ఫ్రీగా వస్తున్నాయని మంది సొమ్ముకు ఆశ పడ్డ ముగ్గురు పోలీసులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా బుక్కయ్యారు. రూ. 20వేల కోసం కక్కుర్తిపడి ఉద్యోగానికే ఎసరు తెచ్చుక్నునారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లాలో కలకలం రేపింది. ఇంతకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్నగర్కు చెందిన సంధ్యా వెంకటరాములు నారాయణపేట జిల్లా మక్తల్ లో శ్రీ నిధి ఫైనాన్స్ సోసైటీని ఏర్పాటు చేశాడు. ఈయనపై పలు కేసులతో పాటు ఇటీవల కిడ్నాప్ కేసు నమోదు అయింది. ఈ కేసులో హై కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ లో మక్తల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తో కలిసి హాజరు కావాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టుకు వెళ్లి వస్తున్న క్రమంలో మక్తల్ సిఐ చంద్రశేఖర్ తో పరిచయం ఏర్పడింది.
ఆ సాన్నిహిత్యాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న సంధ్యా వెంకటరాములు, తనకు అనుకూలంగా చార్జి సీట్లు దాఖలు చేయాలని కోరారు. దీంతో పోలీసు స్టేషన్ రైటర్ నర్సింహ సంధ్య వెంకటరమణతో మాట్లాడి రూ. 20వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో సీఐ చంద్రశేఖర్ ఆదేశాలతో పోలీస్ స్టేషన్లోనే కానిస్టేబుల్ నర్సింహ, శివ నిందితుడి నుంచి రూ. 20వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెయిడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వెంటనే ఇద్దరు కానిస్టేబుళ్లను అధుపులోకి తీసుక్నునారు. సీఐ కోసమే లంచం తీసుకున్నామని రైటర్ ఏసిబి అధికారులకు వాంగ్మూలం ఇవ్వడంతో చంద్రశేఖర్ పైనా అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. బాధితుడి నుంచి తీసుకున్న రూ. 20వేల లంచం డబ్బులను రికవరీ చేసినట్లు ఏసిబి డిఎస్పీ తెలిపారు.