Saturday, September 28, 2024

డిఎస్‌సి ఫలితాల కోసం అభ్యర్థుల ఎదురుచూపులు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్‌సి ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం డిఎస్‌సి పరీక్షలను నిర్వహించగా, ఆగస్టు 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అభ్యంతరాలను పాఠశాల విద్యాశాఖ ఆన్‌లైన్ ద్వారా స్వీకరించింది. ఈ నెల 6వ తేదీన పాఠశాల విద్యాశాఖ తుది కీ ని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే పరీక్షల తుది కీ ఖరారైన తర్వాత డిఎస్‌సి మార్కులకు… టెట్ మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకు లిస్టు విడుదల చేస్తారు.

తుది కీ ఖరారై దాదాపు 20 రోజులకుపైగా గడుస్తున్నా ఇప్పటివరకు డిఎస్‌సి జనరల్ ర్యాంకింగ్ జాబితా(జిఆర్‌ఎల్) విడుదల కాకపోవడం పట్ల అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే డిఎస్‌సి తుది కీ విడుదల చేసిన తర్వాత ఆన్‌లైన్ టెట్ మార్కుల సవరణకు అవకాశం కల్పించారు. ఈ గడువు కూడా ఈ నెల 13వ తేదీన ముగిసింది. తుది కీ విడుదల తర్వాత కూడా జిఆర్‌ఎల్ ఎందుకు ప్రకటించడం లేదో అధికారులు చెప్పడం లేదు. ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారన్న విషయం అధికారికంగా వెల్లడించాలని అభ్యర్థులు కోరుతుతూన్నారు.

1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితా
డిఎస్‌సి జిఆర్‌ఎల్ ప్రకటించిన తర్వాత జిల్లాల వారీగా రిజర్వేషన్ల ప్రకారం 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాను వెల్లడిస్తారు. జిల్లా విద్యాధికారులు(డిఇఒ) ధ్రువపత్రాల పరిశీలన అనంతరం మెరిట్ ఉన్న వారికి నియామక ఉత్తర్వులు జారీచేస్తారు. డిఎస్‌సి పరీక్షలకు మొత్తం 2,79,957 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 2,45,263(87.61 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 1,61,745 మందికి 1,37,872 (85.24 శాతం), సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జిటి) పోస్టులకు 88,005కి 81,053 (92.10 శాతం), లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు 18,211కు 16,092(88.36 శాతం), పిఇటి పోస్టులకు 11,996కు 10,246(85.41 శాతం) మంది హాజరయ్యారు. రాష్ట్రంలో తొలిసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సిబిటి) విధానంలో డిఎస్‌సి పరీక్ష నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News