వెనుకబడిన జిల్లాల కోసం ప్రత్యేక సహాయ నిధి విడుదల చేయాలి
పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలి కేంద్ర ఆర్థిక శాఖ
మంత్రి నిర్మలా సీతారామన్ను కోరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మన తెలంగాణ / హైదరాబాద్ : తమకు రావాల్సిన నిధులు ఇప్పించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. శనివారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ను సఫ్దర్ జంగ్ రోడ్డులోని ఆమె నివాసగృహం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ అంశాల్లో రావాల్సిన ఆర్థిక వనరులకు సంబంధించి విజ్ఞప్తి చేశారు. గతంలో ఈ అంశాలకు సంబంధించి రాసిన లేఖలను సైతం ఆమెకు అందచేశారు. వివిధ కార్పొరేషన్లు, ఎస్పీవీల ఋణ పునర్వ్యవస్థీకరణ ఆర్థిక సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. 4,08,48,54,461 తిరిగి చెల్లింపును వేగవంతం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 కింద, విభాగం 94(2) ప్రకారం, తెలంగాణకు రావాల్సిన, వెనుకబడిన జిల్లాల కోసం ప్రత్యేక సహాయ నిధి విడుదల చేయాలని కోరారు.
2014- 15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రంగా ప్రాయోజిత పథకాల నిధుల విడుదలలో జరిగిన కేటాయింపు పొరపాటు సరిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లోని విభాగం 56(2) ప్రకారం రూ. 208.24 కోట్లు తిరిగి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు కేటాయించిన అదనపు బాధ్యత మేరకు అందుకోవాల్సిన మొత్తానికి సంబంధించిన అంశం పైన చర్చించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 కింద నిధుల బదిలీ కోరుతూ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ పవర్ యుటిలిటీల మధ్య పెండింగ్లో ఉన్న బకాయిల పరిష్కారం చేయాలని కోరారు. డిప్యూటీ సీఎం వెంట స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్ తదితరులు ఉన్నారు.