Sunday, September 22, 2024

ప్రాణ జలాలు

- Advertisement -
- Advertisement -
CM KCR review on Irrigation department

 

ప్రతి బొట్టూ బంగారమే
ప్రాజెక్టుల వద్ద రివర్‌గేజ్‌లు
సాగునీటి వ్యవహారాలన్నీ ఒకే గొడుగు కిందికి
ఆధునిక పరిజ్ఞానంతో నీటి నిర్వహణ
వానాకాలం ఆరంభం నుంచే కాళేశ్వరం జలాలతో చెరువులు, కుంటలు నింపే ప్రణాళిక, గోదావరి వరదను
ఎప్పటికప్పుడు ప్రాజెక్టుల్లోకి తరలించాలి
చెరువుల నుంచే మట్టి తీసుకువెళ్లే సౌకర్యం రైతులకు
కాళేశ్వరం పంపులన్నీ మేలోగా పూర్తి
మిడ్ మానేరు సామర్థ్యం పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలి
దేవాదుల నుంచి 365 రోజులూ ఎత్తిపోత
ప్రగతిభవన్ సమీక్షలో సిఎం కెసిఆర్

 

మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో చెరువులు కుంటలన్నీ నింపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు.

వర్షాకాలం ప్రారంభం కాలం నుంచే చెరువులు,కుంటలు నింపి వ్యవసాయానికి నీటిని సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల కాల్వల నుంచి అవసరమైన తూములు,డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పారు. అన్ని ప్రాజెక్టుల వద్ద రివర్ గేజ్ లు ఏర్పాటు చేయాలని, నీటి నిర్వహణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రియల్ టైమ్ డాటా ఆపరేటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సిఎం చెప్పారు. ఎన్నో వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సాగునీటి వ్యవహారమంతా ఒకే శాఖ గొడుగు కిందికి రావాలని, ప్రాజెక్టుల భౌగోళిక స్థితిని బట్టి నీటి పారుదల శాఖను పునర్వ్యవస్ఠీకరించుకోవాలని సిఎం ఆదేశించారు.

ప్రతీ ప్రాజెక్టుకు నిర్వహణ (ఒఅండ్ ఎం) మాన్యువల్ రూపొందించాలని సిఎం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుల పరిధిలోని అన్ని పంపుల నిర్మాణం మే నెలాఖరు నాటికి పూర్తి చేసి, కొండ పోచమ్మ సాగర్ వరకు నీటిని పంప్ చేయాలని సిఎం ఆదేశించారు. నీటి పారుదల శాఖకు చెందిన భూములు, కట్టల ఆక్రమణను తీవ్రంగా పరిగణించాలని సిఎం ఆదేశించారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఈ వర్షాకాలం అవలంభించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు కె.టి.రామారావు, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సిఎంఒ కార్యదర్శి స్మితా సభర్వాల్, ఒఎస్‌డి, శ్రీధర్‌రావు దేశ్ పాండే, ఇఎన్ సిలు మురళీధర్ రావు, నాగేంధర్ రావు, అనిల్ కుమార్, వెంకటేశ్వర్లు, హరీరామ్, చీఫ్ ఇంజనీర్లు శంకర్, బంగారయ్య, మధుసూధన్ రావు, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

గోదావరి బేసిన్ లోని ప్రతీ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని, ఈ వానాకాలంలో ఎంత ఆయకట్టుకు నీరందించగలిగే విషయాలను సిఎం ఆరా తీశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు, సూచనలు చేశారు. వర్షాకాలంలో ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ప్రారంభం కాగానే మొదట అన్ని చెరువులు, కుంటలు నింపాలి. దీనికోసం అవసరమైన ఒటిలను, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను వెంటనే నిర్మించాలి. తెలంగాణలో చెరువులు, కుంటలు ఏడాదంతా నిండి ఉండే వ్యూహం అవలంభించాలి. చెరువులను నీరు అందించడానికున్న అడ్డంకులపై చర్చించేందుకు ఆయా జిల్లాల మంత్రులు, అధికారులు రెండు మూడు రోజుల్లోనే సమావేశం కావాలని ఆదేశించారు. చెరువులు నింపడం ద్వారా భూగర్భ జలాల మట్టం పెరుగుతుంది. ఫలితంగా బోర్ల ద్వారా కూడా వ్యవసాయం సాగుతుందని చెప్పారు. చెరువుల నుంచి రైతులు స్వచ్ఛందంగా మట్టిని తీసుకుపోవడానికి అవకాశం ఇవ్వాలి. అధికారులు రైతులపై ఎలాంటి ఆంక్షలు పెట్టవద్దని సిఎం అధికారులను ఆదేశించారు.

ఈ వానాకాలంలో ఎస్‌ఆర్‌ఎస్పి ఆయకట్టు పరిధిలో 16,41,284 ఎకరాలకు సాగునీరు అందించాలని ఆయన చెప్పారు. గోదావరిలో పై నుంచి వచ్చే వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఎస్‌ఆర్‌ఎస్పిని కాళేశ్వరం ద్వారా నింపాలి. మిడ్ మానేరు నుంచి దిగువకు నీరందించడానికి ప్రస్తుతమున్న కాలువ కేవలం ఆరు వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో ఉంది. దీని సామర్థ్యాన్ని 9వేల క్యూసెక్కులకు పెంచాలి. ప్రస్తుతమున్న కాల్వ సామర్థ్యం పెంచడమా? సమాంతరంగా మరో కాలువ నిర్మించాలా? అనే విషయాన్ని ఇన్‌సిలు కమిటి వేసి నిర్ణయించాలని ఎప్పారు.

