Thursday, September 19, 2024

రేపు రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ దిష్టిబొమ్మల దహనం

- Advertisement -
- Advertisement -

పార్టీ సీనియర్ మహిళా శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిల పైన ముఖ్యమంత్రి చేసిన నీచమైన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనానికి భారత రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉందన్న కనీస సొయి లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైతావంటూ, ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ… జీవితం బస్టాండ్ పాలవుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తన స్థాయి మరిచి చేసిన నీచమైన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజల మన్ననలు అందుకుంటూ కార్యకర్తల ఆశీర్వాదంతో, అనేక త్యాగాలతో ప్రజలకు సేవ చేస్తున్న ఇద్దరు సీనియర్ మహిళ సభ్యులపైన,

అహంకారంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆడబిడ్డలందరికీ మనసులను నోప్పించాయని.. జీవితంలో ఎదగాలనుకుంటున్న ప్రతి ఒక్క మహిళకు, ఆడబిడ్డకు ఈ వ్యాఖ్యలు అవమానకరమని పేర్కొన్నారు. అధికారం, అహంకారంతో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజమంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి చేసిన మహిళలపై చేసిన ఈ వ్యాఖ్యలకు నిరసనగా గురువారం ఆయన దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News