Wednesday, October 23, 2024

కేరళకు వెళ్లిన సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం కేరళకు వెళ్లారు. వయనాడ్ ఉప ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఉదయం ఆ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ ఎంపిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె నామినేషన్ కార్యక్రమంలో సిఎం రేవంత్‌రెడ్డి కూడా పాల్గొననున్నారు. అయితే, గత లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ తో సహా రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసి రెండు చోట్ల అఖండ విజయం సాధించారు. దీంతో ఆయన రాయ్‌బరేలీ నుంచి ఎంపిగా కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో వయనాడ్ ఎంపి స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే, వయనాడ్ ఉప ఎన్నిక గెలుపును కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

సిట్టింగ్ స్థానానికి కాపాడుకునే విషయంలో పార్టీ అగ్ర నాయకత్వం అక్కడి నుంచి ప్రియాంక గాంధీని బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకుంది. గాంధీ కుటుంబానికి అక్కడ ఉన్న ఆదరణ, చరిష్మా ప్రియాంక గెలుపును మరింత సులువు చేస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. 2019లో కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న అమేథీలో రాహుల్ గాంధీ ఓడిపోయారు. అదే సమయంలో ఆయన వయనాడ్ నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. మళ్లీ 2024 జరిగిన లోకసభ ఎన్నికల్లో అక్కడి ప్రజలు రాహుల్ గాంధీని ఎంపి పీఠంపై కూర్చొబెట్టారు. అయితే, ప్రియాంక నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నట్టుగా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News