Tuesday, September 17, 2024

వచ్చే వారానికి కరోనా కేసులు 20 కోట్లు దాటే ప్రమాదం

- Advertisement -
- Advertisement -
Corona cases risk crossing 20 crore next week
టీకా బూస్టర్ ఇప్పుడే వద్దు : డబ్లుహెచ్‌ఒ సూచన

న్యూయార్క్ : అత్యధికంగా వ్యాపించే డెల్టా వేరియంట్ ఇప్పుడు 135 దేశాల్లో కలవరం సృష్టిస్తోందని, దీనివల్ల వచ్చే వారానికి కరోనా కేసుల సంఖ్య 20 కోట్లు దాటే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) వెల్లడించింది. కొవిడ్ వారాంతపు నివేదకను డబ్లుహెచ్‌ఒ విడుదల చేసింది. 132 దేశాల్లో బీటా వేరియంట్ 182 దేశాల్లో బీటా వేరియంట్ , 81 దేశాల్లో గామా వేరియంట్ వ్యాపించాయని వివరించింది. నెల రోజుల్లో కొత్త కేసులు బాగా పెరిగాయని, గత వారంలో జులై 28 నుంచి ఆగస్టు 1 వరకు 40 లక్షలకు మించి కేసులు నమోదయ్యాయని పేర్కొంది.

గత వారంతో పోల్చితే తూర్పు మధ్యధరా ప్రాంతంలో 37 శాతం, పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో 33 శాతం ఆగ్నేయాసియా రీజియన్‌లో 9 శాతం వరకు కేసులు పెరిగాయని వెల్లడించింది. గత వారంతో పోల్చితే మొత్తం మీద ఈవారం మరణాల సంఖ్య 8 శాతం వరకు తగ్గినా మొత్తం 64,000 మరణాలు సంభవించాయని వివరించింది. తాజా మరణాల్లో పశ్చిమ పసిఫిక్ , తూర్పు మధ్యధరా ప్రాంతాల్లో క్రమంగా 48 శాతం, ౩1 శాతం వరకు పెరిగాయని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు దాదాపు 19.7కోట్లు వరకు కేసులు పెరిగాయని, అలాగే మరణాలు 40 లక్షల 20 వేల వరకు సంభవించాయని వివరించింది. ఇదే పరిస్థితి కొనసాగితే కేసులు 20 కోట్ల వరకు వచ్చే వారానికి పెరగవచ్చని పేర్కొంది.

అమెరికా లోనే కొత్త కేసులు ఎక్కువ

ప్రపంచ దేశాలన్నిటి లోను అమెరికా లోనే కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, గత వారం రోజులుగా కొత్త కేసులు 5,43,420 వరకు నమోదై 9 శాతం వరకు పెరుగుదల కనిపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది. భారత్‌లో 2,83,923 కొత్త కేసులు నమోదై 7 శాతం పెరుగుదల, ఇండోనేసియాలో కొత్త కేసులు 2,73,891 కాగా, పెరుగుదల 5 శాతం, బ్రెజిల్‌లో కొత్త కేసులు 2,47,830 నమోదై పెరుగుదల 24 శాతం ,ఉంది. ఇరాన్‌లో కొత్త కేసులు 2,06,722 వరకు నమోదై, 27 శాతం వరకు పెరుగుదల కనిపించిందని వివరించింది.

ఇండోనేసియాలో ఎక్కువ మరణాలు

అన్ని దేశాల కన్నా ఇండోనేసియాలో ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవించాయి. కొత్తగా 12,444 మరణాలు సంభవించాయి. అంటే లక్షకు 4.5 వంతున కొత్తగా మరణాలు సంభవించి 28 శాతం వంతున మరణాలు పెరిగాయి. భారత్‌లో కొత్తగా 3800 మంది మృతి చెందారు. లక్ష మందికి ఒకరు కన్నా తక్కువ మంది మృతి చెందారు. అంటే మరణాల్లో 45 శాతం తగ్గుదల కనిపించింది. మయన్మార్‌లో రొత్తగా 2620 మరణాలు సంభవించాయి. లక్షకు 4.8 వంతున మరణాలు సంభవించి 24 శాతం పెరుగుదల కనిపించింది.

సెప్టెంబర్ వరకు బూస్టర్ డోస్ వద్దు

డెల్టా వేరియంట్ విపరీతంగా పెరుగుతుండగా, మరో వైపు టీకా పంపిణీలో అసమానత కొనసాగుతుండడంపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన వెలిబుచ్చింది. స్వల్పాదాయ, ధనిక దేశాల మధ్య టీకాల డ్రైవ్‌లో తేడా అసమానత ఉన్నందున కనీసం సెప్టెంబర్ నెలాఖరువరకైనా బూస్టర్‌డోసులు వాడవద్దని సూచించింది. ఈ నేపధ్యంలో జెనీవాలో బుధవారం డబ్లుహెచ్‌ఒ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ అన్ని దేశాలు కనీసం 10 శాతం మంది ప్రజలకైనా రెండు డోసులు అందేలా చూడాలని ప్రపంచ దేశాలను కోరారు. కోట్ల మంది ప్రజలకు ఇప్పటికీ ఒక్క డోసు కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు వరకైనా మూడో డోసు ఆలోచనలను మానుకోవాలని సూచించారు. ధనిక దేశాలు దాదాపు ప్రతి వందమందికి వంద డోసులు వంతున టీకాలను అందించాయని, ఇదే సమయంలో స్వల్పాదాయ దేశాల్లో వ్యాక్సిన్ సరఫరా సరిగ్గా లేక ప్రతి వంద మందికి 1.5 డోసులు మాత్రమే అందాయని వివరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి దేశంలో జనాభాలో కనీసం 10 శాతం మందికైనా టీకా అందే వరకు సెప్టెంబర్ ఆఖరు వరకు బూస్టర్ డోసులు వాడవద్దని సూచిస్తున్నట్టు చెప్పారు. ప్రతిదేశం ఈ ఏడాది ఆఖరికి కనీసం 40 శాతం మందికి, వచ్చే ఏడాది మధ్యలో 70 శాతం మందికి టీకా అందేలా లక్షం నెరవేర్చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలకు సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News