Sunday, September 8, 2024

అగ్నిపథం అభద్రపథం

- Advertisement -
- Advertisement -

నాలుగేళ్ల తర్వాత 25% యోగ్యులు 4 ఏళ్ల సేవను కోల్పోయి కొనసాగుతారు. 75% అయోగ్యులు ఇంటికి పోతారు. నియామకంలో అయోగ్యు లుంటారా? ఈ 75% అగ్నివీరులు భావితరాల్లో ఆత్మగౌరవాన్ని నింపుతారట! బిజెపి కార్యాలయాల భద్రతా సిబ్బందిగా అగ్నివీరులకు ప్రాధాన్యత నిస్తామని బిజెపి ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్ఘీయ గర్వించారు. ఇదీ అగ్నివీరులకు బిజెపి గౌరవం. సంఘ్ స్వభావులు సైన్యంలో కొనసాగుతారు. బయటికొచ్చేవారు సంఘ్ ధర్మసేన, బజరంగ్ దళాల శిక్షకులు, సభ్యులు అవుతారు. తాత్కాలిక సైన్యం అపాయమని పలువురు పూర్వ సైన్యాధికారులు హెచ్చరించారు.

అధికారానికొస్తే అగ్నిపథ్‌ను రద్దు చేస్తామంది కాంగ్రెస్. రెట్టలావు కోపంతో రెచ్చిపోయారు మోడీ. సైన్యాన్నే కించపర్చారని వక్తించారు. మోడీ సర్కారు 14 జూన్, 2022న ప్రకటించిన 3.5 ఏళ్ల కురచకాల కొత్త ఒప్పంద సేనా నియామక పథకానికి అగ్నిపథ్ అని, సైనికులకు అగ్నివీరులని పేర్లు పెట్టింది. గుజరాత్ ప్రచారకర్త, సిని నటుడు అమితాబ్ దీక్షిత్ తండ్రి హరివంశరాయ్ దీక్షిత్ (బచ్చన్ ఆయన కలం పేరు) ‘అగ్నిపథ్’ హిందీ కవిత రాశారు. 1990లో అదే పేరుతో దాన్ని సినిమా తీశారు.అమితాబ్ అభిమానులను ఆకర్షించడానికి తాత్కాలిక సైన్యానికి అగ్నిపథ్ పేరు పెట్టారు.

పెన్షన్ ఖర్చు తగ్గింపు అగ్నిపథ్ లక్ష్యం. ప్రభుత్వ పెన్షన్ కు 20 ఏళ్ల, పూర్తి పెన్షన్‌కు 33 ఏళ్ల సేవ తప్పనిసరి. సిపాయి 20 ఏళ్లకు రిటైరైతే అర్హత పెన్షన్‌ను 20/33 తో గుణించి పెన్షన్‌ను నిర్ణయిస్తారు. ఉపయుక్త పెన్షన్ 30.3% కు పడిపోతుంది. ప్రజా ప్రతినిధులు ఒక్క రోజు చేసినా జీవితాంతం పెన్షన్ వస్తుంది. 790 ఎంపిలు, 4,121 ఎం.ఎల్.ఎ.లు, 454 ఎం.ఎల్.సి.లు, లెక్కల్లో లేని పలువురు మాజీ, పూర్వ సభ్యులు, 4,575 మంది ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు పెన్షన్ తీసుకుంటున్నారు. ఎంపిల కనీస పెన్షన్ రూ. 25 వేలు. ప్రతి ఏడాది సేవకు రూ.2 వేలు కలుస్తుంది. ఒక వ్యక్తి ఎంపిగా, ఎంఎల్‌ఎగా, ఎంఎల్‌సిగా చేస్తే 3 పెన్షన్లు వస్తాయి.

మంత్రికి మంత్రి జీతం, ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సి, ఎంపి జీతం, పెన్షన్ మూడూ వస్తాయి. ఒక సభ్యునికి పెన్షన్, జీతం రెండూ ఇస్తారు. సభకు హాజరేకాని నటులు చిరంజీవి, రేఖ, వైజయంతిమాల, క్రీడాకారుడు తెండూల్కర్, పలువురు పారిశ్రామికవేత్తలు పెన్షన్లు తీసుకుంటారు. నట-రాజకీయ తమిళనాడు పూర్వ ఎంపి ఆర్. శాంతకుమార్ ఒక్కరే పెన్షన్ నిరాకరించారు. ఎంపిల జీతభత్యాల, పెన్షన్ల పద్ధతి న్యాయ సమ్మతమని 2018లో మోడీ సర్కారు సుప్రీం కోర్టుకు చెప్పింది.
సైన్య యౌవనం అగ్నిపథ్ మరో లక్ష్యం. నేటి 32 ఏళ్ళ సగటు కంటే అగ్నిపథ్ ఇచ్చే 26 ఏళ్ల సగటు ప్రయోజనం ఎంత? యువత, అనుభవజ్ఞుల నిష్పత్తిని క్రమేపీ 1:1 చేస్తారట. యుద్ధంలో శిక్షణ, అనుభవం, నైపుణ్యం ప్రధానం. నేటి 1.5 ఏళ్ల శిక్షణ కంటే 6 నెలల శిక్షణ సామర్థ్యాన్ని పెంచలేదు.

