Friday, February 28, 2025

వేడెక్కనున్న తెలంగాణ రాజకీయాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో వేసవి వేడితోపాటు రాజకీయాలు కూడా వేడెక్కబోతున్నాయి. 15 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హనీమూన్ టైం ముగిసింది. ఈ కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీ పనితీరుకు పరీక్షగా టీచర్లు, పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాల్లో పెనుమార్పులు సంభవించే అవకాశాలున్నాయి. దీంతోపాటు కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి పార్టీల్లో అంతర్గతంగా ఉన్న సవాళ్లపై మరింత స్పష్టత కూడా రానుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానంనుంచి ఆరేళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి భారీ విజయం సాధించారు. ఈ ఎంఎల్‌సి ఎన్నికల నుంచే రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌పతనం ప్రారంభమైంది.

ఈసారి జీవన్‌రెడ్డి ఎంఎల్‌సి ఎన్నికల పోటీకి దూరంగా ఉన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఇక్కడ గెలుపు అత్యవసరంగా మారింది. ఈ నియోజకవర్గంలోనే టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్ కూడా ఉండటంతో ఆయనతో పాటు కాంగ్రెస్‌కు ఈ ఎన్నిక అగ్నిపరీక్షగా మారింది. అయితే, ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికకు సరిగ్గా సన్నద్ధం కాకుండానే కాంగ్రెస్ బరిలోకి దిగింది. ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ఉన్న నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 42 అసెంబ్లీ సెగ్మంట్లు ఉండగా, వాటిలో కాంగ్రెస్ 19 స్థానాల్లో గెలుపొందింది. అనంతరం లోక్‌సభ ఎన్నికల నాటికి బలహీనపడిన కాంగ్రెస్ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పార్లమెంట్ నియోకవర్గాల్లో ఓడిపోయి, జహీరాబాద్, పెద్దపల్లి స్థానాల్లో గెలిచింది.ఆరు నెలల పరిధిలోనే ఎందుకు పార్టీ బలహీనపడిందనే విషయాన్ని సమీక్షించుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది.

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మంత్రులే లేరు. మరోవైపు ఎన్నో ఆశలతో కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టినా ఏ మార్పు రాలేదనే భావనలో నిరుద్యోగులున్నారు. ఈ ప్రభావాలన్నీ ఈ ఎంఎల్‌సి ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనపడబోతోంది. అధికారంలో ఉండి అన్నివనరులు ఉన్నా చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్ ప్రణాళిక రాహిత్యానికి నిదర్శనం. ఎన్నికలున్నాయని తెలిసి కూడా టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సహా ముఖ్యమైన నాయకులు విదేశీ పర్యటనల్లో గడిపారు. నామినేషన్‌కు వెళ్లడంతప్ప ముఖ్య నాయకులు సీరియస్‌గా చేసిందేమీ లేదు. ముఖ్యమంత్రిచేత సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్‌కు అది సెల్ఫ్‌గోల్ అయ్యే అవకాశాలున్నాయి. ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓడిపోయినా పోయేదేమీ లేదని సిఎం సభావేదికగా వ్యాఖ్యానించడం ఎన్నికల ముందే అధికార పార్టీ చేతులెత్తేసినట్లు అయ్యింది. ఎంఎల్‌సి ఎన్నికల్లో బిజెపి గట్టి పోటీ ఇస్తున్న సమయంలో సిఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని కలవడం వ్యూహాత్మక తప్పిదమే.

