Tuesday, September 17, 2024

కృత్రిమ మేథతో ఫ్యూచర్ సిటీ

- Advertisement -
- Advertisement -

అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరిద్దాం
విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్‌లా ఏ నగరమూ సిద్ధంగా లేదు
ముచ్చర్లలో 200 ఎకరాల్లో ఏర్పాటు చేస్తాం
ప్రతి ఇన్నోవేషన్ ప్రపంచానికి ఉపయోగపడాలి
హెచ్‌ఐసీసీలో ఏఐ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సదస్సులో 25 అంశాలతో రోడ్ మ్యాప్ విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
ప్రపంచ మేథోశక్తిగా తెలంగాణ : ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మన తెలంగాణ / హైదరాబాద్: సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. నేటి తరం అద్భుత ఆవిష్కరణ ఏఐ అని కొనియాడారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్లోబల్ ఏఐ’ సదస్సుకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్‌లో జీపీయూ ఆధారిత ఏఐ క్లౌడ్ ఏర్పాటులో భాగస్వామ్యంలో సదస్సులో చర్చించారు.

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాయని,అవి ఆశలతో పాటు భయాన్నీ తీసుకొస్తాయన్నారు. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ మాదిరిగా ఏ నగరమూ సిద్ధంగా లేదని, ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది వేశామని చెప్పారు. నాస్కామ్ సహకారంతో ఏఐ ఫ్రేమ్ వర్క్‌కు రూపకల్పన జరుగుతుందని, ఆవిష్కరణలకు పారిశ్రామిక నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తోందని, అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరిద్దామని అన్నారు.

ముచ్చర్లలో 200 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు: ముచ్చర్ల ఫోర్త్ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఏఐ సిటీని ఏర్పాటు చేయబోతున్నామని, దానిని గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతి ఇన్నోవేషన్ ప్రపంచానికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. రైల్ ఇంజిన్, ఫొటో కెమెరా మొదలు కొని ఏఐ దాకా వచ్చామని అన్నారు. క్రమంగా టెక్నాలజీ పెరుగుతోందని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అవకాశాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఇస్తున్నామని, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని కోరారు.

రోడ్‌మ్యాప్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి: నగరంలోని హెచ్‌ఐసీసీలో గ్లోబల్ ఏఐ సదస్సు ప్రారంభమైంది. కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఏఐ రోడ్ మ్యాప్‌ను ఆవిష్కరించారు. రాబోయే రెండు, మూడేళ్లలో రాష్ట్రంలో ఏఐ అభివృద్ధికి చేపట్టే చర్యలను ఇందులో పేర్కొన్నారు. ఈ సదస్సుకు వివిధ ఐటీ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, వివిధ దేశాలకు చెందిన సుమారు రెండు వేల మంది ఏఐ నిపుణులు హాజరయ్యారు.

ముఖ్యమంత్రితో ఐబీఎం వైస్ ప్రెసిడెంట్ భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ ఐబీఎం వైస్ ప్రెసిడెంట్ (ఎమర్జింగ్ టెక్ అడ్వకెసీ) డానియెలా కాంబ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ హెఐసీసీ వేదికగా జరుగుతోన్న గ్లోబల్ ఏఐ సదస్సు ప్రాంగణంలో వీరు సమావేశమయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు, నూతన ఆవిష్కరణల అన్వేషణ తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల ప్రాంగణంలో అధునాతన ఏఐ సిటీని నిర్మిస్తోన్న విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఫ్యూచర్ సిటీని ఏఐ రాజధానిగా తీర్చిదిద్దాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికల పట్ల ఐబీఎం వైస్ ప్రెసిడెంట్ ఆసక్తి కనబరిచారు. ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఉన్నతాధికారులు, ఐబీఎం ప్రతినిధులు పాల్గొన్నారు.

సీఎంను కలిసిన అగ్రగామి యోటా ఇన్‌ఫ్రా సంస్థ అధినేత సునీల్ గుప్తా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని డేటా రంగంలో అగ్రగామి యోటా ఇన్‌ఫ్రా సంస్థ అధినేత సునీల్ గుప్తా మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతోన్న ఏఐ గ్లోబల్ సదస్సు ప్రాంగణంలో వీరు సమావేశమయ్యారు. ఏఐ సిటీ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఏఐ సిటీలో భాగస్వామిగా ఉండేందుకు యోటా ఇన్‌ఫ్రా ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో జీపీఎస్ ఆధారిత ఏఐ క్లౌడ్ సేవలను ప్రారంభించడానికి సైతం సిద్ధమవుతోంది.

