పార్లమెంట్ ఆవరణలో చోటుచేసుకున్న తోపులాట ఘటనలో రాహుల్ గాంధీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్కి బదిలీ చేశారు. దర్యాప్తు కోసం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్కి కేసును బదిలీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే, బిజెపిపై కాంగ్రెస్ ఎంపీలు చేసిన ఫిర్యాదుపైనా దర్యాప్తు చేపట్టనున్న ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు.
రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విపక్ష ఎంపీలు గురువారం పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. వారికి వ్యతిరేకంగా బిజెపి ఎంపీలు కూడా నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య జరిగిన తోపులాటలో బిజెపికి చెందిన ఇద్దరు ఎంపీలు గాయపడ్డారు.ఈ ఘటనలో ఇద్దరి తలలకు స్వల్ప గాయాలు అయ్యాయి. దీనికి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీనే అని ఆరోపిస్తూ బిజెపి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.