ఈ నేపథ్యంలో ఒకవేళ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే పార్టీలో అసమ్మతి గొంతులు పెరుగుతాయి. అవి తాత్కాలికంగా పాలపొంగు లాగా కరిగిపోవచ్చేమో కానీ, దీర్ఘకాలంలో పార్టీకి నష్టం చేకూర్చడం ఖాయం. కాంగ్రెస్ కూడా గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సిపి లాగే ‘పట్టభద్రులు మా ఓటర్లు కాదు’ అనుకుంటే మరింత నష్టపోవాల్సి వస్తుంది. పట్టభద్రుల ఎన్నికల్లో యువత కీలక ఓటర్లని తెలిసినా ఎన్‌ఎస్‌యుఐ, యూత్ కాంగ్రెస్ శ్రేణులు సమన్వయ లోపంతో ప్రచారానికి దూరంగాఉండడం పార్టీకి దెబ్బే. గ్రాడ్యుయేట్స్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన వేళ పార్టీలో కొందరు కీలక నేతలే కోవర్టులుగా పనిచేశారనే గుసగుసలు కాంగ్రెస్‌లో వినిపిస్తున్నాయి.

ప్రజల్లో, నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తున్న సమయంలో బిఆర్‌ఎస్ పోటీ చేయకపోవడం వ్యూహాత్మక తప్పిదమే. గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం పరిధిలో బిఆర్‌ఎస్ నుంచి 16 మంది ఎంఎల్‌ఎలు గెలుపొందారు. అనంతరం ఎంపి ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. కరీంనగర్ గడ్డ మీదే బిఆర్‌ఎస్ పురుడుపోసుకుని, అక్కడినుంచే తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించింది. ఉద్యమ సమయంలో కెసిఆర్ అరెస్టయింది కూడా ఆ గడ్డమీదే! ఇలాంటి చరిత్రాత్మక ప్రాంతంలో పోటీకి దూరంగా ఉండటం బిఆర్‌ఎస్ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. ఎంఎల్‌సి ఎన్నికల్లో ఒకవేళ బిజెపి గెలిస్తే, ఆ పార్టీ బలపడిందనే ప్రచారం జరిగితే బిఆర్‌ఎస్‌కు నష్టమే.

మరోవైపు బిఆర్‌ఎస్‌లో అంతర్గత సంక్షోభాలు కూడా ఈ ఎన్నికల తర్వాత మరింత బహిర్గతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాస్ లీడర్‌గా గుర్తింపు పొందిన హరీశ్‌రావుకు పార్టీలో ప్రాధాన్యత, గౌరవం ఇవ్వకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఖాళీని బిజెపి ఆక్రమించే అవకాశాలుంటాయి. 2018లో గెలిచిన తర్వాత హరీశ్‌రావుకు మంత్రి పదవి ఇవ్వలేదు. తర్వాత ఇచ్చినా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆ ప్రభావం 2023 ఎన్నికలమీద పడింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఆయనకు సరైన ప్రాధాన్యత, గౌరవం ఇవ్వకపోతే బిఆర్‌ఎస్ శాశ్వతంగా నష్టపోయే అవకాశాలున్నాయని ఆ పార్టీ కార్యకర్తలే అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు. కవిత బిఆర్‌ఎస్‌లో సొంత దుకాణం తెరిచినట్టు కనిపిస్తోంది. పార్టీ నిర్ణయాలకు భిన్నంగా వ్యవహరించడం, అనేకాంశాలపై ప్రణాళిక లేకుండా మాట్లాడటం, ఆమెను కెసిఆర్ కూడా నియంత్రించకపోవడం, కెటిఆర్‌కు ఆమెకు సఖ్యత లేకపోవడం అనేక సందేహాలకు తావిస్తున్నాయి.

కెటిఆర్ మాటల్లో సబ్జెక్టు ఉంటున్నా ఆయనపై ప్రజల్లోఉన్న అసహనం తగ్గలేదు. ఆయన అందరినీ కలుపుకుపోవడం లేదనే భావన పెరగడం బిఆర్‌ఎస్ గ్రాఫిక్ దెబ్బతీస్తోంది. పార్టీలో ఉన్న మూడు ముక్కలాటలతోనే బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి ఎన్నికలకు దూరంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో బిజెపి 7 ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది. లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటూ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఎంపి స్థానాల్లో విజయం సాధించింది. కానీ బిజెపి మొదటినుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యూహాత్మక తప్పిదాలు కొనసాగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు బిసి అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించి, అధ్యక్షుడిగా ఉన్న బిసి నేత బండి సంజయ్‌ను తొలగించారు. గతంలో బండిని పాదయాత్ర ఎందుకు ప్రారంభించమన్నారు? ఎందుకు అర్థంతరంగా ముగించమన్నారో ఆ పార్టీలో ఎవరికీ తెలియదు. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయకుండా మునుగోడు ఉపఎన్నికను కొని తెచ్చుకుని బిజెపి తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంది.

ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనే దానిపైనే బిజెపి భవిష్యత్తు ఉంది. బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రామచందర్‌రావు పోటీలో ఉన్నప్పటికీ, పార్టీలో అంతర్గతంగా సంజయ్‌కు ఎక్కువ ఆమోదం ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌తోపాటు, పార్టీని అభిమానించేవారు కూడా బండి సంజయ్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఆయనలో లోపాలుండవచ్చు కానీ, ఆయనకున్న నిబద్ధతను ఎవరూ కాదనలేరు. రేవంత్ రెడ్డిలో ఎన్ని లోపాలున్నా కాంగ్రెస్‌ను ఆయనే రక్షించగలడని ఎలాగైతే అనుకున్నారో, అలాగే బండి సంజయ్‌తోనే బిజెపి విజయం సాధ్యమని ఎక్కువమంది కార్యకర్తలు నమ్ముతున్నారు. పార్టీ అధ్యక్ష రేసులో ఉన్న ఈటల రాజేందర్‌కు హుజురాబాద్‌లో గెలిచినప్పుడున్నంత గ్లామర్ ఇప్పుడు లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన హుజురాబాద్‌కే పరిమితం కాకుండా గజ్వేల్లో కూడా పోటీ చేయడంతో రెండు చోట్లా ఓడిపోయారు. మల్కాజ్‌గిరి ఎంపిగా గెలిచినా మునుపటి క్రేజ్ లేదు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆమోదయోగ్యం కాదు. రాజేందర్‌ను కేంద్ర మంత్రిగా తీసుకుని, బండి సంజయ్‌ను మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలనే అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది. కుల సమీకరణాల దృష్ట్యా రఘునందన్ రావు కెసిఆర్ సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి ఆయన్ను పరిగణనలోకి తీసుకునే అవకాశాలు తక్కువ.

మరో నేత మురళీధర్ రావుదీ ఇదే పరిస్థితి. ఈయన మొదటి నుంచి పార్టీవాది అయినప్పటికీ జనానికి పెద్దగా తెలిసిన మనిషికాదు. అధ్యక్షపదవికి పోటీపడుతున్న రాంచందర్ రావుకు మాస్ లీడర్‌గా గుర్తింపు లేదు. రెండు ఉపాధ్యాయ ఎంఎల్‌సిల్లో, ఒక పట్టభద్ర ఎంఎల్‌సికి పోటీ చేస్తున్న బిజెపి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ స్థానంలో గట్టిపోటీ ఇస్తున్నా, టికెట్ దక్కనివారు అసంతృప్తిగా ఉన్నారు. క్షేత్రస్థాయిలో బిజెపి విజయానికి సంఫ్‌ు పరివార్ కృషి చేస్తున్నా పార్టీ తప్పుడు వ్యూహాలతో ఆశించిన ఫలితాలు రావడం కష్టమే అని పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.అధికారంలోఉన్న కాంగ్రెస్ ప్రభావం చూపించలేకపోతుండటం, ప్రతిపక్ష బిఆర్‌ఎస్ వ్యూహపరమైన పొరపాట్లు చేస్తుండటం, బిజెపి దేశవ్యాప్తంగా బలపడుతున్నా తెలంగాణలో అంతర్గత కలహాలు ఇంకా కొనసాగుతుండటం.. ఇలా మూడు పార్టీలూ ప్రస్తుతానికి సంక్షోభ పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఈ పార్టీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయ వైకుంఠపాళిలో ఎవరి స్థానం ఎలా మారుతుందో వేచిచూడాలి.

జి. మురళీ కృష్ణ

(రచయిత సీనియర్ రీసెర్చర్, ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News