Friday, July 5, 2024

పాలన పరుగెత్తాలి.. వారానికో జిల్లాకు నేనే వస్తా: సీఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వం ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేయండి
కొన్ని జిల్లాల్లో కలెక్టర్ల పని తీరు బాగాలేదు
ఫీల్డ్ విజిట్‌లు చేస్తేనే జనం సమస్యలకు పరిష్కారం 
ఒక్కో అధికారి ఫ్లాగ్‌షిప్ ఐడియాను ప్రభుత్వానికి ఇవ్వాలి
జిల్లా అధికారులతో సీనియర్ ఐఎఎస్‌లు తరచూ సమీక్ష నిర్వహించాలి
ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం 
విభాగాల కార్యదర్శులతో సచివాలయంలో సుదీర్ఘ సమీక్ష

నెలకోసారి జిల్లా అధికారులతో సమీక్ష జరపాలి, జిల్లాలో ఎప్పటికప్పుడు పర్యటించాలని సీనియర్ ఐఏఎస్ అధికారులకు సిఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో మంగళవారం అన్ని విభాగాల కార్యదర్శులతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సమావేమయ్యారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి ఈ సమీక్షలో పాల్గొన్నారు. మొత్తం 29 విభాగాలకు చెందిన ఐఏఎస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తాను కూడా జిల్లాలో పర్యటిస్తానని, అక్కడ అమలవుతున్న ప్రభుత్వ పథకాల తీరును స్వయంగా పరిశీలిస్తానని సిఎం రేవంత్ తెలిపారు.

ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేయాలి
ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఐఏఎస్ అధికారులందరూ విధిగా తమ పరిధిలోని శాఖలు, విభాగాలపై పట్టు సాధించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజా పాలనను అందించేందుకు అందరూ బాధ్యతగా పని చేయాలని ఆయన దిశానిర్ధేశం చేశారు. అందరూ కలిసికట్టుగా పని చేసి ప్రజలకు సుపరిపాలనను అందించాలని ఆయన సూచించారు.

దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన అన్నారు. తమ శాఖల పని తీరును మెరుగుపరిచేందుకు అవసరమైన ప్రక్షాళన చేసుకోవాలని సిఎం సూచించారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు, వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని సిఎం అన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు పలువురు ముఖ్యమంత్రులతో పనిచేసిన అనుభవంంపన్న అధికారులు ఇప్పటికే కీలక విభాగాల్లో ఉన్నారని, ఎప్పటికప్పుడు ఆ ప్రభుత్వ ప్రాధాన్యాతలను గుర్తించి అధికారులు తమ పనితీరును చాటుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు మేలు జరిగే పనులు చేయాలన్న సంకల్పంతో విధులు నిర్వహించాలని, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేయాలని ఆయన కోరారు.

వారానికి ఒకరోజు క్షేత్రస్థాయి పర్యటనకు…
అధికారులందరూ ఏకతాటిపై పని చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని సిఎం రేవంత్ అన్నారు. సచివాలయం నుంచి క్షేత్రస్థాయి వరకు అందరూ తమ విభాగాలపై పట్టు సాధించాలని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో అయిదు గ్యారంటీలను అమలు చేశామని సిఎం చెప్పారు. తర్వాత వంద రోజులు ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు, పనులు నిలిచిపోయాయని, ఇకపై అధికారులు విధిగా పరిపాలనపై దృష్టి సారించాలని సిఎం రేవంత్ ఆదేశించారు. రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు, వినూత్న ఆలోచనలను ఎప్పటికప్పుడు నేరుగా సిఎంఓతో పంచుకోవాలని ఆయన సూచించారు. ఒక్కో అధికారి ఒక్కో ఫ్లాగ్ షిప్ ఐడియాను రెండు వారాల్లో ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు.

ప్రజలకు సుపరిపాలనను అందించేందుకు అధికారులు క్రమశిక్షణ పాటించాలని, ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి ప్రజా ప్రయోజనాలకు ప్రాదాన్యమివ్వాలని సిఎం చెప్పారు. సమయపాలనను తప్పనిసరిగా పాటించాలని, ప్రతి రోజు టైమ్ ప్రకారం సెక్రటేరియట్‌లో అందుబాటులో ఉండాలని సిఎం రేవంత్ కోరారు. కేవలం ఆఫీసులకు పరిమితం కాకుండా తమ విభాగం పనితీరును పర్యవేక్షించేందుకు వారానికి ఒక రోజు విధిగా జిల్లాలకు క్షేత్ర పర్యటనకు వెళ్లాలని సిఎం ఆదేశించారు. నెలకోసారి అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని, సంబంధిత విభాగం చేపట్టిన కార్యక్రమాలు, జరుగుతున్న పనుల పురోగతిని తెలుసుకోవాలని సూచించారు.

త్వరలోనే షెడ్యూల్‌ను విడుదల చేస్తా
చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారులు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని, తమ అనుభవంతో సుపరిపాలన విధానాలు అమలు చేయాలని సూచించారు. విధిగా కలెక్టర్లు కూడా క్షేత్ర పర్యటనకు వెళ్లేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిఎస్‌ను ఆదేశించారు. ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రభుత్వ సేవలందించే అన్ని విభాగాలను అప్పుడప్పుడు విజిట్ చేయాలని ఆయన చెప్పారు. ప్రజల సమస్యలు, ఇబ్బందులు, అనూహ్యంగా జరిగే సంఘటనలు, దుర్ఘటనలపై అధికారులు సత్వరమే స్పందించాలని ఆయన కోరారు. అన్ని శాఖల్లో మెరుగైన విధానాలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని సిఎం గుర్తు చేశారు. వ్యక్తుల ఇష్టాయిష్టాలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు.

వ్యక్తిగతంగా అధికారులపై రాగద్వేషాలేమీ లేవని, కేవలం పని తీరు ఆధారంగానే అధికారులకు తదుపరి ఉన్నత అవకాశాలుంటాయని, బాగా పని చేసే వారికి ప్రోత్సాహకాలుంటాయని సిఎం అధికారులకు భరోసా ఇచ్చారు. లేనిపోని సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని, ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలని ఆయన చెప్పారు. త్వరలోనే వారానికో జిల్లా పర్యటనకు వెళుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులతో పాటు క్షేత్ర స్థాయిలో వివిధ కార్యక్రమాల అమలు తీరును స్వయంగా పరిశీలిస్తానని సిఎం రేవంత్ చెప్పారు. అక్కడి ప్రజలను కలుసుకునేలా తన పర్యటన ఉంటుందని అధికారులను సిఎం రేవంత్ అప్రమత్తం చేశారు. త్వరలోనే తన జిల్లాల పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News