Tuesday, September 17, 2024

నేడు ఢిల్లీకి సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినకు పయనమవుతున్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఆది, సోమవారాల్లో ఆయన హస్తినలో ఉండనున్నారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో పాటు పలువురు కేంద్రమంత్రులను రేవంత్ రెడ్డి కలవనున్నారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణతో పాటు కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై హైకమాండ్‌తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పదవుల పంపకం పూర్తవ్వడంతో మిగిలిన పదవులు ఎవరెవరికి కేటాయించాలి, పదవులు దక్కని సీనియర్లను ఎలా గౌరవించాలనే విషయంపై కూడా అధిష్టానంతో రేవంత్ చర్చించనున్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి చేరుకున్నారు.

వరంగల్ సభకు ఆహ్వానం : మరోవైపు వరంగల్‌లో ఏర్పాటుచేయబోయే భారీ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ అమలు చేయడంతో రాహుల్‌తో సభ పెట్టిస్తే బాగుంటుందనే ఉద్దేశంలో రాష్ట్ర నాయకులు ఉన్నారు. ఈ విషయాన్ని హైకమాండ్‌కు రేవంత్ తెలియజేయనున్నారు. ఇప్పటికే దీనిపై రేవంత్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. లక్షలాది మంది రైతులతో వరంగల్‌లో రైతు రుణమాఫీ సంబురం పేరుతో సభ నిర్వహించనున్నారు. దీనికి రాహుల్‌ను ఆహ్వానిస్తున్నారు. ఇక, రెండు రోజుల పర్యటనలో పలువురు కేంద్రమంత్రులను రేవంత్ రెడ్డి కలవనున్నారు. విభజన హామీల అమలుతో పాటు కొత్త రుణాలు, ప్రాజెక్టుల మంజూరుపై వివిధ శాఖల మంత్రులతో సమావేశమవుతారు. రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసే అవకాశం ఉంది. మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించనున్నారు.

పెండింగ్ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని కోరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కలవనున్నారు. పార్టీకి సంబంధించిన అంశాలపై ఆయన చర్చించనున్నారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తుండటంతో మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌తో చర్చించి ఎవరిని కొత్తగా మంత్రి వర్గంలోకి తీసుకోవాలనేదానిపై రేవంత్ చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను వివరించడంతో పాటు చేరికల అంశం ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ ఎంపికపై ప్రస్తుత ఢిల్లీ పర్యటనలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. గత ఢిల్లీ పర్యటనలోనే పీసీసీ చీఫ్ ఎంపికపై ఓ నిర్ణయానికి వచ్చినప్పటికీ.. పార్టీలో ఏకాభిప్రాయం రాకపోవడంతో పీసీసీ చీఫ్ ఎంపిక వాయిదాపడింది. ఈసారి మాత్రం కొత్త పీసీసీ అధ్యక్షుని ఎంపికపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News