Saturday, October 5, 2024

కుట్రలకు బలి కావొద్దు: నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, తప్పకుండా నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు, స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దని నిరుద్యోగుల్కు సూచించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇష్టమొచ్చినట్లు నిబంధనలు మార్చితే తలెత్తే చట్టపరమైన అంశాలను పరిగణనలోనికి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వం చేసినట్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నిరుద్యోగులకు న్యాయం జరగకపోగా ఇప్పుడున్న నోటిఫికేషన్లు కూడా రద్దయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం తమ ప్రభుత్వం ఇప్పటికే 28,942 ఉద్యోగ నియామకాలు చేసిందని గుర్తు చేశారు. ఏళ్లకు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలకు ఉన్న కోర్టు చిక్కులన్నింటిని అధిగమించినట్లు చెప్పారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి, ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు, వివిధ బోర్డులు నిర్వహించే పరీక్షలతో ఆటంకాలు ఏర్పడకుండా నిరుద్యోగులకు పూర్తి న్యాయం జరిగేలా కేలండర్ రూపొందిస్తామన్నారు. ఇంత కీలకంగా తమ ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో కసరత్తు చేస్తుంటే కొందరు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల జీవితాల్తో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కొందరు చేసే కుట్రలతో నోటిఫికేషన్లలోని నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియ నిలిచిపోయి నిరుద్యోగులు మరింత నష్టపోతారని సీఎం స్పష్టం చేశారు. నిరుద్యోగుల ఆందోళన దృష్ట్యా శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు.

భువనగిరి ఎంపీ చామల కిరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, సామ రామ్మోహన్‌రెడ్డి, పవన్ మల్లాది, ప్రొఫెసర్ రియాజ్, టీచర్ల జేఏసీ హర్షవర్ధన్‌రెడ్డి, ఓయూ విద్యార్ధి నాయకులు చనగాని దయాకర్, మానవతారాయ్, బాలలక్ష్మి,చారకొండ వెంకటేష్, కాల్వ సుజాత తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు మూడు గంటట పాటు జరిగిన ఈ సమావేశంలో నిరుద్యోగులకు సంబంధించిన డిమాండ్లు, జరుగుతున్న ఆందోళనల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు సంబంధిత అధికారులను పిలిపించి మాట్లాడారు. నిరుద్యోగులు లేవనెత్తిన డిమాంగ్లను పరిష్కరించేందుకు ఉన్న సాధ్యా సాధ్యాలపై చర్చించారు.

గ్రూప్ 1 పరీక్షకు ఒక్కో పోస్టుకు 1: 50 నిష్పత్తి చొప్పున కాకుండా 1: 100 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయాలనే డిమాండ్ పై సుదీర్ఘంగా చర్చ జరిగింది. గత ప్రభుత్వం 2022లో వేసిన గ్రూప్ 1 పరీక్ష పేపర్ల లీకేజీ, తప్పుడు నిర్ణయాల కారణంగా రెండు సార్లు వాయిదా పడిందని, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుప్రీంకోర్టులో ఉన్న ఈ పిటిషన్ వెనక్కు తీసుకుందని అధికారులు సీఎంకు వివరించారు. పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి అదనంగా మరిన్ని పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేసిందని చెప్పారు.

పన్నెండేళ్ల తరువాత చేపట్టిన గ్రూప్ 1 పరీక్షకు నాలుగు లక్షల మంది అభ్యర్ధులు పోటీ పడ్డారని, ఇటీవలే ప్రిలిమినరీ పరీక్షను టీజీపీఎస్‌సీ పకడ్భందీగా నిర్వహించిదని చెప్పారు. గ్రూప్ 2, డిఎస్సీ పరీక్షలు ఒకదాని వెంట ఒకటి ఉండడంతో అభ్యర్ధులు నష్టపోతున్నారని విద్యార్ధి సంఘం నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జులై 17 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డిఎస్సీ పరీక్షలు ఉన్నాయని, ఆ వెంటనే 7,8 తేదీల్లో గ్రూప్ 2 ఉండడంతో ప్రిపరేషన్‌కు ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. పరీక్షల తేదీల విషయంలో టీజీపీఎస్‌సీ, విద్యాశాఖతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి వారికి హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News