Thursday, September 19, 2024

కాగ్నిజెంట్ క్యాంపస్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ క్యాంపస్ ఏర్పాటకు ముందుకొచ్చింది. ఈ కొత్త సెంటర్‌ను 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడంతో పాటు సుమారుగా దాదాపు 15 వేల మంది యువతకు ఉద్యోగాలు రానున్నాయి. అమెరికాలో ఆ కంపెనీ ప్రతినిధులు సిఎం రేవంత్‌రెడ్డి బృందంతో చర్చలు జరిపారు. ఈ కంపెనీ ప్రతినిధి బృందం ప్రపంచ స్థాయిలో ఐటి రంగంలో పేరొందింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో భారీ విస్తరణ ఈ కంపెనీ ప్రణాళికలను రూపొందించింది. హైదరాబాద్‌లో దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు పని కల్పించేలా ఈ కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇరవై వేల మంది ఉద్యోగులుండేలా పది లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ సెంటర్ ను స్థాపించనుంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల సందర్భంగా ఈ ఒప్పందం జరిగింది.

హైదరాబాద్‌లో తమ కంపెనీ విస్తరించటం సంతోషంగా ఉంది: కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్
గత ఏడాది ముఖ్యమంత్రి బృందం దావోస్ పర్యటన సందర్భంగానే ఈ ఒప్పందానికి పునాదులు పడ్డాయి. సాంకేతికత, కొత్త ఆవిష్కరణలకు అభివృద్ధి కేంద్రంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకే కాగ్నిజెంట్ కంపెనీ హైదరాబాద్‌లో తమ కంపెనీ విస్తరణకు మొగ్గు చూపింది. టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్‌లో తమ కంపెనీ విస్తరించటం సంతోషంగా ఉందని కాగ్నిజెంట్ సీఈఓ ఎస్.రవికుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నెలకొల్పే కొత్త సెంటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్‌లకు మెరుగైన సేవలందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్‌లో అత్యాధునిక పరిష్కారాలను అందిస్తుందని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందన్నారు.

ఐటి రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్‌ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. కాగ్నిజెంట్ కంపెనీకి తమ ప్రభుత్వం తగినంత మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని అన్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర టైర్-2 నగరాలలో కూడా ఐటీ సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి చేసిన సూచనకు కంపెనీ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రముఖ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయని, ఇక్కడ కొత్త కేంద్రాన్ని స్థాపించాలని కాగ్నిజెంట్ నిర్ణయం హైదరాబాద్ వృద్ధికి దోహదపడుతుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News