Sunday, February 9, 2025

కాంగ్రెసోళ్లు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు

- Advertisement -
- Advertisement -

ప్రజలు తిడుతున్న తిట్లకు రేవంత్ రెడ్డి కాకుండా
వేరే వాళ్లు ఉంటే ఆత్మహత్య చేసుకునేవారు
ఐరన్‌లెగ్ సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి
కాంగ్రెస్‌కు గుండుసున్న తీసుకొచ్చారు
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని.. ఒక వేళ వెళ్తే ప్రజలు తరిమి కొడతారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా పోలీస్ సెక్యూరిటీ లేకుండా బయట తిరిగే అవకాశం లేదని చెప్పారు. ప్రజలు తిడుతున్న తిట్లకు రేవంత్ రెడ్డి కాకుండా వేరే వాళ్లు ఉంటే ఆత్మహత్య చేసుకునేవారని ఆరోపించారు. తెలుగు భాషలో ఉన్న అన్ని తిట్లను ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలు కోపంగా ఉన్నారని, ఇంత దుర్మార్గమైన పాలన చేయాల్సిన అవసరం కాంగ్రెస్‌కు ఏమున్నదో ఆలోచించుకోవాలని సూచించారు.

తెలంగాణ భవన్‌లో శనివారం వికారాబాద్ బిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తల సమావేశం, సిర్పూర్ కాగజ్‌నగర్ బిఆర్‌ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశాలలో బిఆర్‌ఎస్ నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆయా నియోజకవర్గ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భగా కెటిఆర్ మాట్లాడుతూ, స్థానిక ఎన్నికలపై బిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సంవత్సరంలోపే కాంగ్రెస్ పార్టీ వైఖరిని తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారని వ్యాఖ్యానించారు. సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటల మనుషులే కానీ చేతల ప్రభుత్వం కాదు అని అర్థమైందని అన్నారు. తెలంగాణ నలుమూలల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా వ్యతిరేకత ఉందని చెప్పారు.140 ఎకరాల భూమి కోసం కొడంగల్‌ల్లోని ఒక ఊరికి 450మంది పోలీసులను సిఎం రేవంత్ పంపించారని ఆరోపించారు. తెలంగాణలో పేదవాళ్లు బతుక వద్దా..? అని ప్రశ్నించారు.

ఖచ్చితంగా వాళ్ల ఇళ్లను, దుకాణాలను రేవంత్ రెడ్డి కూలగొడతారని అన్నారు. 10 సంవత్సరాలపాటు తెలంగాణలో పేదల గురించి ఆలోచించి కెసిఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని చెప్పారు. అప్పుడప్పుడు సూర్యుడు కూడా మబ్బుల చాటుకు వెళ్తాడని.. కెసిఆర్ కూడా తప్పకుండా తిరిగి ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. సిర్పూర్ కాగజ్‌నగర్‌తో తనకు వ్యక్తిగతంగా అనుబంధం ఉందని తెలిపారు. కాగజ్ నగర్‌లో బిఆర్‌ఎస్‌ను బలోపేతం చేశామని అన్నారు. కాగజ్‌నగర్ పేపర్ మిల్లును తెరిపించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేశానని గుర్తుచేశారు. కెసిఆర్‌తోనే బహుజనుల అభివృద్ధి జరుగుతుందని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ నమ్మారని తెలిపారు.

ప్రతిపక్షంలో ఉన్నా బిఆర్‌ఎస్‌తో కలిసి వచ్చేందుకు ముందుకు వచ్చిన నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అని, తెలంగాణ సమాజం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, భవిష్యత్తు తెలంగాణ గురించి ప్రవీణ్ కుమార్ ఆలోచనలు తన ఆలోచనలు దాదాపు ఒకే రకంగా ఉన్నాయని చెప్పారు. 8 మంది చొప్పున కాంగ్రెస్, బిజెపి ఎంపీలు తెలంగాణ నుంచి గెలిచిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి తెచ్చింది శూన్యమని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేమని చెప్పినా.. ఒక్క కాంగ్రెస్, బిజెపి ఎంపీలు ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు. లోక్‌సభలో తాము ఉండుంటే కేంద్ర ప్రభుత్వంపై కోట్లాడే వారమని తెలిపారు.

