కుక్కల దాడిలో గాయపడిన చిన్నారికి సిఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. మూడు నెలలుగా కోమాలో ఉన్న బాలికకు మెరుగైన చికిత్స కోసం ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. జపాన్ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్ రెడ్డి వార్త పత్రికలు చదువుతూ బాలిక స్థితికి చలించిపోయారు. బాలిక ఆరోగ్య స్థితిని తెలుసుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడాలని అధికారులను సిఎం ఆదేశించారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నందికొండకు చెందిన హారిక కొద్ది రోజుల క్రితం
ఇంటిముందు ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన హారిక కోమాలోకి వెళ్లింది. అప్పటినుంచి కుటుంబ సభ్యులు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా నయం కాలేదు. బాలిక తండ్రి రెండేళ్ల క్రితం చనిపోవడం, కుటుంబం పేదరికంలో ఉండటంతో మెరుగైన చికిత్స అందించలేకపోయారు. వైద్యం కోసం ఆదుకోవాలని హారిక తల్లి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వార్తాపత్రికల్లో చిన్నారిపై వచ్చిన కథనాలను చూసిన సిఎం రేవంత్ రెడ్డి చలించిపోయారు. హారికకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో సిఎం రేవంత్ రెడ్డికి చిన్నారి కుటుంబ సభ్యులు కృతజ్ణతలు తెలిపారు.