మూడో వంతు శిక్షణతో వృత్తి నైపుణ్య ప్రత్యేక సాధన లేని సైనికులు బ్రహ్మోస్, పినాక, వజ్ర వంటి అత్యాధునిక ఆయుధాలను వాడలేరు. పాకిస్తాన్, చైనాల దొంగ దాడులను ఎదుర్కోలేరు. అభిమన్య అగ్నివీరులు చక్రవ్యూహాన్ని ఛేదించలేరు.అనుభవ అవసరాన్ని ప్రభుత్వం గుర్తించ లేదు. ఉపాధి కల్పన అగ్నిపథ్ మరో మేలని రాజకీయ ప్రకటన. ఇది నిరుద్యోగాన్ని తగ్గించి, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచి, సమగ్రాభివృద్ధిని సాధిస్తుందట! 50 కోట్ల నిరుద్యోగంలో 50 వేల తాత్కాలిక ఉద్యోగాలు ఇంత పని చేస్తాయా? కోవిడ్ సాకుతో ఆపిన ఖాళీలు 1.3 లక్ష. అగ్నిపథ్ దాకా ఏడాదికి 65 వేల ఉద్యోగాలిచ్చారు. అగ్నిపథంలో మొదటి ఏడు 46 వేలు, మరుసటి ఏడాది నుండి 50 వేల మందిని నియమిస్తామన్నారు.

దీంతో ఉపాధి ఏడాదికి 15 వేలు తగ్గింది. కుల మత ప్రాంత ఆధారిత నియామకాలు రద్దవుతాయని అభాండ ప్రకటన. ప్రభుత్వం ప్రస్తావించిన రెజిమెంటల్ పద్ధతి బ్రిటిష్ ప్రభుత్వం యోచించి చేసింది. 75 ఏళ్ల నుండి ఈ పద్ధతి ప్రయోజనాలను గుర్తించారు. రెజిమెంట్ల, యూనిట్/ సబ్ యూనిట్ల పొందిక యుద్ధంలో ప్రధాన ప్రేరణ. వీటిలో కుల మత ప్రాంత ప్రసక్తి లేదు. ప్రతి రెజిమెంటులో అన్ని కుల మతాల దేశ వ్యాప్త పౌరులను నియమిస్తారు. బ్రిటిష్ వారు ప్రాంతాలకు, ప్రాంతీయ నాయకులకు ప్రాధాన్యతనిచ్చి ప్రాంతీయ గౌరవాన్ని పెంచారు. అదే గౌరవాన్ని రెచ్చగొట్టి మన సైనికులతోనే స్వతంత్ర సమర వీరులను కొట్టించారు. బ్రిటిష్ సైన్యంలో కశ్మీర్ పదాతి దళంలో తక్కువ స్థాయి వారికి, మరాఠా మహర్ (షెడ్యూల్డ్ కులం)లకు ప్రత్యేక దళాలుండేవి. స్వతంత్ర భారత సైన్యంలో వీటిని తగ్గించారు.

అనేక దేశాల్లో తాత్కాలిక సైన్యముందని సర్కారు వాదన. మోడీ నమూనాగా తీసుకున్న ఇజ్రాయిల్ సైన్యంలో ఐచ్ఛిక, నిర్బంధ రకాల సైన్యముంది. ఇజ్రాయిల్ నిర్బంధకాలం మగాళ్ళకు 30 నెలలు, స్త్రీలకు 22 నెలలు. దక్షిణ కొరియా పదాతి, నావికా, వైమానిక దళాలకు వరుసగా 21, 24, 25 నెలలు. చైనా, అమెరికాల నిర్బంధ కాలం 2 నుండి 8 ఏళ్ళు. రష్యా, బ్రెజిల్ లలో ఇది 12 నెలలు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో బలమైన రష్యా చిన్న ఉక్రెయిన్‌పై గెలవకపోడానికి రష్యా తాత్కాలిక సైన్యం ఒక కారణం. తాత్కాలిక సైన్యంలో చిత్తశుద్ధి, నిబద్ధత ఉండవు. 18 ఏళ్ళ ఇజ్రాయెల్‌లు నిర్బంధ తాత్కాలిక సైన్యంలో చేరాలి. యూదులను, అరబ్ -ఇజ్రాయెలీలను కావాలని మినహాయిస్తారు. సైన్యంలో చేరేవారి సంఖ్య 35% కి పడిపోయింది. సైనికుల సేవాకాల పరిమితిని ఇజ్రాయెల్ తగ్గించింది. 2,500 అధికార పదవులను కోసింది. లక్ష యోధులను తొలగించింది. 30% సైన్యాన్ని తగ్గించింది. జాతీయ నిర్బంధ ఇజ్రాయెల్ రక్షణ రంగం ప్రజాప్రాతినిధ్యాన్ని కోల్పోయి, చిన్న వృత్తి సైన్యంగా మారింది. అర్హత గల, పోరాటశ్రేణి అధికారులు సైన్యం వదిలేశారు. ఇజ్రాయెల్ నమూనా సైన్యం మోడీ సర్కారు సానుకూల ఆలోచన. ఇజ్రాయెల్ సైనిక దుర్గతి మనకూ పట్టగలదు.

