Thursday, September 19, 2024

జైపాల్‌రెడ్డి ధీరుడు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధిః తెలంగాణ రాష్ట్ర సాధనలో మాజీ ఎంపి, ఉత్తమ పార్లమెంటేరియ న్ సూదిని జైపాల్‌రెడ్డిది కీలక భూమిక అని రాష్ట్ర ము ఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. జైపాల్‌రెడ్డి 5వ వర్ధంతిని పురస్కరించుకుని నాగర్‌కర్నూల్ జిల్లా, కల్వకుర్తి నియోజకవ ర్గ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన జైపాల్‌రెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భం గా సిఎం మాట్లాడుతూ ..జైపాల్‌రెడ్డి ఎంపిగా ఉండి 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్టీలకు అతీతంగా క్యాబినెట్ మొత్తాన్ని ఏకగ్రీవంగా ఆ మోదం తెలిపే విధంగా కృషి చేశారన్నారు. తెలంగాణ బి ల్లు ను అడ్డుకోవడానికి కుట్రలు జరుగుతుండగా స్పీకర్ మీ రాకుమారిని కలిసి చట్ట ప్రకారం పార్లమెంట్ నియమాలకు అనుగుణంగా బిల్లును ఎలా ఆమోదింపచేయాలో ఆ యన ఇచ్చిన సూచనలతో ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. తెలంగాణను అడ్డుకుంటున్న తరుణంలో పార్లమెంట్ తలుపులు మూసి, టివిల లైవ్‌ను నిలిపి, అందరి ఆమోదంతో పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ఆమోదింపచేయించిన గొప్ప ధీరుడు జైపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చిన 2014లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి రాలేదని తనను కొందరు అడిగారని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చిందని చెప్పుకోకపోవడం వల్లే అధికారంలోకి రాలేదని అన్నారు. 2014లో తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా జైపాల్‌రెడ్డిని ప్రకటించి ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదని అన్నారు. 2023 బడ్జెట్ సమావేశాలలో ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ మాట్లాడుతూ తెలంగాణపై విషం చిమ్మారని అన్నారు. పార్లమెంట్ తలుపులు మూసి, కరెంటు తొలగించి, తెలంగాణ ఇచ్చారని, తల్లిని చంపి బిడ్డను బతికించారని, తక్కువ చేసే మాటలను తెలంగాణ పట్ల ప్రధాని మాట్లాడడం బాధాకరమన్నారు. బిల్లు ఆమోదం కాకుండా అడ్డుకుంటుంటే అప్పటి స్పీకర్ తీసుకున్న నిర్ణయమే అది అన్నారు.

= నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడ్డ ధీరుడు జైపాల్‌రెడ్డి
తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి తన రాజకీయ ప్రస్థానాన్ని సాగించిన గొప్ప ధీరుడు సూదిని జైపాల్‌రెడ్డి అని సిఎం అభివర్ణించారు. జైపాల్‌రెడ్డి అంటే ఒక ప్రజాప్రతినిధి కాదని.. ఒక సిద్ధాంతకర్తగా దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మార్గదర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు గడించారన్నారు. నాలుగుసార్లు కల్వకుర్తికి ఎంఎల్‌ఎగా, ఐదుసార్లు ఎంపిగా, రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా చివరి శ్వాసవరకు ఆయన ప్రజాజీవితంలో గడిపారన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో పుట్టపాగ మహేంద్రనాథ్, ధ్యాప గోపాల్‌రెడ్డి, సూదిని జైపాల్‌రెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డిలకు వారి పదవుల నుంచి గౌరవం, పేరు రాలేదని వారి నీతి నిజాయితీ నిబద్ధత గల నిస్వార్థ రాజకీయ నాయకులు కావడం వల్లే వారు అనుభవించిన పదవులకు గుర్తింపు వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వద్దకు వచ్చే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు తెలంగాణ బిడ్డలు తాము జైపాల్‌రెడ్డి శిష్యులమని గొప్పగా చెప్పుకునేవారన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డులు అందుకున్న జైపాల్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన జైపాల్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా అభివర్ణించారు.

= ముచ్చర్లలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ
నాగర్‌కర్నూల్ జిల్లాకు, కల్వకుర్తి నియోజకవర్గానికి ముఖద్వారం అయిన కడ్తాల్ వద్ద ముచ్చర్లలో 100 కోట్ల రూపాయలతో 50 ఎకరాలలో యంగ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీకి ఆగస్టు ఒకటో తేదీన శంకుస్థాపన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. నిరుద్యోగ యువతలో ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ దోహదపడుతుందని అన్నారు. యువతకు ఉపాధి కల్పించడమే లక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.

