Tuesday, October 22, 2024

అంతర్జాతీయ ప్రమాణాలతో పోలీసుల పిల్లలకు విద్య

- Advertisement -
- Advertisement -

 పోలీసులు చేసేది ఉద్యోగం కాదు.. భావోద్వేగం
 యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవనానికి శంకుస్థాపన చేసిన రేవంత్
మన తెలంగాణ/హైదరాబాద్: యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో పోలీసుల పిల్లలకు విద్యను అందించనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలోని మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే అకాడమిక్ ఇయర్ పోలీసు పిల్లల కోసం ఈ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అన్ని ప్రమాణాలతో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఉంటుందని, మొదటి విడతగా 5 వ తరగతి నుంచి 8 వ తరగతి వరకు ప్రారంభిస్తామని సిఎం చెప్పారు. పోలీసులు చేసేది ఉద్యోగం కాదని భావోద్వేగం అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర సాధనలో పోలీసులకు ప్రత్యేక స్థానం ఉందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలోని పోలీస్, అగ్నిమాపక, ఎక్సైజ్, ఎస్ పిఎఫ్ జైళ్లలో అమరవీరులు, ఇతర యూనిఫాం సర్వీస్ విభాగాల పిల్లలకు ఈ స్కూల్ లో విద్య అందించనున్నట్లు సిఎం వివరించారు.

విద్యార్థుల్లో కులమతాల భేదం ఉండకూడదు
2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ గత ప్రభుత్వం పోలీసులను తమ స్వార్థానికి ఉపయోగించుకున్నారే తప్ప ప్రజా సంక్షేమం కోసం కాదని ఆయన విమర్శించారు. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేస్తున్న పోలీసులకు సిఎం రేవంత్ అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో యువత శ్రేయస్సు కోసం మొదటగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నామని ఆయన గుర్తు చేశారు. విద్యార్థుల్లో కులమతాల భేదం ఉండకూడదని అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు దిశగా ముందుకెళ్తున్నా మన్నారు. పోలీసుల పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేలా నాణ్యమైన విద్యను అందించేందుకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని సిఎం తెలిపారు.

గత ప్రభుత్వం పదేళ్లలో చేసిందేమీ లేదని, తెలంగాణ వచ్చాక గ్రూప్ -1 మెయిన్స్ నిర్వహిస్తున్నామన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 10 నెలలుగా ఓ విజన్‌తో ముందుకెళ్తున్నామని శ్రీధర్‌బాబు వివరించారు. పోలీసుల సంక్షే మం కోసం ఆలోచించించేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు శంకుస్థాపన చేసినట్లు ఆయన వివరించారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తామని అక్టోబర్ 19న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తు చేశారు. సిఎం ఇచ్చిన హామీ మేరకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తూ జీఓ జారీ చేశా మని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి జితేందర్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’ స్థాపనకు ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలోని పోలీసు అమరవీరులు, ఇతర యూనిఫాం సర్వీస్ డిపార్ట్‌మెంట్‌లకు చెందిన సిబ్బందికి చెందిన పిల్లల కోసం ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‘ స్థాపనకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోమ్‌శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రవి గుప్త సోమవారం జీవో జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పోలీస్ అమరుల పిల్లలు, పోలీసులతో పాటు ఇతర యూనిఫామ్ సర్వీసులైన ఫైర్, ఎక్సైజ్ లాంటి వివిధ రకాల సిబ్బంది బిడ్డలకు పోలీస్ స్కూల్లో అడ్మిషన్లు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ పాఠశాల ఏర్పాటుకు అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని డిజిపి చూడాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News