Tuesday, September 24, 2024

వన్ స్టేట్, వన్ డిజిటల్ కార్డు.. సంక్షేమానికి కేరాఫ్

- Advertisement -
- Advertisement -

రేషన్, ఆరోగ్య, ఇతర సంక్షేమ పథకాలన్నింటికి ఒకే కార్డు
ప్రతి నియోజకవర్గంలో ఒక పట్టణ,
ఒక గ్రామీణ ప్రాంతంలో పైలెట్ ప్రాజెక్టు
ఇతర రాష్ట్రాల్లో అమల్లోని విధానాలపై అధ్యయనం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలి డిజిటల్ కార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రేషన్, ఆరోగ్య, ఇతర సంక్షేమ పథకాలన్నింటిని ఒకే కార్డు ద్వారా అందించాలని భావిస్తోంది. రాష్ట్రంలో వన్ స్టేట్, వన్ డిజిటల్ కార్డు విధానంలో కార్డుల జారీకి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డిజిటల్ కార్డులో కుటుంబ సభ్యులందరి హెల్త్ ప్రొఫైల్ పొందుపరిచి, దాని ద్వారానే ఆరోగ్య సేవలు అందించాలన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక పట్టణం, ఒక గ్రామంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ అంశంపై వైద్యారోగ్య, పౌరసరఫరాల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో సోమవారం సమీక్ష నిర్వహించారు.

కుటుంబాల సమగ్ర వివరాల నమోదుతో ఇప్పటికే రాజస్థాన్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాలు కార్డులు ఇచ్చినందున వాటిపై అధ్యయనం చేయాలని, ఆ కార్డులతో కలుగుతున్న ప్రయోజనాలు, ఇబ్బందులపై అధ్యయనం చేసి ఒక సమగ్ర నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని పైలెట్ ప్రాజెక్టు కింద ఈ ఫ్యామిలి డిజిటల్ కార్డులకు సంబంధించి కార్యాచరణ ప్రారంభించాలని సిఎం సూచించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉండాలని, ఈ కార్డులతో లబ్ధిదారులు ఎక్కడైనా రేషన్, ఆరోగ్య సేవలు పొందేలా ఉండాలని తెలిపారు.

ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతి కుటుంబ సభ్యుని హెల్త్ ప్రొఫైల్ ఉండాలని, అది దీర్ఘకాలంలో వైద్య సేవలకు ఉపయోగపడుతుందని సిఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయా కుటుంబ సభ్యులు తమ కుటుంబాల్లో సభ్యుల కలయిక, తొలగింపునకు సంబంధించి ఎప్పటికప్పుడు కార్డును అప్‌డేట్ చేసుకునేలా ఉండాలని సూచింంచారు. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వ్యవస్థ మానిటరింగ్‌కు జిల్లాలవారీగా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, సంగీత సత్యనారాయణ, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియానా జడ్ చోంగ్తూ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News