Saturday, July 6, 2024

తెలంగాణ ప్రయోజనాలే ఫోకస్

- Advertisement -
- Advertisement -

రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో సిఎం రేవంత్‌రెడ్డి బిజీబిజీ
ముగ్గురు కేంద్ర మంత్రులతో భేటీ
వైద్య,ఆరోగ్య,గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి సమస్యల పరిష్కారంపై దృష్టి 
లోక్‌సభ రాష్ట్ర ఎంపికల ప్రమాణ స్వీకారానికి హాజరు
కాంగ్రెస్ పెద్దలతో భేటీలు.. వలసలపై చర్చ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యం గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి ముగ్గురు కేంద్ర మంత్రులతో సమావేశం కావడంతో పాటు తెలంగాణ నుంచి ఎంపికైన లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ము ఖ్యమంత్రి హాజరయ్యారు. కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ప్రాధాన్యంగా సమాఖ్య స్ఫూర్తిని అనుసరించి కేంద్ర మంత్రులను కలిసి సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో తొలి రోజైన సోమవారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. నగరంలో రహదారుల విస్తరణ, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని సిఎం కోరారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరంలో ఎలివేటె డ్ కారిడార్‌లకు అవసరమైన రక్షణ శాఖ భూముల బదలాయించాలని కోరారు. నాడు ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తికి స్పందించిన రక్షణ శాఖ మంత్రి పలు ప్రాంతాల్లో భూముల బదలాయింపునకు అంగీకరించడంతో నగరంలో పలు ఎలివేటెడ్ కారిడర్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ప్రస్తుత పర్యటనలో మరో 2,450 ఎకరాల భూముల బదలాయింపు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు.

ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి దక్కితే నగరంలో పలు ప్రాంతాల్లో రహదారుల విస్తరణతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు మార్గం సుగమమవుతుంది. అనంతరం కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రతి పేదవాని ఇంటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టినట్లు కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ)- పిఎంఏవై (యూ) కింద కేంద్రం ఇళ్లను మంజూరు చేస్తున్నందున, తెలంగాణ కు 2.70 లక్ష ల ఇళ్లు మంజూరు చేయాలని సిఎం రేవంత్ కోరారు. పిఎంఏవై (యూ) కింద గ్రాంటుగా తెలంగాణకు రావల్సిన రూ.784,88 కోట్ల బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చే శారు.

మూసీనది ప్రస్తుతం మురికి కూపంగా మారిపోయింది.మూసీ కాలుష్యంతో నగరంతో పాటు ఉమ్మడి నల్గొండ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూసీ ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటుకు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే లండన్‌లోని థేమ్స్ నది రివర్ ఫ్రంట్‌ను ఆయన పరిశీలించారు. మూసీని ప్రక్షాళన చేయడంతో పాటు నది ఒడ్డున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి స్థానికులకు ప్రయోజనం చేకూర్చేలా తీర్చిదిద్దుతామని, ఇందుకు సహకరించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. నగరంలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని కేంద్ర మంత్రిని కోరారు. పాతబస్తీ మీదుగా మెట్రో రైలు విస్తరణకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రితో సిఎం రేవంత్ చర్చించారు. ఈవిషయంలో తమకు చేయూతనివ్వాలని సిఎం విజ్ఞప్తి చేశారు.

వరంగల్.. కరీంనగర్ సమస్యలపైనా…
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఇతర నగరాలైన వరంగల్, కరీంనగర్ సమస్యలపైనా కేంద్ర మంత్రి ఖట్టర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో చేపట్టిన పనులు పూర్తికాలేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ పనులు పూర్తయ్యే వరకు స్మార్ట్ సిటీ మిషన్ కాలపరిమితిని పొడిగించాలని కేంద్ర మంత్రిని కోరారు.

రాష్ట్ర ప్రయోజనాల సాధనకు పార్లమెంట్ వేదికగా ముందుకెళ్లాలి: ఎంపిలకు సిఎం పిలుపు
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో రెండో రోజైన మంగళవారం కేంద్ర మంత్రి నడ్డాతో భేటీ అయ్యారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద తెలంగాణకు రావల్సిన బకాయిలు రూ.693.13 కోట్లు వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఙప్తి చేశారు. రాష్ట్రంలో ఆరోగ్య సేవలకు అంతరాయం కలగకుండా కేంద్రం వాటా నిధులను రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేసిందని, ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. లోక్‌సభలో మంగళవారం జరిగిన ఎంపిల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి గెలుపొందినా, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా లోక్‌సభలో పోరాడాలని ఎంపిలకు సిఎం సూచించారు. ప్రమాణ స్వీకారం చేసిన ఎంపిలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ వైరుధ్యాలు వేరు, రాష్ట్ర ప్రయోజనాలు వేరు అని గుర్తించి ముందుకు సాగాలని, రాష్ట్ర ప్రయోజనాల సాధనకు పార్లమెంట్ వేదికగా చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపిలకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News