Thursday, September 19, 2024

నెలకు రూ.300లకే ఇంటర్నెట్, కేబుల్ టీవి

- Advertisement -
- Advertisement -

టి-ఫైబర్‌కు వడ్డీ రహిత రుణం రూ.1779 కోట్లు అందించండి
నెలకు రూ.300లకే రాష్ట్రంలోని 93 లక్షల గృహాలకు ఫైబర్ కనెక్షన్ ఇప్పించేలా ప్రణాళికలు
ఎన్‌ఓఎఫ్‌ఎన్ మొదటి దశను భారత్ నెట్ – 3 ఆర్కిటెక్చర్‌కు మార్చే డిపిఆర్‌ను ఆమోదించండి..
కేంద్ర టెలికం, కమ్యూనికేషన్‌ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి
జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు తెలంగాణకు అవకాశం ఇవ్వండి
స్పోర్ట్ యూనివర్సిటీకి ఆర్థిక సాయం అందజేయండి
కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ ఎల్ మాండవీయకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లోని 63 లక్షల గృహాలు, పట్టణ ప్రాంతాల్లోని 30 లక్షల గృహాలకు నెలకు రూ.300లకే ఫైబర్ కనెక్షన్ కల్పించాలని లక్ష్యంగా పెట్టకున్నట్లు కేంద్ర టెలికం, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఢిల్లీలో శుక్రవారం కేంద్రమంత్రులను సిఎం కలిశారు. అందులో భాగంగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ ఎల్ మాండవీయకు జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు సంబంధించి తెలంగాణకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ముందుగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం కలిశారు. టి-ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా కనెక్టివిటీని కల్పించడం తమ ఉద్దేశమని కేంద్ర మంత్రి సింధియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. 65,500 ప్రభుత్వ సంస్థలకు జీ2జీ (గవర్నమెంట్ టు గవర్నమెంట్), జీ2సీ (గవర్నమెంట్ టూ సిటీజన్) కనెక్టివిటీ కల్పించడంతో పాటు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు నెలకు కేవలం రూ. 300లకే ఇంటర్నెట్, కేబుల్ టివి, ఈ- ఎడ్యుకేషన్ సేవలు అందించాలని తమ ప్రభుత్వం యోచిస్తుందని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు.

వివిధ ఆర్థిక సంస్థల ద్వారా రూ. 530 కోట్ల నిధుల సమీకరణ
రాష్ట్రంలో 300 రైతు వేదికలకు టీ-ఫైబర్ ద్వారా రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోందని, సాంఘిక సంక్షేమ పాఠశాలలకూ టీ-ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రూ. 1779 కోట్ల పెట్టుబడులతో ప్రతిపాదించిన టీ-ఫైబర్ ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.530 కోట్లను వివిధ ఆర్థిక సంస్థల ద్వారా సమీకరించిందని కేంద్ర మంత్రి సింధియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు.

మొత్తం పెట్టుబడి వ్యయం రూ.1,779 కోట్లను యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్(యూఎస్‌ఎఫ్‌ఓ) ద్వారా వడ్డీ లేకుండా దీర్ఘకాలిక రుణంగా ఇవ్వాలని కేంద్ర మంత్రి సింధియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ (ఎన్‌ఓఎఫ్‌ఎన్) మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి సకాలంలో అందించాలని కేంద్ర మంత్రి సింధియాను ముఖ్యమంత్రి కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఎన్‌ఓఎఫ్‌ఎన్ మొదటి దశ లైనియర్ ఆర్కిటెక్చర్ ఆధారంగా నడుస్తుంటే మిగతా ప్రాంతాల్లో రింగ్ ఆర్కిటెక్చర్ ఆధారంగా టీ-ఫైబర్ నడుస్తోందని కేంద్ర మంత్రికి సిఎం వివరించారు.