ప్రపంచ మేథోశక్తిగా తెలంగాణ: దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
గ్లోబల్ ఏఐ సదస్సులో ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంలో ముందంజలో ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ ఈ విప్లవంలో కేవలం పాల్గొనడం మాత్రమే కాదని, దానిని నడిపిస్తోందని అన్నారు. రాష్ట్రం సంవత్సరానికి 11.3శాతం ఆర్థిక వృద్ధిని సాధించడంతో, మొత్తం రాష్ట్ర స్థూల ఉత్పత్తి 176 బిలియన్ డాలర్లుగా చేరింది. త్వరలోనే ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ఏఐ వ్యూహానికి కేంద్రబిందువు హైదరాబాదు సమీపంలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడిన ఏఐ సిటీ అని, ఇది పరిశోధన, అభివృద్ధికి అంకితం చేయబడిన హబ్‌గా రూపొందుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణను గ్లోబల్ ఏఐ చుక్కానిగా నిలబెట్టడానికి, అత్యాధునిక కంప్యూట్ ఫెసిలిటీస్, విస్తృత డేటా సెంటర్లు, సుస్థిర కనెక్టివిటీని అందిస్తోందన్నారు.

‘ఈ ఏఐ సిటీ నూతన ఆవిష్కరణలకు పుట్టినిల్లు అవుతుందని, టెక్నాలజీ శక్తిసామర్థ్యాన్ని దృఢంగా నిలపడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఏఐ సిటీలో ఒక స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ప్రారంభించడానికి కూడా మేం ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి ప్రకటించారు. ఏఐ సిటీ నిర్మాణం పూర్తయ్యేంత వరకు శంషాబాద్ తెలంగాణ ప్రపంచ వాణిజ్య కేంద్రం 2 లక్షల చదరపు అడుగుల అన్ని సౌకర్యాలతో కూడిన కార్యాలయ స్థలాన్ని ఏఐ ఆధారిత కంపెనీల కోసం అందిస్తుందని, తద్వారా ఏఐ సిటీ రూపకల్పన జరుగుతున్నప్పుడు వారు కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంటుందన్నారు. ఏఐ ఆధారిత తెలంగాణ కింద లక్ష్యాలను సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ ప్రైవేటు రంగ సంస్థలు, విద్యాసంస్థలు, దిగ్గజ టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు, లాభాపేక్షలేని సంస్థలతో 26 అవగాహన పత్రాలు కుదుర్చుకుంది.

ఈ అవగాహన పత్రాలు తెలంగాణను దేశంలో ఏఐ పరంగా బలమైన శక్తిగా మార్చడానికి ఉపకరిస్తాయని తెలిపారు. ఈ అవగాహన పత్రాలను ప్రధానంగా 7 విభాగాల్లో కుదుర్చుకున్నామన్నారు. కంప్యూట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్‌లెన్స్ కేంద్రం, స్కిల్లింగ్, ఇంపాక్ట్ అసెస్‌మెంట్, స్టార్టప్ ఇన్నోవేషన్, జనరేటివ్ ఏఐ , పరిశోధన సహకారం, డేటా అనోటేషన్ అని తెలిపారు. ఏఐ అభివృద్ధిని సమర్థవంతంగా నిర్వహించడానికి తెలంగాణ ఏఐ పాలన వ్యవస్థను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించిందని చెప్పారు.

ఏఐ తప్పుదోవ పట్టించే సందర్భాలు, డీప్ ఫేక్స్, ఏఐ ఆధారిత తప్పుడు సమాచారాన్ని నిరోధించడానికి నియంత్రణలను కలిగి ఉండే విధంగా ఈ పద్ధతిని రూపొందిస్తామని వెల్లడించారు. ఈ అంశాలన్నింటిని సమన్వయం చేసి ఏఐ ద్వారా తెలంగాణను ప్రపంచ మేధోశక్తి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ ప్రణాళికలు పటిష్టంగా రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఏఐలో పూర్తిగా పట్టు సాధించబోతున్నామని, తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఏటా అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. డీప్‌ఫేక్ లాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఏఐని సరైన దారిలో ఉపయోగించుకుంటామని చెప్పారు. ప్రపంచస్థాయి యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నామని పేర్కొన్నారు.

ఎథికల్ ఏఐ విషయంలో జపాన్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళుతున్నామని చెప్పారు. హైదరాబాద్‌కు సమీపంలో 200 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయి ఏఐ కంపెనీలు ఇక్కడ ఏర్పాటు అయ్యేలా చూస్తామని వివరించారు. రాబోయే రెండు రోజులు హెచ్‌ఐసీసీ వేదికగా ఏఐ పైనా చర్చలు, సెమినార్లు ఉంటాయని శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణలో ఏఐ విస్తరణకు మంచి అవకాశాలున్నాయని అన్నారు. అత్యాధునిక వసతులతో ఏఐ సిటీని నిర్మించబోతున్నామని వివరించారు. అన్ని ప్రభుత్వశాఖల్లో ఏఐని వినియోగిస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ కృత్రిమ మేథ అనే థీమ్ తో ముందుకు వెళ్తామని అన్నారు. ఏఐ టెక్నాలజీని మిస్ యూజ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News