Tuesday, September 17, 2024

ఛండీగఢ్ మేయర్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ : చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సుప్రీం కోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో విచారణకు ఒక రోజు ముందే మేయర్ అభ్యర్థి బీజేపీ నేత మనోజ్ సోంకర్ ఆదివారం రాత్రి రాజీనామా చేశారు. సోంకర్ తన రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్‌కు, ఛండీగఢ్ బీజేపీ అధ్యక్షుడు జతీందర్ పాల్ మల్హోత్రాకు సమర్పించారు. మేయర్ సోంకర్ ఈరోజు తన పదవికి రాజీనామా చేశారని, ఎన్నికల అంశం కోర్టు విచారణ పరిధిలో ఉందని, సుప్రీం కోర్టు రేపు ( సోమవారం ) నిర్ణయిస్తుందని జతీందర్ పాల్ ఆదివారం వెల్లడించారు.

ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు పూనం దేవి, నేహా , గురుచరణ్ కాలా, మూడు రోజులు క్రితమే తమ పార్టీని విడిచిపెట్టి ఆదివారం బీజేపీలో చేరడంతో ఈ ఎన్నికలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జరిగిన మేయర్ ఎన్నికల్లో బీజేపీకి 16 ఓట్లు రాగా, కాంగ్రెస్ ఆప్ ఉమ్మడి అభ్యర్థి కుల్దీప్ సింగ్‌కి 12 ఓట్లు వచ్చాయి. అయితే మొత్తం 36 ఓట్లలో 8 చెల్లవని ప్రకటించడంతో వివాదం మొదలైంది.

జనవరి 30న ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్, ఆప్ కౌన్సిలర్లు బీజేపీ మోసం చేసిందని , ఎన్నికల ప్రక్రియ సరిగ్గా సాగలేదని ఆరోపించడం గందర గోళానికి దారి తీసింది. ప్రిసైడింగ్ అధికారి అనిల్‌మనీహ్ బ్యాలెట్ పేపర్లను ట్యాంపరింగ్ చేస్తూ పట్టుబడ్డారని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.దీనికి సంబంధించిన వీడియో కూడా సుప్రీం కోర్టుకు సమర్పించారు. దీనిపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో మేయర్ రాజీనామా చర్చనీయాంశం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News