ఈ రీత్యా నెట్ వర్క్ సమర్థ నిర్వహణ, వినియోగం కోసం సకాలంలో ఎన్‌ఓఎఫ్‌ఎన్ మొదటి దశ మౌలిక సదుపాయాలకు అందించాలని ప్రతిపాదించారు. ఎన్‌ఓఎఫ్‌ఎన్ మొదటి దశను భారత్ నెట్ -3 ఆర్కిటెక్చర్‌కు మార్చడానికి గతేడాది అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ ను పంపించిందని కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆ డిపిఆర్‌ను త్వరగా ఆమోదించాలని సిఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. భారత్ నెట్ – 3 ద్వారా రాష్ట్రంలోని 33 జిల్లాల పౌరులకు ఈ-గవర్నెన్స్‌ను అందించగలుగుతామని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాల కల్పనకు ఉద్ధేశించిన భారత్ నెట్ ఉద్యమి పథకాన్ని టీ-ఫైబర్‌కు వర్తింపజేయాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

కీడా సంస్థల అప్‌గ్రేడేషన్ డిపిఆర్‌లను ఆమోదించండి: కేంద్ర క్రీడామంత్రికి విజ్ఞప్తి
జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులన్నీ తెలంగాణలో ఉన్నాయని, భవిష్యత్‌లో నిర్వహించనున్న ఒలింపిక్స్‌తో పాటు ఇతర అంతర్జాతీయ, జాతీయ క్రీడలు నిర్వహించే అవకాశాన్ని తెలంగాణకు ఇవ్వాలని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ ఎల్ మాండవీయకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి మాండవీయను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా క్రీడా శాఖపై తమకున్న లక్ష్యాలను, ఆకాంక్షలు, తెలంగాణకు ఉన్న ఘనతను కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు.

ఒలింపిక్స్‌తో పాటు పలు అంతర్జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించిన విషయాన్ని కేంద్ర మంత్రి మాండవీయకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అంతర్జాతీయ వేదికలపై క్రీడాకారులు రాణించడానికి అవసరమైన అన్ని వసతుల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి తెలియజేశారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్పోర్ట్ కాంప్లెక్స్, సరూర్ నగర్ స్టేడియం, ఎల్బీ స్టేడియం, కేవిబిఆర్ ఇండోర్ స్టేడియం, ఓయూ క్యాంపస్, జింఖానా గ్రౌండ్, హుస్సేన్‌సాగర్ తదితరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈత కొలనులు, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలు, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్స్, షూటింగ్ రేంజ్, ఫుట్‌బాల్ గ్రౌండ్స్, స్కేటింగ్ ట్రాక్స్, వాటర్ స్పోర్ట్ ఇతర క్రీడలకు వసతులు ఉన్నాయని కేంద్ర మంత్రి మాండవీయకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.

2025, జనవరిలో నిర్వహించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్..
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వివిధ కేటగిరిల ఫైవ్ స్టార్ హోటళ్లు ఉన్నాయని, విమాన, రైలు సర్వీసులతో అనుసంధానమై ఉందని సిఎం తెలిపారు. 2002లో నేషనల్ గేమ్స్, 2003లో ఆఫ్రో-ఏషియన్ గేమ్స్, 2007లో ప్రపంచ మిలటరీ గేమ్స్ హైదరాబాద్‌లో నిర్వహించిన విషయాన్ని కేంద్ర మంత్రి మాండవీయకు ముఖ్యమంత్రి గుర్తు చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకొని భవిష్యత్‌లో ఒలింపిక్స్, ఆసియన్ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్ తెలంగాణలో నిర్వహించే అవకాశం ఇప్పించాలని, 2025, జనవరిలో నిర్వహించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు హైదరాబాద్‌కు అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రి మాండవీయకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ యువతలోని క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు స్పోర్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి మాండవీయకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

స్పోర్ట్ యూనివర్సిటీల్లో అన్ని రకాల క్రీడలకు సంబంధించిన శిక్షణ, పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్య మంత్రి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో స్పోర్ట్ యూనివర్సిటీకి అవసరమైన ఆర్థిక సాయం అందజేయాలని కేంద్ర మంత్రి మాండవీయకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ఖేలో ఇండియా పథకం కింద నిధులు విడుదలను పెంచాలని కేంద్ర మంత్రి మాండవీయను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసి బాలయోగి స్టేడియం, సెంట్రల్ యూనివర్సిటీలోని షూటింగ్ రేంజ్, ఎల్ బి స్టేడియం, హకీంపేటలోని స్పోర్ట్ స్కూల్, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో మౌలిక వసతుల అభివృద్ధికి తాము ఇప్పటికే పంపించిన డిపిఆర్‌లను ఆమోదించాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News