బిజెపికి అతిపెద్ద కార్యకర్త రాహుల్ గాంధీనే

ఐరన్‌లెగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి కాంగ్రెస్‌కు గుండుసున్న తీసుకొచ్చారని కెటిఆర్ విమర్శించారు. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ పార్టీ పతనాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించి ఢిల్లీలో ముగించారని, రాబోయే రోజుల్లో ఇంకా దాన్ని కొనసాగిస్తారని ఆరోపించారు. రాహుల్ గాంధీ దేశంలో బిజెపిని గెలిపించి వస్తున్నారని, ఈ దేశంలో నరేంద్ర మోడీ బిజెపికి అతిపెద్ద కార్యకర్త రాహుల్ గాంధీనే అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుబంధుకు రాం రాం అని కెసిఆర్ గారు ముందే చెప్పారని, ఆయన హెచ్చరించినట్టే రైతుబంధుకు రామ్ రామ్ అయిందని అన్నారు. అధికారం కోసం పార్టీలు మారే అవకాశవాదుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. రానున్న స్థానిక సంస్థల్లో బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను భారీగా గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని చెప్పారు. పట్నం మహేందర్ రెడ్డి వెన్నుపోటు కారణంగానే మెతుకు ఆనంద్ ఓడిపోయారని ఆరోపించారు.

మోసగాళ్లంతా పార్టీ నుంచి వెళ్లిపోయారు

మోసగాళ్లంతా పార్టీ నుంచి వెళ్లిపోయారని, ఇప్పుడు నిఖార్సయిన కార్యకర్తలు, నాయకులు మాత్రమే ఉన్నారని కెటిఆర్ పేర్కొన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ సిఎం రేవంత్ రెడ్డి సూచనలతోనే సభ నడిపిస్తున్నారని, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలకు మైక్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రజా పాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలకు మైకు ఇవ్వడానికి వణికిపోతున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు ఫుట్ బాల్ ఆడుతున్నారని తెలిపారు. 100 శాతం రుణమాఫీ జరిగిందని ఏ ఒక్క ఊర్లోనైనా రైతులు చెబితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అసెంబ్లీలోనే తాను చెప్పానని, ఇప్పుడు కూడా అదే మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. 25 శాతం కూడా రాష్ట్రంలో రుణమాఫీ కాలేదని పేర్కొన్నారు. 49,500 కోట్ల రూపాయలు రుణమాఫీ కోసం కావాలని, రేవంత్ రెడ్డి 40 వేల కోట్ల రుణమాఫీ అని తప్పుడు లెక్కలు చెప్పారని అన్నారు.

ఆ తర్వాత క్యాబినెట్ సమావేశంలో 31 వేల కోట్ల రుణమాఫీ అన్నారని, అసెంబ్లీ బడ్జెట్‌లో 26 వేల కోట్లు అన్నారని విమర్శించారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన సమావేశంలో రుణమాఫీ మొత్తం చేశానని, 18 వేల కోట్లు ఇచ్చారని ముఖ్యమంత్రి చెప్పారని, ఇప్పుటి వరకు 11 వేల కోట్ల రూపాయల కూడా ఖాతాలలో పడలేదని భట్టి విక్రమార్క నిజం చెప్పారని పేర్కొన్నారు.కెసిఆర్ ఉంచిన పైసలే అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా లాగా రేవంత్ రెడ్డి ఇచ్చారని, అవే పైసల్ని ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్లే ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసి రైతుల ఖాతాల్లో పడకుండా చేశారని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటివరకు రేవంత్‌రెడ్డి రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. టకి టకీ మని రైతు భరోసా పైసలు పడతాయని రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ ఒక రూపాయి రాలేదని ఆరోపించారు. టకి టకీ మని తులం బంగారం పడలేదని, టకీ టకీ మని మహిళలకు 2500 సహాయం అందలేదని, టకి టకిమని వృద్ధులకు 4000 రూపాయల పెన్షన్లు కూడా పడలేదని విమర్శించారు.

ప్రజల్లో బిఆర్‌ఎస్‌కు అనుకూలమైన వాతావరణం ఉంది

తెలంగాణ ప్రజల్లో బిఆర్‌ఎస్‌కు అనుకూలమైన వాతావరణం ఉందని, కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని కెటిఆర్ తెలిపారు. బిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు ఐకమత్యంతో పని చేయాలని కోరారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల గుండెల్లో ఉందని వ్యాఖ్యానించారు. వికారాబాద్ నియోజకవర్గంలోని 6 మండలాలు, ఒక మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరేసి మన సత్తా చూపించాలని పిలుపునిచ్చారు. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని గెలుపు గుర్రాలకు టికెట్ ఇచ్చేలా మెతుకు ఆనంద్ చూడాలని, అసంతృప్తులను బుజ్జగించాలని సూచించారు. ప్రత్యేకంగా అబ్జర్వర్లను పంపి స్థానిక పరిస్థితులను బిఆర్‌ఎస్ కేంద్ర నాయకత్వం సమీక్షిస్తుందని తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిషత్, వికారాబాద్‌లోని అన్ని మండల పరిషత్‌ల మీద గులాబీ జెండా ఎగరవేయాలని కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News