భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14) సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ చేసిన కృషిని ఆయన కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళల సాధికారతకు అంబేద్కర్ అవిశ్రాంతంగా కృషిచేశారని వివరించారు. దీర్ఘదృష్టితో దేశ భవిష్యత్తును ఊహించి, దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారని స్మరించారు. ప్రజల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన పోరాటం ప్రపంచానికి ఆదర్శం అని, ఆయన ఆశయాలను సాకారం చేయడానికి అందరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాధ్యం చేసింది అంబేద్కర్ రాజ్యాంగమేనని సిఎం గుర్తుచేశారు.
బాబా సాహెబ్ స్ఫూర్తితో రాఙె ప్రభుత్వం ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. దళితుల అభ్యున్నతిలో తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. అంబేద్కర్ ఆలోచనల నుంచి ప్రేరణ పొంది, ప్రజా ప్రభుత్వం ఎస్సి వర్గీకరణ, బిసి రిజర్వేషన్ల పెంపు వంటి కీలక నిర్ణయాలతో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. అట్టడుగు వర్గాలకు అవకాశాల కోసం అంబేద్కర్ పేరిట నాలెడ్జ్ సెంటర్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్య, రాజీవ్ యువ శక్తి పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి అందిస్తున్నట్లు సిఎం రేవంత్రెడ్డి వెల్లడించారు.