కాళేశ్వరంలో మూడో టిఎంసి ఎత్తిపోసే పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలి. వచ్చే వర్షాకాలం నుంచి మూడో టిఎంసిని వాడుకోవాలి. తోటపల్లి కాలువ ద్వారా 77 వేల ఎకరాలకు నీరందించాలని చెప్పారు. గౌరవల్లి లిఫ్టు పనులు వెంటనే పూర్తి చేసి, ఈ సీజన్ లోనే నీళ్ళు అందించాలని నీటి పారుదల శాఖ అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశాలు ఇచ్చారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా వరంగల్ జిల్లాలోని అన్ని చెరువులు నింపాలి. సమ్మక్క బారాజ్ పనులను వేగవంతం చేయాలి. దేవాదుల ప్రాజెక్టు 365 రోజులూ నీటిని లిఫ్టు చేయాలని చెప్పారు. వరద కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలి. వరద కాలువలపై ఒటిల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. మల్లన్న సాగర్ ద్వారా తపాస్ పల్లి రిజర్వాయర్ నింపి, అక్కడి నుంచి మోత్కూరు, అడ్డగూడూరు, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, చిల్పూర్ మండలాలకు నీరందించాలని సూచించారు. జగిత్యాల జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని ముక్కట్ రావు పేట గ్రామంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి అమలు చేయాలని చెప్పారు.

భారీ, మధ్య తరహా, చిన్న తరహా నీటి పారుదల, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోని విభాగాలు, ప్రాజెక్టులన్నీ ఒకే గొడుగు కిందికి రావాలి. అన్నీ నీటి పారుదల శాఖ పరిధిలోనే ఉండాలి. ప్రాజెక్టులు, వాటి భౌగోళిక స్థితి ఆధారంగా నీటి పారుదల శాఖను పునర్వ్యవస్థీకరించాలి. సిఇ,ఇఎన్‌సిల పరిధులు నిర్ణయించి, నీటి పారుదల జోన్లు ఏర్పాటు చేయాలి. అత్యవసరమైన సాగునీటి పనులకు కావాల్సిన అనుమతులు ఇవ్వడానికి సిఇ నుంచి ఇఇ వరకు అధికారాలను ప్రభుత్వం బదిలీ చేస్తుంది. సిఇ 50 లక్షల వరకు ఎస్‌ఇ 25 లక్షల వరకు, ఇఇ 5 లక్షల వరకు పనులకు అనుమతులు ఇవ్వవచ్చని చెప్పారు. 15 రోజుల్లోగా అన్ని ప్రాజెక్టులపై కొత్తగా గేజ్ మీటర్లు ఏర్పాట్లు చేయాలి. ప్రస్తుతమున్న గేజ్ లు చాలా కాలం క్రితం ఏర్పాటు చేసివని. చాలా ప్రాజెక్టుల్లో పూడిక వల్ల గేజ్ లు సరిగా చూపెట్టడం లేదు. కొత్తగా గేజ్ లు ఏర్పాటు చేసి ఖచ్చితమైన అంచనా వేయాలన్నారు. నీటి పారుదల శాఖ భూములు, ఆస్తుల వివరాలతో ఇన్వెంటరీ తయారు చేయాలి. నీటి పారుదల శాఖ సేకరించిన భూములను వెంటనే మ్యుటేషన్ చేయించాలని ఆధికారులను ఆదేశించారు.

ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూమిని ఇతరులు ఆక్రమిస్తున్నారు. వాటిపై సీరియస్ గా ఉండాలి. సేకరించిన భూమిని నీటి పారుదల శాఖ పేరు మీద మ్యుటేషన్ చేయాలని చెప్పారు. రాష్ట్రంలో చాలా చోట్ల, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కాల్వ కట్టలపై నిర్మాణాలు వచ్చాయి. ఇది నేరమేకాకుండా, ప్రమాదకరం కూడా. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని కాలువల్లో నీరు వస్తాయి కాబట్టి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కాలువలపై నివాసం ఉండే వారు తక్షణం ఖాళీ చేయాలి. ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి. అక్రమ నిర్మాణాలను తొలగించాలన్నారు. ఎంతో వ్యయం చేసి ప్రాజెక్టులు నిర్మించాం. వాటిని సరిగ్గా నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. ప్రతీ ప్రాజెక్టు నిర్వహణ కోసం ఓ అండ్ ఎం మాన్యువల్ రూపొందించాలి. ప్రతీ ఏటా బడ్జెట్లోనే నిర్వహణ వ్యయం కేటాయించి, క్రమం తప్పకుండా ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇంకా ఎక్కడైనా ఏమైనా భూసేకరణ మిగిలి ఉంటే, తక్షణం పూర్తి చేయాలి. దీనికి కావాల్సిన నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News