నాలుగేళ్ల తర్వాత 25% యోగ్యులు 4 ఏళ్ల సేవను కోల్పోయి కొనసాగుతారు. 75% అయోగ్యులు ఇంటికి పోతారు. నియామకంలో అయోగ్యులుంటారా? ఈ 75% అగ్నివీరులు భావితరాల్లో ఆత్మగౌరవాన్ని నింపుతారట! బిజెపి కార్యాలయాల భద్రతా సిబ్బందిగా అగ్నివీరులకు ప్రాధాన్యతనిస్తామని బిజెపి ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్ఘీయ గర్వించారు. ఇదీ అగ్నివీరులకు బిజెపి గౌరవం. సంఘ్ స్వభావులు సైన్యంలో కొనసాగుతారు. బయటికొచ్చేవారు సంఘ్ ధర్మసేన, బజరంగ్ దళాల శిక్షకులు, సభ్యులు అవుతారు. తాత్కాలిక సైన్యం అపాయమని పలువురు పూర్వ సైన్యాధికారులు హెచ్చరించారు. ప్రభుత్వం వినలేదు. 12 లక్షల సైన్యంలో 25% (3 లక్షలు) తాత్కాలిక అగ్నివీరులు, 75% (9 లక్షలు) శాశ్వత సైన్యం. ప్రతి ఏడాదీ తీసుకునే 50 వేల తాత్కాలిక సైన్యం నుంచి 25:75 నిష్పత్తి కొనసాగుతుంది. 50:50 ప్రభుత్వ హామీ నెరవేరదు.

ప్రస్తుత సైన్యం 17 -62 ఏళ్ళకు పదవీ విరమణ చేస్తుంది. నేటి సైనిక శిక్షణ వసతులు 6 నెలల అగ్నివీరుల తరచు తర్ఫీదుకు చాలవు. సైన్యంలో చేరడానికి దేశభక్తి ప్రేరణ కాదు. మంచి జీతభత్యాలు, విశ్రాంత జీవిత సౌకర్యాలు ప్రేరణ. ఆకలి రాజ్యంలో దేశభక్తి, జాతీయత ఆదర్శాలు చెల్లవు.దేశభక్త మోడీ, అమిత్ షా ల పితృభూమి గుజరాత్ వాణిజ్య వర్గ ప్రజలు సైన్యంలో చేరరు. ఇది సైనిక సామాజిక సమతుల్యతను దెబ్బ తీస్తోంది. గుజరాత్, యుపి, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ పౌరులు సంఘ్ భావి సభ్యుల కోసం అగ్నిపథంలో చేరతారు. సైనిక సామాజిక సమతుల్యత తలకిందులవుతుంది. నూతన ఫాసిస్టు జాతీయవాదం అపాయకర అగ్నివీర రాజకీయ సైన్యాన్ని తయారు చేస్తుంది. కలహాలు సృష్టించి దేశాన్ని చీల్చేస్తుంది. 2013 ఎన్నికల్లో మోడీ సైనికుల ‘ఒక పదవి ఒక పెన్షన్’ పథకాన్ని సమర్థించారు. 2022లో పదవి, పెన్షన్ లేని అగ్నిపథ్ చేపట్టారు. దీనికి బదులు ఎన్‌సిసి, గైడ్స్, టెరిటోరియల్ ఆర్మీలతో సిద్ధసైన్యాన్ని నిర్మించవచ్చు. అగ్నిపథ్ పథకాన్ని పునఃపరిశీలిస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. సైన్యాధికారుల అనుభవ నివేదికను కోరారు. సంఘ్ కౌటిల్యునికి కోపం రాలేదు. దీని భావమేమి?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News