Tuesday, October 8, 2024

వరద నష్టం పనులకు రూ.11,713 కోట్లు ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ, మరమ్మతు పనులకు రూ.11,713.49 కోట్లు సత్వరమే విడుదల చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం భేటీ అయ్యారు. తెలంగాణలో ఆగష్టు 31వ తేదీ నుంచి నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపాయని సిఎం తెలిపారు. 37 మంది ప్రాణాలు కోల్పోయారని, లక్షకుపైగా పశువులు, ఇతర మూగ జీవాలు మృతిచెందాయని, 4.15 లక్షల ఎకరాల్లో పంటతో పాటు రోడ్లు, కల్వర్టులు, కాజ్‌వేలు, చెరువులు, కుంటలు, కాలువలు దెబ్బతిన్నాయని కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతు పనులను తాము వెంటనే చేపట్టామని సిఎం వివరించారు. ఆయా పనులకు రూ.5,438 కోట్లు విడుదల చేయాలని సెప్టెంబర్ రెండో తేదీన తాను లేఖ రాసిన విషయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు.

రాష్ట్రంలో పంట, ఇతర నష్టాలపై కేంద్ర బృందం పర్యటించి మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతులకు రూ.11,713 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సెప్టెంబర్ 30వ తేదీన నివేదిక సమర్పించిందని సిఎం తెలిపారు. ఆ నిధులు పునరుద్ధరణ, మరమ్మతుల పనులకు ఎంతమాత్రం సరిపోవని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వాటిని ఇప్పటివరకు విడుదల చేయనందున వెంటనే ఆ నిధులు విడుదల చేయాలని సిఎం కోరారు. 2024-,25 సంవత్సరానికి సంబంధించి ఎస్‌డిఆర్‌ఎఫ్ మొదటి, రెండో విడతల కింద తెలంగాణకు రూ.416.80 కోట్లను కేంద్రం విడుదల చేసిందని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి తెలియజేశారు. పునరుద్ధరణ, మరమ్మతు పనులకు విడుదల చేసే నిధులను గతంలో ఎస్‌డిఆర్‌ఎఫ్ పనులకు సంబంధించిన నిధులు ఉపయోగానికి ముడిపెట్టవద్దని కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఎస్‌డిఆర్‌ఎఫ్‌కు సంబంధించిన నిధులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే వ్యయం చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

ఆ మూడు జిల్లాలను ఎల్‌డబ్ల్యూఈలో కొనసాగించాలి
వామపక్ష తీవ్రవాద ప్రభావిత (ఎల్‌డబ్ల్యూఈ) నుంచి తొలగించిన ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలను తిరిగి ఎల్‌డబ్ల్యూఈలో చేర్చాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఎల్ డబ్ల్యూఈ ప్రభావిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్‌తో తెలంగాణకు సరిహద్దు ఉండటంతో రాష్ట్ర భద్రతపైన మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అంతర్గత భద్రతను దృష్టిలో ఉంచుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామాల్లో సీఆర్‌ఫిఎఫ్ జేటిఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎస్పీఓలకు చెల్లించాల్సిన నిధుల్లో కేంద్రం వాటా 60 శాతం నాలుగేళ్ల నుంచి పెండింగ్‌లో ఉందని, ఆ మొత్తం రూ.18.31 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని సిఎం కోరారు. 1,065 మందిని ఎస్పీఓల్లో చేర్చుకోవడానికి నిబంధనలు సడలించాలని ఆయన కోరారు.

తెలంగాణ సరిహద్దుల్లోని మలుగు జిల్లా పేరూరు, ములుగు, కన్నాయిగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలిమెల, మహ ముత్తారం, కాటారం వంటి పోలీస్ స్టేషన్లను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పోలీస్ శాఖ కొత్తగా నియమితులైన పోలీసు సిబ్బందికి గ్రేహౌండ్స్ ద్వారా తీవ్రవాద వ్యతిరేక వ్యూహాల్లో (ఏఈటి) శిక్షణ ఇప్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. 2024,-25 సంవత్సరంలో ఈ రకమైన శిక్షణకు అదనపు బడ్జెట్ రూ.25.59 కోట్లు అవసరమని, ఆ మొత్తాన్ని విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా పోలీసు దళాలను తీర్చిదిద్దే పనులకు ఉద్దేశించిన ప్రత్యేక మౌలిక వసతుల పథకం (ఎస్‌ఐఎస్)కు తెలంగాణకు కేవలం రూ.6.70 కోట్లు మాత్రమే విడుదల చేశారని, అవి ఏమాత్రం సరిపోవని అదనంగా రూ.23.56 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని సిఎం కోరారు.

పునర్విభజన సమస్యలపై….
పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర పునర్విభన సమస్యల పరిష్కారానికి సహకరించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. షెడ్యూల్ 9లోని (చట్టంలోని 53, 68, 71 సెక్షన్ల ప్రకారం) ప్రభుత్వ భవనాలు, కార్పొరేషన్‌ల పంపిణీ, షెడ్యూల్ పరిధిలోని సంస్థల వివాదం (చట్టంలోని 75 సెక్షన్ ప్రకారం) సామరస్య పూర్వక పరిష్కారానికి కృషి చేయాలని సిఎం విజ్ఞప్తి చేశారు. పునర్విభజన చట్టంలో ఎక్కడా పేర్కొనని ఆస్తులు, సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకుంటున్నందున, వాటిలో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

ఐపిఎస్ అధికారులపై
తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 29 అదనపు ఐపిఎస్ పోస్టులను కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో తెలంగాణకు కేవలం 76 మంది ఐపిఎస్ అధికారులను మాత్రమే కేటాయించారని ఆయన తెలిపారు. ఐపిఎస్ కేడర్‌పై వెంటనే సమీక్ష వెంటనే చేపట్టాలని కేంద్ర మంత్రిని సిఎం విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో నల్గొండ ఎంపి రఘువీర్ రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎపి జితేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి, డిజిపి జితేందర్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News