ముంబై: ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చిక్కుల్లో పడ్డాడు. మహారాష్ట్ర డిప్యూటీ సిఎం ఏక్నాథ్ షిండేపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అతనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. శివసేన నేతల ఫిర్యాదుతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. కునాల్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. తను కామెడీకి వ్యతిరేకం కాదని.. అలాగని కామెడీ పేరుతో అగౌరవ పరచడం సరికాదని తెలిపారు. డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి గురించి ఇలా మాట్లాడాల్సింది కాదని మండిపడ్డారు.
ఖార్ ప్రాంతంలో ఉన్న హోటల్ హాబిటాట్లోని కామెడీ క్లబ్లో కునాల్.. ఏక్నాథ్ షిండే దోషిగా అర్థం వచ్చేలా కునాల్ కామెంట్ చేశాడు. దిల్ తో పాగల్ హై అనే పాటని పేరడీ చేసి అవమానకరంగా పాడాడు. దీంతో ఆగ్రహించిన శివసేన కార్యకర్తలు షో జరిగిన హోటల్పై దాడి చేసి ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. కునాల్ క్షమాపణలు చెప్పాలని వాళ్లు డిమాండ్ చేశారు. మరోవైపు డిప్యూటీ సిఎం అజిత్ పవార్ కూడా దీనిపై అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నియమాలకు వ్యతిరేకంగా ఎవరకూ ప్రవర్తించకూడదని.. రాజ్యాంగం కల్పించిన హక్కులకు కట్టుబడి ఉండాలని అన్నారు. అంతేకాక.. చట్టం పరిధి దాటి ఎవరకూ వ్యవహరించకూడదని తెలిపారు.