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News