Friday, July 5, 2024

కారులోనే సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర.. రూ.25 లక్షల కాంట్రాక్ట్

- Advertisement -
- Advertisement -

ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ పన్నిన భారీ కుట్ర వెలుగు లోకి వచ్చింది. ఏప్రిల్‌లో సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పుల కేసు దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. నవీ ముంబై పోలీస్‌లు ఈమేరకు దాఖలు చేసిన 350 పేజీల ఛార్జిషీట్‌లో కీలక అంశాలు ప్రస్తావించారు. సల్మాన్ హత్యకు ఆ గ్యాంగ్ పక్కా ప్లానింగ్‌తో వ్యవహరిస్తోంది.

అచ్చంగా పంజాబీ సింగర్ సిద్ధూమూసేవాలా హత్య తరహా లోనే కారులో హత్య చేయాలని నిర్ణయించినట్టు పోలీస్‌లు గుర్తించారు. ఇందుకోసం మైనర్లను షార్పు షూటర్లుగా వాడేందుకు ఈ గ్యాంగ్ ఏర్పాట్లు చేసింది. సినిమా షూటింగ్‌లు లేదా పన్వేల్ ఫామ్‌హౌస్‌కు సల్మాన్ రాకపోకలు సాగిస్తున్న వేళ ఈ కుట్రను అమలు చేయాలనుకొన్నట్లు తెలిపారు. ఇక హత్యకు రూ. 25 లక్షల కాంట్రాక్టు కూడా ఇచ్చింది. 2023 ఆగస్టు నుంచి 2024 ఏప్రిల్ మధ్య రూపొందించింది. టర్కీ నుంచి జిగాన పిస్టోళ్లను తెప్పించేందుకు పథకం సిద్ధం చేసింది.

గతంలో సింగర్ సిద్ధూ మూసేవాలా, గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ హత్యల్లో ఈ తుపాకులు వాడారు. టర్కీకు చెందిన టిసాస్ కంపెనీ ఈ సెమీ ఆటోమేటిక్ ఆయుధాన్ని తయారు చేస్తోంది. అక్కడ పాలిమర్ పేరుతో తయారైన తొలి పిస్తోల్ ఇదే. ఈ ఆయుధం ఖరీదు ఒక్కోటీ రూ.6 లక్షలకు పైనే. అక్కడి సైన్యం, స్పెషల్ ఫోర్సెస్, ఇతర సెక్యూరిటీ ఏజెన్సీలు వీటిని వాడుతున్నాయి. దీనిలో బరస్ట్‌మోడ్‌తో అత్యంత వేగంగా కాల్పులు జరపవచ్చు.

భారత్‌లో వీటిపై నిషేధం ఉంది. ఈ మొత్తం కుట్రను అమలు చేయడానికి లారెన్స్ బిష్ణోయ్ సంపత్ నెహ్రా గ్యాంగులకు చెందిన 70 మందితో ఓ భారీ నెట్‌వర్క్ ఏర్పాటు చేశారు. వీరు సల్మాన్ కదలికలపై నిఘా పెట్టారు. ఇక హత్యా పథకాన్ని అమలు చేసేందుకు 18 ఏళ్ల లోపు మైనర్లను సిద్ధం చేసినట్టు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే వారు గోల్డీబ్రార్, అన్మోల్ బిష్ణోయ్ ఆర్డర్ల కోసం ఎదురుచూస్తున్నట్టు గుర్తించారు. హత్య తరువాత కన్యాకుమారి మీదుగా శ్రీలంకకు పారిపేయేలా ప్రణాళిక కూడా సిద్ధమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News