హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారతరాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చే విందుకు సిఎం కెసిఆర్కు ఆహ్వానం రావడంతో సోమవారం సిఎం కెసిఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం సాంయంత్రం ఢిల్లీకి చేరుకుని మంగళవారం రాత్రి 7.30 గంటలకు రాష్ట్రపతి భవన్లో ట్రంప్కు రాష్ట్ర పతి ఇచ్చేవిందులో పాల్గొంటారు. దేశవ్యాప్తంగా కేవలం ఎనిమిది మంది ముఖ్యమంత్రులనే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విందుకు ఆహ్వానించారు. రాష్ట్రపతి నుంచి సిఎం కెసిఆర్కు ఆహ్వానం అందిందని సిఎంఒ కార్యాలయం ప్రకటించింది. ఈ విందుకు ప్రధాని నరేంద్రమోడీతో పాటు ఎనిమిది మంది ముఖ్యమంత్రులను రాష్ట్రపతి ఆహ్వానించారు. ప్రధానిమోడీని అనేక అంశాల్లో విభేదిస్తున్న ముఖ్యమంత్రులు కెసిఆర్, నవీన్పట్నాయక్, ఉద్దవ్ ఠాక్రేల కు ఆహ్వానం అందడం విశేషం కాగా ఎపి సిఎం జగన్కు ఆహ్వానం రాకపోవడం పై రాజకీయంగా చర్చప్రారంభం అయింది.