రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలన, నష్టం అంచనా
సిఎం కెసిఆర్ లేఖకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని సిఎం కెసిఆర్ ఇటీవల పిఎం మోడికి లేఖ రాశారు. వరదల నేపథ్యంలో జరిగిన నష్టానికి తక్షణ సాయం కింద రూ.1350 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆ లేఖలో తెలిపారు. దీంతో కేంద్ర బృందం గురువారం సాయంత్రం హైదరాబాద్కు రానుంది. ప్రవీణ్ వశిష్ఠ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బృందం రెండు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్ట తీవ్రతను అంచనా వేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈనెల 13వ తేది నుంచి రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు చుట్టు పక్కల జిల్లాల్లో తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఆస్తితో పాటు పంట నష్టం కూడా భారీగా జరిగింది. ఈక్రమంలో సిఎం కెసిఆర్ సూచన మేరకు కేంద్ర బృందం అధికారులు హైదరాబాద్తో పాటు చుట్టు పక్కల జిల్లాల్లోనూ పర్యటిస్తారని అధికారులు పేర్కొన్నారు. అయితే ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బృందం వరదలతో జరిగిన ఆస్తి, పంట నష్టాన్ని అంచనా వేసి రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ఒక నివేదికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా వరదల్లో చనిపోయిన వారికి రూ.4 లక్షలు ఇవ్వాలని కేంద్ర గతంలోనే చట్టం చేసిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు.
అయితే, కేంద్రం సాయం అందేలోపు ఎస్టీఆర్ఎఫ్ నిధులను వాడుకోవాలని కిషన్రెడ్డి సూచించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే నగర ప్రజలకు తక్షణ సహాయం కింద సిఎం కెసిఆర్ రూ.550 కోట్ల సాయం ప్రకటించారు. వరద ప్రభావితమైన కుటుంబాలకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. దీంతో పాటు ఢిల్లీ ప్రభుత్వం రూ. 15 కోట్లు, తమిళనాడు ప్రభుత్వం, రూ.10 కోటు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రూ. 2 కోట్లు, మై హోం సంస్థ రూ.5 కోట్లు, చిరంజీవి, మహేష్బాబు, పవన్ కళ్యాణ్ రూ.కోటి చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి విరాళం అందించారు. అంతేగాక, హైదరాబాద్ ప్రజలను ఆదుకునేందుకు చాలా మంది దాతలు ముందుకు వస్తున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు.
Central Team to Visit Hyd to Assess Flood Situation