దూలం లెక్క పెరిగిండు…దూడకున్న బుద్ధి లేదు
దూలం లెక్క పెరిగిండని దూడకున్న బుద్ధి కూడా ఆయనకు లేదని పరోక్షంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎల హరీష్‌రావును ఉద్దేశించి ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ విషయంలో తాము ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతుంటే ఆగస్టులో రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తారా అంటూ రాజకీయం చేశారని ఎద్దేవా చేశారు. అయితే, ఆగస్టు నెల రాకముందే లక్ష రూపాయల రైతుల రుణమాఫీ చేశామన్నారు. జూలై 31 నాటికి రూ.1,50,000 ఉన్న రైతుల రుణాన్ని రెండవ విడతలో మాఫీ చేస్తామని అన్నారు. మాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటానని రేవంత్‌రెడ్డి అన్నారు. తాను ఆగస్ట్టు 14వరకు విదేశీ పర్యటనకు వెళ్తున్నానని ఆగస్టులోనే రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి కాంగ్రెస్‌కు అండగా నిలిచిన రైతుల రుణం తీర్చుకుంటానని అన్నారు.

కాంగ్రెస్ వస్తే ప్రజలకు కాదు.. కెసిఆర్ కుటుంబానికి కష్టాలు వచ్చాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు కష్టాలు వచ్చాయని కెసిఆర్, కెటిఆర్, హరీష్‌రావు చెబుతున్నారని, కానీ కాంగ్రెస్ వస్తే కష్టాలు వచ్చింది ప్రజలకు కాదని.. కెసిఆర్ కుటుంబానికి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నాయకుడి హోదాలో కెసిఆర్ రావాలని తాము కోరితే కెసిఆర్ రావడం లేదని కెటిఆర్ ప్రకటన చేశారని..కానీ మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ఉంటే 11ః30 గంటలకే కెసిఆర్ అసెంబ్లీకి వచ్చారని అన్నారు. దీనిని బట్టి చూస్తే తండ్రికొడుకుల మధ్య సమన్వయం లేదని స్పష్టమవుతోందన్నారు. ఇప్పటికే ఆ పార్టీని నాశనం చేశారని కేటిఆర్, హరీష్‌రావు తీరు ఇలాగే ఉంటే అసలుకే మోసం జరుగుతుందని భావించి కెసిఆర్ అసెంబ్లీకి ముందుగానే వచ్చారని అన్నారు. ప్రతిపక్ష హోదాలో రాష్ట్ర ప్రజల బాగుకోసం సలహాలు ఇవ్వాలని. విమర్శలే లక్షంగా ముందుకుపోతే అధికారం నుంచి పక్కకు పెట్టిన ప్రజలు పార్లమెంట్‌లో గుండుసున్నా ఇచ్చారని అన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పాత్ర పోషించి సలహాలు ఇస్తే పంచాయతీ ఎన్నికలల్లోనైనా కాస్త కొన్ని సీట్లయినా వస్తాయని సిఎం హితవు పలికారు.

కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలను గెలిపించుకుంటాం
కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలను గెలిపించుకునే బాధ్యత మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంపిలు తీసుకుంటారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పటివరకు పెద్దల ఎన్నికలు పూర్తయ్యాయని, ప్రస్తుతం కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయని, వారిని గెలిపించుకుని సంక్షేమం, అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామన్నారు.
సర్పంచ్ ఎన్నికలకు సన్నద్ధం కావాలి
సర్పంచ్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ సత్తా చాటాలని, అందుకోసం ముఖ్యమంత్రి స్థాయిలో తాను, మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంపిలు, పార్టీ పెద్దలంతా మీ గెలుపు కోసం పనిచేస్తామన్నారు.

= కల్వకుర్తికి వరాల జల్లు
కల్వకుర్తి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. వంద పడకల ఆసుపత్రి, ఆర్‌అండ్‌బి అతిథి గృహం, రోడ్ల నిర్మాణం, నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ, ఆమనగల్‌లో డిగ్రీ, జూనియర్ కళాశాలకు కొత్త భవనాలు, తాను చదువుకున్న తాండ్ర పాఠశాలకు రూ.5 కోట్లను ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. కల్వకుర్తి వాసిగా, నల్లమల బిడ్డగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటానన్నారు. సూదిని జైపాల్‌రెడ్డికి గౌరవం, గుర్తింపు పెంచే విధంగా విగ్రహ ఏర్పాట్లలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సభ అనంతరం కల్వకుర్తి మున్సిపల్ పరిధిలోని కొట్ర గేట్ వద్ద సూదిని జైపాల్‌రెడ్డి కాంస్య విగ్రహాన్ని సిఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కల్వకుర్తి ఎంఎల్‌ఎ కసిరెడ్డి నారాయణరెడ్డి అధ్యక్షత వహించగా, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదరం రాజనర్సింహ్మ, ఎంపి డాక్టర్ మల్లు రవి, ప్రణాళిక సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ జిల్లెల చిన్నారెడ్డి, ఎంఎల్‌సి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబెద్దుల్లా కొత్వాల్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు చల్లా వంశీచంద్‌రెడ్డి, డిసిసి అధ్యక్షుడు, ఎంఎల్‌ఎ వంశీకృష్ణ, ఎంఎల్‌ఎ్యలు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి, అనిల్‌రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఈర్లపల్లి శంకర్, గద్వాల మాజీ జెడ్‌పి చైర్‌పర్సన్ సరిత, మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, చిత్తరంజన్ దాస్, బాలాజిసింగ్, ఆనంద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News