Tuesday, September 17, 2024

కెసిఆర్ గవర్నర్.. కెటిఆర్ కేంద్ర

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపిలో బిఆర్‌ఎస్ పార్టీ విలీనం తథ్యమని సిఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వితో ఢిల్లీలో భేటీ అయ్యారు. అనంతరం సిఎం రేవంత్ మీడియాతో చిట్‌చాట్ చేశారు. బిఆర్‌ఎస్ నాయకులు తన వ్యాఖ్యలను ఇప్పుడు ఖండించినా ఎప్పటికైనా అది జరగక మానదన్నారు. తెలంగాణకు సింఘ్వి రాకను స్వాగతిస్తున్నానని ఆయన తెలిపారు. ఢిల్లీ వాళ్లకు రాజ్యసభ ఎలా ఇస్తారన్న బిఆర్‌ఎస్ వాళ్ల విమర్శలు పట్టించుకోవడం లేదని, బిఆర్‌ఎస్ వాళ్లు కంటి నొప్పి, పంటి నొప్పికి కూడా ఢిల్లీకే వెళతారని, ఆ మాత్రం వైద్యం చేసేటోళ్లు తెలంగాణలో లేరా? అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి, ఢిల్లీలో మీడియా అడ్వయిజర్ పదవి కెసిఆర్ ఎవరికి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. బిజెపిలో బిఆర్‌ఎస్ పార్టీ విలీనం అయిన వెంటనే కెసిఆర్‌కు గవర్నర్ పదవి, కెటిఆర్‌కు కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయని సిఎం రేవంత్ ఎద్దేవా చేశారు. హరీష్‌రావు రాష్ట్రంలో ప్రతిపక్ష నేత అవుతారంటూ సిఎం రేవంత్ జోస్యం చెప్పారు. అదేవిధంగా బిఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపిలు బిజెపిలో విలీనం కాగానే అందుకు ప్రతిఫలంగా బెయిల్ వస్తుందని రేవంత్ పేర్కొన్నారు. నాలుగు రాజ్యసభ సీట్లకు సమానంగా కవితకు రాజ్యసభ సీటు కన్‌ఫాం చేస్తారని అన్నారు.

నా సోదరులకు ప్రభుత్వంలో ఎలాంటి పదవులు లేవు
నా సోదరులకు ప్రభుత్వంలో ఎలాంటి పదవులు లేవని, ఎవరూ ప్రొటోకాల్ వాడడం లేదని సిఎం రేవంత్ పేర్కొన్నారు. వాళ్ల సొంత డబ్బులతో విదేశాలకు వెళితే ఎవరికి ఇబ్బంది అయ్యిందో చెప్పాలన్నారు. అమెరికాలో తన కుటుంబ సభ్యులు ఎన్నో ఏళ్లుగా ఉంటున్నారని, ప్రభుత్వంలో ఎటువంటి బాధ్యతలు తన సోదరులకు ఇవ్వలేదని ఆయన తెలిపారు. తనకు ఏడుగురు సోదరులని, తాను సిఎం అయ్యాయని వారందరూ ఇంట్లో కూర్చుంటారా, వారు వ్యక్తిగతంగా విదేశీ పర్యటనకు వెళ్లినా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నారని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

రుణమాఫీ కాని అన్నదాతలు
కలెక్టరేట్‌లో దరఖాస్తు చేసుకోవాలి..
వరంగల్ డిక్లరేషన్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసి చూపించామని ఆయన పేర్కొన్నారు. రుణమాఫీ కాని, రైతులు ఎవ్వ రూ నిరుత్సాహ పడొద్దని, రుణమాఫీకి రూ.5 వేల కోట్ల మేర రిజర్వ్ నిధులు అందుబాటులో ఉన్నాయని సిఎం రేవంత్ తెలిపారు. రుణమా ఫీ కాని అన్నదాతలు అందరూ కలెక్టరేట్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సిఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఒకే కుటుంబంలోని వారికి రూ.2 లక్షలకు పైగా రుణం ఉంటే వారిని ఒక యూనిట్‌గా పరిగణించి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఆయన అన్నారు. తన మార్క్ పాలన ఉండాలని ఆగష్టు 15వ తేదీ వరకు రుణమాఫీ తేదీని ప్రకటించి మాట తప్పకుండా, మడమ తిప్పకుండా దానిని అమలు చేశామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటాం

రాష్ట్ర అర్థిక పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న కెసిఆర్ దాచిన ఖజానాను అంతా కాంట్రాక్టర్లకే కట్టబెట్టాడని ఆయన ఆరోపించారు. పిసిసి చీఫ్ పదవి అంశం తన చేతిలో లేదని, అధిష్టానం నిర్ణయం ప్రకారం తాము నడుకుంటామని సిఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఆ విషయంలో తన అభిప్రాయాన్ని అధిష్టానానికి చెప్పానని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావును మించిన విధేయుడు కాంగ్రెస్‌లో లేరని సిఎం అన్నారు. ఇక ఎస్సీ వర్గీకరణపై తాము ఒక స్టాండ్ తీసుకున్నామని, అదే అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టామని సిఎం రేవంత్ గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News